BookMyShow, PVR Cinemas : ఇంటర్నెట్ చార్జీల ఎఫెక్ట్.. బుక్ మై షో, పీవీఆర్ సినిమాస్కు జరిమానా, రెండేళ్ల తర్వాత తీర్పు
బుక్మై షో, పీవీఆర్ సినిమాస్ కు జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ షాక్ ఇచ్చింది. ఆ పేరుతో ప్రేక్షకుల నుంచి టికెట్ ధరకంటే ఎక్కువ డబ్బులు వసూలు చేయడాన్ని తప్పు పడుతూ రూ.5వేలు జరిమానా విధించింది. ఆ మొత్తాన్ని లీగల్ ఎయిడ్ కింద కోర్టుకు చెల్లించాలంది. అలాగే ఫిర్యాదుదారుడికి రూ.25వేలు పరిహారంతో పాటు కేసు ఖర్చుల కింద రూ.1000 చెల్లించాలని తీర్పు ఇచ్చింది.
Hyderabad court fines BookMyShow, PVR Cinemas: బుక్మై షో, పీవీఆర్ సినిమాస్ కు జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ షాక్ ఇచ్చింది. ఇంటర్నెట్ హ్యాండిలింగ్ ఛార్జీల పేరుతో ప్రేక్షకుల నుంచి టికెట్ ధరకంటే ఎక్కువ డబ్బులు వసూలు చేయడాన్ని తప్పు పడుతూ రూ.5వేలు జరిమానా విధించింది. ఆ మొత్తాన్ని లీగల్ ఎయిడ్ కింద కోర్టుకు చెల్లించాలంది. అలాగే ఫిర్యాదుదారుడికి రూ.25వేలు పరిహారంతో పాటు కేసు ఖర్చుల కింద రూ.1000 చెల్లించాలని తీర్పు ఇచ్చింది.
టిక్కెట్ ధరపై అదనంగా డబ్బులు వసూలు చేయడాన్ని హైదరాబాద్కు చెందిన సామాజిక కార్యకర్త విజయ్గోపాల్ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్లో సవాల్ చేశారు. రెండేళ్ల(25 నెలలు) నిరీక్షణ తర్వాత ఈ కేసులో తీర్పు వెలువడింది.
సికింద్రాబాద్కు చెందిన విజయ్గోపాల్ పంజాగుట్టలోని పీవీఆర్ సినిమాస్లో సినిమా చూసేందుకు ‘బుక్ మై షో’ ద్వారా టిక్కెట్ బుక్ చేశారు. ఇంటర్నెట్ హ్యాండిలింగ్ ఛార్జీలు రూ.41.78తో కలిపి మొత్తం రూ.341.78 చెల్లించారు. టిక్కెట్ ధరపై సుమారు 18శాతం వసూలు చేయడం ఏంటంటూ సెంట్రల్ కన్జ్యూమర్ ఎఫైర్స్ మినిస్ట్రీకి 2019 జనవరి 18న ఆన్లైన్లో ఆయన ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత జిల్లా వినియోగదారుల కమిషన్ను ఆశ్రయించారు. దీనిపై బుక్ మై షో సంస్థ వివరణ ఇచ్చింది. ఫిర్యాదుదారు చెప్పినవి నిరాధారమంటూ కేసును కొట్టివేయాలని కోరింది. విచారణ జరిపిన జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్-3 అధ్యక్షుడు నిమ్మ నారాయణ, సభ్యురాలు సీ.లక్ష్మీప్రసన్నతో కూడిన బెంచ్… వినియోగదారుల వాదనలతో ఏకీభవించింది.
ఫిర్యాదుదారుడికి పరిహారం చెల్లించాలని ఆదేశించింది. 45రోజుల వ్యవధిలో ఈ డబ్బు చెల్లించకపోతే తీర్పు వెలువడిన కాలం నుంచి 18శాతం వడ్డీతో చెల్లించాల్సి ఉంటుందని కమిషన్ హెచ్చరించింది. కాగా, టిక్కెట్ ధరపై అదనంగా రూ.6 వసూలు చేసుకోమని ప్రతివాదులు(బుక్ మై షో, పీవీఆర్ సినిమాస్) కు కమిషన్ చెప్పింది.
”ఇంటర్నెట్ హ్యాండ్లింగ్ ఛార్జీలు అన్యాయం. రూ.6 కన్నా ఎక్కువ రుసుము వసూలు చేయకూడదు. ఇది ఏపీ, తెలంగాణ ఐటీ చట్టం, 2000 లోని సెక్షన్ 6 ఎ ఆధారంగా తెలుపబడి ఉంది” అని కోర్టు వ్యాఖ్యానించింది. కోర్టు తీర్పుపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఏవో పేర్లు చెప్పి ప్రేక్షకుడి నుంచి అదనపు డబ్బు వసూలు చేసే సంస్థలకు ఇది చెంపపెట్టు అని అంటున్నారు. ఈ తీర్పుపై ఫిర్యాదుదారు విజయ్ గోపాల్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ తీర్పు అగ్రిగేటర్లుగా సేవలు అందించే వారందరికీ వర్తిస్తుందని అన్నారు.