విశాఖలో పర్యటించి తీరుతా.. ఎన్నిసార్లు ఆపగలరో చూస్తా : చంద్రబాబు

  • Published By: veegamteam ,Published On : February 28, 2020 / 08:30 AM IST
విశాఖలో పర్యటించి తీరుతా.. ఎన్నిసార్లు ఆపగలరో చూస్తా : చంద్రబాబు

వైసీపీ సర్కార్‌తోపాటు పోలీసుల తీరుపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుమతిచ్చిన ప్రోగ్రామ్‌కు ఆటంకాలు సృష్టించడమేంటని మండిపడ్డారు. పోలీసుల తీరు తీవ్ర అభ్యంతరకరంగా ఉందన్నారు. శుక్రవారం అమరావతి టీడీపీ నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసుల సహకారం లేకుండా వైసీపీ కార్యకర్తలు ఎయిర్‌పోర్ట్‌కు ఎలా రాగలిగారు ప్రశ్నించారు. కాన్వాయ్‌పై దాడి చేసినవారిపై పోలీసులు ఎందుకు కేసులు పెట్టలేదని మండిపడ్డారు.

పోలీసుల సహకారంతోనే వైసీపీ నిరసనలు చేపట్టిందని ఆరోపించారు. విశాఖలో పర్యటించి తీరుతానని.. ఎన్నిసార్లు ఆపగలరో చూస్తానంటూ సర్కార్‌కు సవాల్‌ విసిరారు. ఈ కాన్ఫరెన్స్‌లో విశాఖ ఘటనపై లోతుగా చర్చించినట్లు తెలుస్తోంది. దీనిపై టీడీపీ న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

విశాఖ విమానాశ్రయంలో పోలీసుల తీరుపై హైకోర్టులో టీడీపీ లంచ్‌మోషన్ పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిని హైకోర్టు విచారణకు స్వీకరించింది. మధ్యాహ్నం ఈ పిటిషన్‌పై విచారణ నిర్వహించనుంది.