Sri Lanka: లంక జట్టుకు మరో షాక్… ఐసీసీ ముందు అంగీకరించిన కెప్టెన్
టీమిండియా చేతిలో రెండో వన్డేలోనూ పరాజయం చవిచూసిన లంక జట్టుకు మరో షాక్ తగిలింది. మంగళవారం కొలంబో వేదికగా జరిగిన రెండో వన్డేలో నిర్దేశించిన సమయంలోనే పూర్తి ఓవర్లు బౌలింగ్ వేయనందుకు ఆ జట్టుకు జరిమానా విధించింది ఐసీసీ.
Sri Lanka: టీమిండియా చేతిలో రెండో వన్డేలోనూ పరాజయం చవిచూసిన లంక జట్టుకు మరో షాక్ తగిలింది. మంగళవారం కొలంబో వేదికగా జరిగిన రెండో వన్డేలో నిర్దేశించిన సమయంలోనే పూర్తి ఓవర్లు బౌలింగ్ వేయనందుకు ఆ జట్టుకు జరిమానా విధించింది ఐసీసీ. లంక జట్టు మ్యాచ్ ఫీజులో 20% కోత విధిస్తున్నట్లు తెలియజేయడమే కాకుండా సూపర్ లీగ్ పాయింట్లలో ఒక పాయింట్ కోత పెట్టినట్లు ప్రకటించింది.
దీనిపై విచారణ జరిపించాలని భావించగా.. కెప్టెన్ శనక పొరపాటును అంగీకరించడంతో ఎలాంటి విచారణ జరగలేదు. ఈ మ్యాచులో మొదట బ్యాటింగ్ చేసిన లంక.. అసలంక (65), అవిష్క ఫెర్నాండో (50), కరుణ రత్నె (44 నాటౌట్) రాణించడంతో 9 వికెట్ల నష్టానికి 275 పరుగులు చేసింది. లక్ష్య చేధనకు దిగిన టీమిండియా.. 160కే 6 వికెట్లు కోల్పోవడంతో కష్టాల్లో పడింది.
ఆ సమయంలో భువనేశ్వర్తో కలిసి దీపక్ చాహర్ (69 నాటౌట్) జట్టును విజయ తీరాలకు చేర్చాడు. ఆఖర్లో మ్యాచ్ ఉత్కంఠకు దారితీయడంతో శనక నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం చేశాడు. ఫలితంగా అనుకున్న సమయంలోగా లంక ఓవర్లు పూర్తి చేయలేక జరిమానా కట్టాల్సి వచ్చింది.
రెండో వన్డేలోనూ శిఖర్ ధావన్ కెప్టెన్సీలో విజయం దక్కించుకున్న టీమిండియా 2-0 ఆధిక్యంతో దాదాసు సిరీస్ కైవసం చేసుకున్నట్లే. ఇక నామమాత్రమైన మూడో మ్యాచ్ ను.. శుక్రవారం లాంచనంగా ఆడనున్నాయి ఇరు జట్లు.