గడువులోగా కొత్త సచివాలయం పూర్తవ్వాలి

గడువులోగా కొత్త సచివాలయం పూర్తవ్వాలి

new secretariat construction : గడువులోగా కొత్త సచివాలయం పూర్తి కావాలని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. కొత్త సచివాలయ నిర్మాణంలో పనుల వేగం పెంచాలని తెలిపారు. నిర్మాణ పనుల్లో ఎక్కడా ఎలాంటి రాజీ పడకుండా అత్యంత నాణ్యతాప్రమాణాలను పాటించాలన్నారు. కొత్త సచివాలయం నిర్మాణ పనులను సీఎం కేసీఆర్‌ పరిశీలించారు. సచివాలయ భవన నిర్మాణ ప్రాంగణాన్ని కలియ తిరిగి, నిర్మాణ పనుల్లో ఉన్న ఇంజనీర్లు, వర్కింగ్ ఏజెన్సీ ప్రతినిథులతో మాట్లాడారు.

ప్రధాన భవన సముదాయ నిర్మాణంతో పాటు సమాంతరంగా రోడ్ల నిర్మాణం, ప్రహరీ, ఇతర పనులను కూడా చేపట్టాలని సీఎం కేసీఆర్‌ అన్నారు. ఒకదాని తరువాత మరొకటి చేస్తామంటే పనులు పూర్తికావని హెచ్చరించారు. మరోవైపు నిర్మాణ పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తికావాలంటే.. ముందుగానే మెటీరియల్‌ను తెప్పించుకోవాలని చెప్పారు.

అవసరమైన వర్క్‌ షెడ్యూల్‌ను రూపొందించుకొని.. తదనుగుణంగా ముందుగానే మెటీరియల్‌ను నిర్మాణ స్థలానికి తెచ్చుకోవాలని పేర్కొన్నారు. ఏ కారణం చేతనో నిర్మాణ పనులు ఆలస్యమవుతాయని.. గడువు పెంచాలంటే అంగీకరించేది లేదని సీఎం కేసీఆర్‌ వర్కింగ్‌ ఏజెన్సీలకు స్పష్టం చేశారు.

టెండర్‌ షెడ్యూల్‌ ప్రకారం నిర్ణయించిన గడువులోగా నూతన సచివాలయ భవన సముదాయం నిర్మించి అప్పగించాల్సిందేనని స్పష్టం చేశారు. ఏ రోజుకారోజు పనుల పురోగతిని పరిశీలిస్తూ తగిన ఆదేశాలు ఇవ్వాలని అధికారులకు సూచించారు.