జనసేన సంచలనం : 175 సీట్లలో ఒంటరిగా పోటీ

  • Published By: madhu ,Published On : January 3, 2019 / 06:40 AM IST
జనసేన సంచలనం : 175 సీట్లలో ఒంటరిగా పోటీ

విజయవాడ : 2019 ఎన్నికల్లో జనసేన ఎన్నిస్థానాల్లో పోటీ చేస్తుంది ? ఎవరికి సపోర్టు చేస్తుంది ? తదితర విషయాలపై క్లారిటీ వచ్చేసింది. ఏపీ ప్రభుత్వంపై కేంద్రం చూపిస్తున్న వివక్షను ఎండగట్టేందుకు..తమతో కలిసి పోరాటం చేయాలని..ఇందుకు జనసేన సపోర్టు ఇవ్వాలని ఏపీ సీఎం చంద్రబాబు చాలా సార్లు కోరుతూ వచ్చారు. దీనిపై జనసేనానీ నేరుగా స్పందించకపోయినా ట్విట్టర్ ద్వారా సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు. 
175 స్థానాల్లో పోటీ…
ఎన్నికల పోటీపై జనసేనానీ ట్వీట్ చేశారు. జనసేన పార్టీ 175 స్థానాల్లో ఒంటరిగానే పోటీ చేస్తున్నట్లు ప్రకటించి కలకలం రేపారు. వామపక్షాలతో మాత్రమే కలిసి వెళుతామంటూ మిగతా పార్టీలకు షాక్ ఇచ్చారు. ఎన్నికల్లో యువతకు , మహిళలకు ఎక్కువ అవకాశం ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్న పవన్…ప్రతిపక్షాల మాటలు నమ్మొద్దని రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఏ పార్టీ అండ దండా అక్కర్లేదని…“మన బలం జనం చూపిద్దాం ప్రభంజనం.” అని ఇటీవలే పవన్ పేర్కొన్న సంగతి తెలిసిందే. 
జిల్లాల వారీగా సమీక్షలు…
2019 ఎన్నికల ప్రచారం విజయవాడ నుంచి ప్రారంభిస్తానని ప్రకటించిన పవన్‌… ప్రస్తుతం రోజుకు రెండు జిల్లాలకు సంబంధించి సమీక్షలు నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నారు. వాస్తవానికి బుధవారం నుంచే  ఈ సమావేశాలు జరగాల్సి ఉన్నా  నేటికి వాయిదా పడ్డాయి.  ఇవాళ  విశాఖ, శ్రీకాకుళం జిల్లాల సమీక్షకు అజెండా సిద్ధమైంది. వీలైతే రానున్న రోజుల్లో రోజుకు మూడు జిల్లాల పార్టీ సమీక్షలు పూర్తిచేసే అవకాశముందని పార్టీ వర్గాలు తెలిపాయి.