Lockdown : తెలంగాణలో మళ్లీ లాక్ డౌన్.. నెల్లూరు వ్యక్తి అరెస్ట్
తెలంగాణలో మరోసారి లాక్డౌన్ విధిస్తారంటూ నకిలీ ఉత్తర్వులు తయారు చేసి, జారీ చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.
Lockdown : తెలంగాణలో మరోసారి కరోనా కేసులు భారీగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. దీంతో ప్రజల్లో భయాందోళన నెలకొంది. ఈ క్రమంలో కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో మరోసారి లాక్ డౌన్ విధిస్తుందనే ప్రచారం జోరందుకుంది. అంతేకాదు లాక్ డౌన్ కు సంబంధించి ప్రభుత్వం పేరుతో ఓ జీవో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అందులో రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి సంతకం ఉంది. దీంతో అది నిజమే అని అంతా నమ్మేశారు. మరోసారి లాక్ డౌన్ అనే వార్త మరింత ఆందోళన కలిగించింది. దీనిపై ఏకంగా సీఎస్ సోమేష్ కుమార్ స్పందించాల్సి ఉంది. మరోసారి లాక్ డౌన్ అనే వార్తల్లో నిజం లేదన్నారు. అసలు.. అది ప్రభుత్వం జారీ చేసిన జీవోనే కాదని, ఫేక్ అని స్పష్టం చేశారు. ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం పోలీసులను రంగంలోకి దింపింది. దర్యాఫ్తు చేపట్టిన పోలీసులు.. ఫేక్ జోవో విడుదల చేసిన వ్యక్తిని గుర్తించి పట్టుకున్నారు. అరెస్ట్ చేసి అత్తారింటికి పంపారు.
మళ్లీ లాక్ డౌన్ అంటూ ఫేక్ జీవో:
తెలంగాణలో మరోసారి లాక్డౌన్ విధిస్తారంటూ నకిలీ ఉత్తర్వులు తయారు చేసి, జారీ చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నాలుగు రోజుల క్రితం శ్రీపతి సంజీవ్ కుమార్ అనే వ్యక్తి ఈ నకిలీ జీవోను తయారు చేసినట్లు హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ తెలిపారు. కరోనా మళ్లీ విజృంభిస్తున్న తరుణంలో రాత్రి వేళల్లో లాక్ డౌన్(నైట్ కర్ఫ్యూ) విధిస్తారంటూ నకిలీ జీవో తయారు చేసి, సోషల్ మీడియాలో సర్కులేట్ చేశారన్నారు.
చార్టెడ్ అకౌంటెంట్..స్వస్థలం నెల్లూరు:
నిందితుడి నుంచి ఓ ల్యాప్టాప్, మొబైల్ను స్వాధీనం చేసుకున్నట్లు సీపీ వెల్లడించారు. నిందితుడు ఓ ప్రైవేటు కంపెనీలో ఛార్టెడ్ అకౌంటెంట్గా పని చేస్తున్నాడని, అతడి స్వస్థలం నెల్లూరు టౌన్ అని సీపీ వివరించారు. లాక్డౌన్పై గతంలో ఇచ్చిన జీవోను డౌన్లోడ్ చేసుకొని, తేదీలు మార్చి.. పాత జీవోను సంజీవ్, అతని స్నేహితులు వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేశారన్నారు. ఇలాంటి తప్పుడు ప్రచారలను నమ్మొద్దని, ప్రధానంగా వాట్సాప్ గ్రూపుల్లో అడ్మిన్స్గా ఉన్నవారంతా నిజనిర్ధారణ చేసుకున్న తర్వాతనే సమాచారాన్ని ఫార్వర్డ్ చేయాలని సూచించారు. లేదంటే వారిపైనా కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు.