KCR: అందుకే కామారెడ్డి నుంచి కేసీఆర్ పోటీ.. భారీ మెజార్టీ ఖాయమా?
కేసీఆర్ కామారెడ్డి నుంచి పోటీ చేస్తుండటంతో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. గులాబీ బాస్ ఎత్తుగడలపై జోరుగా చర్చ జరుగుతోంది.
CM KCR: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు చోట్ల నుంచి బరిలోకి దిగుతున్నారు. గజ్వేల్తో పాటు కామారెడ్డి (Kamareddy) నుంచి పోటీ చేస్తున్నారు. ఎన్నికల్లో స్థానాలు మార్చుకుంటూ కేసీఆర్ ప్రయోగాలు చేస్తారు. ఈసారి కామారెడ్డిని ఎంచుకున్నారు. అయితే కామారెడ్డి నుంచి పోటీ చేయడానికి మూడు ప్రధాన కారణాలు ఉన్నాయని తెలుస్తోంది. కామారెడ్డిలో BRS గెలుపుపై చేయించిన సర్వేలో ప్రతికూల ఫలితాలు వచ్చినట్టు సమాచారం. అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి షబ్బీర్ అలీకి (Mohammed Ali Shabbir) సానుకూల వాతావరణం ఉన్నట్టు సర్వేల్లో తేలిందని తెలుస్తోంది. అందుకే తాను పోటీ చేస్తే సీటు కోల్పోకుండా ఉంటుందని మెుదటి వ్యూహంగా కనిపిస్తోంది. కామారెడ్డిలో గెలిచి జిల్లాలో క్లీన్ స్వీప్ చేయాలని అనుకుంటున్నారని తెలుస్తోంది. అక్కడ్నుంచి పోటీ చేస్తే.. చుట్టు పక్కల ఉన్న జగిత్యాల, సిరిసిల్ల, మెదక్లో బీఆర్ఎస్కు మరింత బలం చేకూరే అవకాశం ఉందని భావిస్తున్నట్లు సమాచారం.
కామారెడ్డిలో గెలుస్తూనే ఉత్తర తెలంగాణలో పార్టీని బలోపేతం చేస్తూ అభ్యర్థులను గెలిపించుకోవాలని KCR ద్విముఖ వ్యూహం అనుసరించనున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి పోటీ చేసి గెలిస్తే తమ జిల్లా అభివృద్ధిలోకి వస్తోందని ప్రజలు ఆశిస్తున్నారు. గజ్వేల్, సిద్దిపేట తరహాలో మారిపోతాయని కలలు కంటున్నారు. కేసీఆర్ పోటీ చేయటం అదృష్టంగా భావిస్తున్నామని.. ఆయన్ను భారీ మెజార్టీతో గెలిపించి తీరుతామని కామారెడ్డి మున్సిపల్ ఛైర్మన్ జాహ్నవి తెలిపారు.
Also Read: తెలంగాణ కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ ఇదే..! 40 మందితో జాబితా సిద్ధం.. 10 టీవీ ఎక్స్క్లూజివ్ రిపోర్ట్
సీఎం కేసీఆర్ తల్లి స్వగ్రామం కామారెడ్డిలోని బీబీపేట మండలం పోసానిపల్లి గ్రామం. ప్రస్తుతం కోనాపూర్ అని పిలుస్తున్నారు. కేసీఆర్ తండ్రి రాఘవరావుది సిరిసిల్ల జిల్లాలోని ముస్తాబాద్ మండలం మోహినికుంట. వెంకటమ్మను వివాహం చేసుకున్న తర్వాత రాఘవరావు పోసానిపల్లికి వచ్చారు. ఎగువ మానేర్ ప్రాజెక్ట్ నిర్మాణంలో పోసానిపల్లి ముంపునకు గురైంది. ఆ సమయంలో రాఘవరావుకి చెందిన వందలాది ఎకరాలు ముంపునకు గురయ్యాయి.
Also Read: బీజేపీలోని ఐదుగురు ముఖ్యనేతలపై ఫోకస్ పెట్టిన హస్తం పార్టీ!
పోసానిపల్లి వాసులకు అప్పటి ప్రభుత్వం కోనాపూర్లో ఇళ్లు నిర్మించారు. ఆ సమయంలోనే కేసీఆర్ కుటుంబం సిద్దిపేట జిల్లా చింతమడకకు వలస వెళ్లి స్థిర పడింది. గతేడాది కోనాపూర్లో పలు అభివృద్ధి కార్యక్రమాల కోసం మంత్రి కేటీఆర్ వెళ్లారు. ఆ సమయంలో తన నానమ్మ నివాసం ఉన్న ఇల్లుని సందర్శించి పూర్వికులను గుర్తు చేసుకున్నారు. సొంత నిధులు రెండున్నర కోట్లతో ప్రభుత్వ స్కూల్ నిర్మించడంతో పాటు బీటీ, సీసీరోడ్లు, కల్వర్టులు నిర్మాణం చేపట్టారు. ఇప్పుడు KCR గెలిస్తే మరింత అభివృద్ధి జరుగుతుందంటున్నారు స్థానికులు. కేసీఆర్ కామారెడ్డి నుంచి పోటీ చేస్తుండటంతో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. గులాబీ బాస్ ఎత్తుగడలపై జోరుగా చర్చ జరుగుతోంది.