ఎన్నికల వేళ దుబ్బాకలో కాంగ్రెస్కు బిగ్ షాక్.. టీఆర్ఎస్ లోకి కాంగ్రెస్ సీనియర్ నాయకులు, 2వేల మంది అనుచరులు
dubbaka bypolls: ఎన్నికల వేళ దుబ్బాకలో కాంగ్రెస్ కు గట్టి షాక్ తగిలింది. కాంగ్రెస్ కు చెందిన ఇద్దరు సీనియర్ నాయకులు టీఆర్ఎస్ లో చేరనున్నారు. కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడ్డ సీనియర్ నాయకులు నర్సింహారెడ్డి, మనోహర్ రావులు టీఆర్ఎస్ లో చేరాలని నిర్ణయించారు. మంత్రి హరీష్ రావు సమక్షంలో వారు టీఆర్ఎస్ కండువా కప్పుకోనున్నారు. 2వేల మంది అనుచరులతో నర్సింహారెడ్డి, మనోహర్ రావులు కారెక్కనున్నారు.
దుబ్బాక అసెంబ్లీ స్థానానికి జరిగే ఉపఎన్నికలో విజయం సాధించాలని ఉవ్విళ్లూరుతున్న కాంగ్రెస్ పార్టీకి ఈ పరిణామం గట్టి ఎదురు దెబ్బ అనే చెప్పాలి. టికెట్ ఆశించి భంగపడ్డ సీనియర్ నేతలు నర్సింహారెడ్డి, మనోహర్రావు పార్టీకి ఝలక్ ఇచ్చారు. అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు.
మంత్రి హరీష్ రావు సమక్షంలో గులాబీ దళంలో చేరనున్నారు. సుమారు రెండు వేల మంది అనుచరులతో కలిసి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు. కాగా దుబ్బాక ఎమ్మెల్యేగా ఉన్న టీఆర్ఎస్ నాయకులు సోలిపేట రామలింగారెడ్డి ఆగస్టులో మరణించిన విషయం విదితమే. దీంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది.
నవంబర్ 3న పోలింగ్ నిర్వహించనున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థిగా రామలింగారెడ్డి సతీమణి సోలిపేట సుజాత, కాంగ్రెస్ అభ్యర్థిగా చెరుకు శ్రీనివాస్రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా రఘునందన్రావు పేర్లను ఆయా పార్టీలు ప్రకటించడంతో త్రిముఖ పోటీ నెలకొంది. టీఆర్ఎస్ నుంచి టికెట్ ఆశించి నిరాశకు గురైన చెరుకు శ్రీనివాస్రెడ్డి ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉండగా.. దుబ్బాక బీజేపీలోనూ అసంతృప్తి జ్వాలలు చెలరేగుతున్నాయి. రఘునందన్రావుకు టికెట్ కేటాయించడం పట్ల తోట కమలాకర్రెడ్డి విమర్శలు చేయగా, పార్టీ ఆయనను బహిష్కరించింది. నేటి నుంచి నామినేషన్ల దాఖలు ప్రక్రియ ప్రారంభం కావడంతో ఎన్నికల సందడి ఊపందుకుంది.
షెడ్యూల్ వివరాలు:
నామినేషన్ల దాఖలు ప్రారంభం: అక్టోబర్ 9
నామినేషన్ల చివరి తేదీ : అక్టోబర్ 16
నామినేషన్ల పరిశీలన : అక్టోబర్ 17
ఉపసంహరణ చివరి తేదీ: అక్టోబర్ 19
పోలింగ్ తేదీ : నవంబర్ 3
కౌంటింగ్ తేదీ : నవంబర్ 10