Navaratri 2023 : ధైర్య స్థైర్య, విజయాలు చేకూర్చే జగన్మాత.. ఈరోజు మహిషాసురమర్దనిగా.. శ్రీ రాజరాజేశ్వరీ దేవిగా..
ఈరోజు అమ్మవారు రెండు అవతారాల్లో దర్శనం ఇస్తున్నారు. ఉదయం మహిషాసురమర్దనిదేవిగా, మధ్యాహ్నం శ్రీ రాజరాజేశ్వరీ దేవిగా అమ్మవారు కనిపిస్తారు.
Navaratri 2023 : దేవీ నవరాత్రులు చివరి రోజున అమ్మవారు రెండు అలంకారాలలో దర్శనం ఇవ్వనున్నారు. ఉదయం మహిషాసురమర్దనీ దేవిగా మధ్యాహ్నం శ్రీ రాజరాజేశ్వరి దేవిగా కనిపిస్తారు. నవమి తిథి ఉదయం వరకు మాత్రమే ఉండటం.. మధ్యాహ్నం దశమి తిథి ప్రారంభమవుతుండటంతో ఈరోజు అమ్మవారు రెండు అవతారాల్లో దర్శనం ఇవ్వనున్నారు.
నవరాత్రుల్లో అమ్మవారి అత్యంత ఉగ్రరూపం మహిషాసురమర్దనీ దేవి. ఈరోజు ఎరుపురంగు చీరలో దర్శనం ఇస్తారు. ఈరోజున అమ్మ దుష్ట శిక్షణ, శిష్ణ రక్షణ చేసింది. సింహ వాహనం అధిష్టించి ఆయుధములు ధరించి అమ్మ మహా శక్తి రూపంలో ఈరోజు దర్శనం ఇస్తుంది. ఈరోజు అమ్మవారిని పూజిస్తే శత్రు భయాలు తొలగిపోయి సకల విజయాలు కలుగుతాయి. అంతేకాదు ఈ రోజు అమ్మవారిని పూజిస్తే సకల దేవతలను పూజించిన ఫలితము కలుగుతుంది. చండీ సప్తశతి, హోమము చేస్తే మంచిది. చిత్రాన్నము, గారెలు, వడపప్పు, పానకము నైవేద్యం పెట్టాలి.
శరన్నవరాత్రుల్లో చివరి అలంకారము శ్రీ రాజరాజేశ్వరీ దేవి. బంగారు రంగుర చీరలో దర్శనం ఇస్తారు. ఇచ్ఛా, ఙ్ఞాన, క్రియ శక్తులను ఈ మూర్తి భక్తులకు వరంగా అందిస్తుంది. అమ్మవారిని పూజించి లలితా సహస్ర నామ పారాయణ చేస్తే మంచిది. కుంకుమార్చనలు, సువాసినీ పూజలు చేసినా మంచి ఫలితాలు ఉంటాయి. లడ్డూలు నివేదన చేయాలి. శ్రీ రాజరాజేశ్వర్యష్టకమ్తో పాటు అష్టోత్తర శతనామావళి పఠించాలి. అమ్మవారి అవతారం ముగిశాక శ్రీదేవి దండకంతో శరన్నవరాత్రులు ముగుస్తాయి. విజయదశమి రోజు సాయంత్రం నక్షత్ర దర్శనం సమయంలో శమీవృక్షం (జమ్మిచెట్టు) వద్ద అపరాజితాదేవిని పూజించి
శమీ శమయతే పాపం శమీశతృవినాశినీ !
అర్జునస్య ధనుర్థారీ రామస్య ప్రియదర్శినీ !!
అనే శ్లోకాన్ని పఠిస్తూ ప్రదక్షణ చేసి ఆ శ్లోకం రాసుకున్న చీటీలు ఆ చెట్టు కొమ్మకు తగిలిస్తారు. ఇలా చేయడం ద్వారా అమ్మవారి దయతో తమ కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. ఆ జగన్మాత కృపాకటాక్ష వీక్షణలు అందరిపై ఉండాలని మనసారా కోరుకుందాం.