లాభాల్లో తెలంగాణ ఆర్టీసీ, రోజుకు రూ.1.50 కోట్లు

  • Published By: madhu ,Published On : March 12, 2020 / 07:52 AM IST
లాభాల్లో తెలంగాణ ఆర్టీసీ, రోజుకు రూ.1.50 కోట్లు

తెలంగాణ ఆర్టీసీ లాభాల బాటలో పయనిస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వెల్లడించారు. ఆర్టీసీకి రోజుకు రూ. 1.50 కోట్లు లాభం వస్తోందని తెలిపారు. గత రెండు నెలలుగా ఆర్టీసీకి వచ్చిన ఆదాయంతోనే జీతాలిస్తున్నట్లు వెల్లడించారు. 2020, మార్చి 12వ తేదీ గురువారం ఆయన మాట్లాడారు. ఉద్యోగులకు ఇవ్వాల్సిన సీసీఎస్ బకాయిలు, పీఎఫ్ బకాయిల చెల్లింపుల కోసం…రూ. 600 కోట్లు అప్పు ఇచ్చేందుకు బ్యాంకులు ముందుకొచ్చాయన్నారు.

జులై నాటికి రూ. 20 కోట్లతో ఖమ్మంలో బస్టాండు నిర్మాణం చేస్తామని, ప్రజాప్రతినిధుల ఫోన్లు ఆర్టీసీ అధికారులు లిఫ్ట్ చేయకపోవడం..సమాచారం ఇవ్వకపోవడం తప్పు అని వెల్లడించారు. ఆర్టీసీ పార్శిల్ సర్వీసుల ద్వారా సంవత్సరానికి రూ. 300 కోట్లు వస్తుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. 2020, మార్చి నెలాఖరుకు 100 కార్గొ బస్సులు సిద్ధం చేస్తామని ప్రకటించారు. 

ఇటీవలే ఆర్టీసీ కార్మికులు సుదీర్ఘంగా 52 రోజలు పాటు సమ్మె చేసిన సంగతి తెలిసిందే. దీంతో స్వయంగా కేసీఆర్ రంగంలోకి దిగి..పలు చర్యలు తీసుకున్నారు. ప్రతి ఏటా బడ్జెట్‌లో ఆర్టీసీకి రూ. 1000 కోట్లు కేటాయించనున్నట్లు, నాలుగు నెలల్లోనే ఆర్టీసీ లాభాల బాట పట్టాలని సూచించారు. ప్రత్యేకంగా తెలంగాణ ఆర్టీసీ కార్మికులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.

సమ్మె కాలానికి సంబంధించిన వేతనాన్ని కూడా తాము అందిస్తామని, ఏ ఒక్క కార్మికుడిని కూడా తీసివేయమని హామీనిచ్చారు. సమ్మె సందర్భంగా చనిపోయిన కుటుంబసభ్యుల్లో ఒకరికి ఉద్యోగం కల్పిస్తామన్నారు. ఆర్టీసీ మహిళా కార్మికుల విషయంలో కూడా పలు నిర్ణయాలు తీసుకున్నారు. ప్రసూతి సెలవులు మంజూరు చేయడంతో పాటు..రాత్రి 8 గంటలకు విధులు ముగిసేలా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు సీఎం కేసీఆర్. ప్రస్తుతం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల ఆర్టీసీ లాభాల బాటలో పయనిస్తోంది. 

See Also | నిజాలు తెలుసుకోకుండా రేవంత్‌ను ఎలా సమర్ధిస్తారు’.. గులాంనబీ ఆజాద్‌పై కాంగ్రెస్ సీనియర్ల సీరియస్