ఇంటర్ సప్లిమెంటరీ, బ్యాక్‌లాగ్స్ విద్యార్థులకు గుడ్ న్యూస్

  • Published By: naveen ,Published On : July 27, 2020 / 08:14 AM IST
ఇంటర్ సప్లిమెంటరీ, బ్యాక్‌లాగ్స్ విద్యార్థులకు గుడ్ న్యూస్

కరోనా తీవ్రత అధికంగా ఉండటంతో తెలంగాణ ప్రభుత్వం అన్నిరకాల పరీక్షలు రద్దు చేసిన సంగతి తెలిసిందే. టెన్త్ సహా ఇంటర్, డిగ్రీ పరీక్షలను ప్రభుత్వం క్యాన్సిల్ చేసింది. ఎగ్జామ్స్ నిర్వహించే పరిస్థితి లేకపోవడంతో రద్దు చేసింది. ఇప్పటికే పరీక్షలు లేకుండానే టెన్త్ విద్యార్థులు అందరినీ పాస్ చేసింది ప్రభుత్వం. ఇప్పుడు ఇంటర్ సప్లిమెంటరీ, బ్యాక్ లాగ్స్ ఉన్న విద్యార్థులకు గుడ్ న్యూస్ వినిపించింది.

అందరికీ పాస్ మార్కులు:
ఇంటర్ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలను రద్దు చేసిన నేపథ్యంలో ఆ పరీక్షలకు హాజరు కావాల్సిన విద్యార్థులందరికీ కనీస పాస్‌ మార్కులను ఇవ్వాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది. మార్చిలో నిర్వహించిన వార్షిక పరీక్షలు రాసి, పలు సబ్జెక్టుల్లో ఫెయిలైన వారు, అపుడు పరీక్ష ఫీజు చెల్లించి ఒకటీ రెండు సబ్జెక్టులు రాయలేక పోయిన వారందరికి ప్రతి సబ్జెక్టులో 35 చొప్పున కనీస పాస్‌ మార్కులను ఇచ్చి పాస్‌ చేసేందుకు చర్యలు చేపట్టింది. రెండు, మూడు రోజుల్లో ఈ ఫలితాలను ప్రకటించనుంది.

త్వరలో లక్షా 47వేల 519 మంది విద్యార్థుల ఫలితాలు:
మేలో నిర్వహించాల్సిన ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలను కరోనా నేపథ్యంలో ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలి సిందే. దీంతో ఆ పరీక్షలకు హాజరయ్యే అర్హత కలిగిన ప్రతి విద్యార్థి కంపార్ట్‌మెంటల్‌లో పాసైనట్లుగా ప్రకటించింది. అందుకు అనుగుణంగా విద్యార్థి ఫెయిలైన సబ్జెక్టులను గుర్తించి, వాటిల్లో కనీస మార్కులను వేసి, ఆయా విద్యార్థుల ఫలితాలను ప్రకంటించేలా చేపట్టిన ప్రక్రియ పూర్తి కావచ్చింది. మొత్తంగా 1,47,519 మంది విద్యార్థుల ఫలితాలను త్వరలోనే బోర్డు ప్రకటించనుంది.

బ్యాక్‌లాగ్‌ విద్యార్థులకు కూడా:
సెకండియర్ పూర్తయిన విద్యార్థుల ఫస్టియర్ బ్యాక్‌లాగ్స్‌లో (ఫెయిలైన సబ్జెక్టులు) కూడా పాస్‌ చేసేలా చర్యలు చేపట్టింది. సెకండియర్ లో ఫెయిలైన సబ్జెక్టులే కాకుండా ఫస్టియర్ లో మిగిలిపోయిన సబ్జెక్టుల్లో కూడా ఆయా విద్యార్థులను పాస్‌ చేయనుంది. సెకండియర్ లో ఫెయిలైన వారు లక్షా 47వేల 519 మంది విద్యార్థులు ఉండగా, ఫస్టియర్ బ్యాక్‌లాగ్స్‌ కలిగిన విద్యార్థులు మరో 20 వేల మందికిపైగా ఉన్నట్లు సమాచారం. వీరందరికి ఆయా సబ్జెక్టుల్లో 35 చొప్పున కనీస పాస్‌ మార్కులివ్వనుంది.

గ్రూపుల వారీగా సెకండియర్‌లో ఫెయిలైన విద్యార్థులు
ఎంపీసీ 42,427
బైపీసీ 25,292
ఎంఈసీ 7,416
సీఈసీ 56,341
హెచ్‌ఈసీ 5,581
ఇతరులు 148
మొత్తం 1,47,519