Asaduddin Owaisi : రాజాసింగ్ పై సస్పెన్షన్ ఎత్తివేసిన బీజేపీ.. అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు
రాజాసింగ్ ;పై బీజేపీ అధిష్టానం సస్పెన్షన్ ఎత్తివేయడంతో పాటు, తిరిగి గోషామహల్ నియోజకవర్గంకు అభ్యర్థిగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ట్విటర్ వేదికగా స్పందించారు.
Rajasingh Suspension Lifted : బీజేపీ నేత, గోషామహల్ నియోజకవర్గం ఎమ్మెల్యే రాజాసింగ్ పై ఆ పార్టీ అధిష్టానం సస్పెన్షన్ ఎత్తివేసిన విషయం విధితమే. ఈ మేరకు బీజేపీ సెంట్రల్ డిసిప్లనరీ కమిటీ సెక్రటరీ మెంబర్ ఓం పాఠక్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఓ వర్గంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఆయనపై పార్టీ క్రమశిక్షణ చర్యలు చేపట్టింది. గత ఏడాది ఆగస్టు 23న రాజాసింగ్ ను సస్పెండ్ చేస్తూ బీజేపీ అధిష్టానం ఉత్తర్వులు జారీ చేసింది. వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఆయన వివరణపై అధిష్టానం సంతృప్తి వ్యక్తం చేస్తూ సస్పెన్షన్ ఎత్తివేసింది. దీంతో 14 నెలల తరువాత రాజాసింగ్ కు ఊరట లభించింది.
రాజాసింగ్ పై బీజేపీ అధిష్టానం సస్పెన్షన్ ఎత్తివేసిన గంట వ్యవధిలోనే బీజేపీ అధిష్టానం తెలంగాణ ఎన్నికలకు సంబంధించి తొలి జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో 52 నియోజకవర్గాలకు అభ్యర్థులను బీజేపీ అధిష్టానం ప్రకటించింది. ఇందులో రాజాసింగ్ పేరుకూడా ఉంది. మరోసారి గోషామహల్ నియోజకవర్గం నుంచే రాజాసింగ్ ను అభ్యర్థిగా బీజేపీ అదిష్టానం ప్రకటించింది. తాజాగా రాజాసింగ్ వ్యవహారంపై ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు.
రాజాసింగ్ వ్యవహారంపై అసదుద్దీన్ ఓవైసీ ట్విటర్ వేదికగా స్పందించారు. ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు గుప్పించారు. ప్రధాని నరేంద్ర మోదీ తన ప్రియమైన వ్యక్తికి బహుమతి ఇచ్చారు. నుపుర్ శర్మకు కూడా ప్రధాని ఆశీస్సులు లభిస్తాయని పూర్తి విశ్వాసం ఉంది. ద్వేషపూరిత ప్రసంగం అనేది మోడీ బీజేపీలో ప్రమోషన్కు అత్యంత వేగవంతమైన మార్గం అంటూ ట్విటర్ వేదికగా రాజాసింగ్ సస్పెన్షన్ ఎత్తివేతపై అసదుద్దీన్ విమర్శలు చేశారు.
.@narendramodi has rewarded his dear “fringe element.” Quite sure that Nupur Sharma will also get her blessings from the PM. Hate speech is the fastest way to a promotion in Modi’s BJP https://t.co/Qky6RlObH8
— Asaduddin Owaisi (@asadowaisi) October 22, 2023