TS-bPASS ప్రజలకు బ్రహ్మాస్త్రం, అలాగని కుతుబ్ మినార్ కడితే ప్రభుత్వం ఊరుకోదు

  • Published By: naveen ,Published On : September 15, 2020 / 03:32 PM IST
TS-bPASS ప్రజలకు బ్రహ్మాస్త్రం, అలాగని కుతుబ్ మినార్ కడితే ప్రభుత్వం ఊరుకోదు

టీఎస్ బీపాస్(TS-bPASS) చట్టం ప్రజలకు బ్రహ్మాస్త్రం లాంటిది అని మున్సిపల్ శాఖ మంత్రి మంత్రి కేటీఆర్ అన్నారు. బిల్డింగ్, లేఔట్ పర్మిషన్ల కోసం టీఎస్ బీపాస్ చట్టం తెచ్చామన్నారు. ఎన్వోసీ బాధ్యత కూడా మున్సిపల్ శాఖదే అని ఆయన స్పష్టం చేశారు. అయితే.. 75 గజాల లోపు అని, అనుమతులు అవసరం లేదు కదా అని కుతుబ్ మినార్ కడితే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని కేటీఆర్ హెచ్చరించారు. మంగళవారం(సెప్టెంబర్ 15,2020) మండలిలో టీఎస్ బీపాస్ బిల్లుపై కేటీఆర్ మాట్లాడారు.

భవన నిర్మాణ అనుమతుల కోసం అప్లయ్ చేసుకున్న 21 రోజుల్లోనే టీఎస్ బీపాస్ ​చట్టం ద్వారా అనుమతి ఇవ్వనున్నట్టు కేటీఆర్​ తెలిపారు. లేదంటే 22వ రోజు డీమ్డ్ అప్రూవల్ గా భావించాల్సి ఉంటుందన్నారు. ఏదైనా షార్ట్​ ఫాల్ ఉంటే పది రోజుల్లోనే అప్లికేషన్ రిజెక్ట్ చేయనున్నట్టు చెప్పారు. 75 గజాల లోపు స్థలాల్లో నిర్మాణాలకు ఏ విధమైన అనుమతులు అవసరం లేదన్నారు. ఈ మేరకు టీఎస్‌ బీపాస్‌ బిల్లును(తెలంగాణ స్టేట్​ బిల్డింగ్​ పర్మిషన్​, అప్రూవల్​ అండ్​ సెల్ఫ్​ సర్టిఫికేషన్​ సిస్టమ్​) సోమవారం(సెప్టెంబర్ 14,2020) అసెంబ్లీలో ఆమోదించిన సంగతి తెలిసిందే.

భవన నిర్మాణ అనుమతులను సులభం చేసేందుకు, ట్రాన్స​పరెన్సీ కోసం టీఎస్ ​బీపాస్ బిల్లు తీసుకొచ్చినట్టు కేటీఆర్ చెప్పారు. ఈ బిల్లుతో 95 శాతం పట్టణ పేదలు, మధ్యతరగతి ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. ఈ విధానంలో నిర్మాణం కోసం దరఖాస్తు చేసుకున్న 21 రోజుల్లో అనుమతి ఇవ్వాల్సిందేనని, లేకుంటే 22 వ రోజున సంబంధిత టౌన్ ప్లానింగ్ ఆఫీసర్, మున్సిపల్ కమిషనర్ సంతకంతో కూడిన అనుమతి సర్టిఫికెట్ జారీచేస్తారని తెలిపారు.
https://10tv.in/telangana-legislative-approval-for-the-b-pass-bill/
దీని ద్వారా బ్యాంకుల్లో లోన్లు పొందొచ్చని, ఈ సర్టిఫికెట్​తో భవన నిర్మాణ ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ కూడా 15 రోజుల్లోనే ఇస్తారని చెప్పారు. టీఎస్​ బీపాస్​ చట్టం అమలు పర్యవేక్షణ కోసం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేస్తామని, జీహెచ్​ఎంసీ పరిధిలో జోనల్ కమిషనర్ల ఆధ్వర్యంలోనూ మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేస్తామని వివరించారు. సర్కారు స్థలాల్లో ఇతర నిర్మాణాలుంటే, నోటీసు ఇవ్వకుండానే కూల్చుతామని మంత్రి కేటీఆర్​ హెచ్చరించారు. టీఎస్​ బీపాస్​కు అసెంబ్లీ ఆమోదం తెలిపింది.

ఇది మహానగర వాసులకు శుభవార్త అని చెప్పాలి. 75 చదరపు గజాల వరకు స్థలంలో ఇంటి నిర్మాణానికి ఇక అనుమతి అవసరం లేదు. 76 నుంచి 600 చదరపు గజాల విస్తీర్ణంలోని ప్లాట్లలో నిర్మాణాలకు స్వీయ ధ్రువీకరణ ఆధారంగా తక్షణ ఆమోదం లభించనుంది. ఈ మేరకు టీఎస్‌ బీపాస్‌ బిల్లును అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదించారు. 75 చ.గల వరకు ఉన్న స్థలంలో ఏడు మీటర్ల ఎత్తు వరకు (జీ ప్లస్‌ ఒక అంతస్తు, స్టిల్ట్‌ ప్లస్‌ రెండంతస్తులు) భవనం నిర్మించుకోవాలి. 76 నుంచి 600 చ.గల వరకు ఉన్న ప్లాట్‌లో 10 మీటర్ల (గ్రౌండ్‌ ప్లస్‌ రెండు లేదా స్టిల్ట్‌ ప్లస్‌ మూడంతస్తులు) ఎత్తు భవనానికి తక్షణ ఆమోదం లభిస్తుంది.

నిబంధనలు:
* 75 చ.గల వరకు స్థలంలో నివాస భవన నిర్మాణానికి అనుమతి అవసరం లేదు.
* టోకెన్‌ ఫీజుగా ఒక రూపాయి చెల్లించి ఆన్‌లైన్‌లో భవన నిర్మాణ వివరాలు నమోదు చేసుకోవాలి.
* దాంతోపాటు రూ. 100 ఆస్తిపన్ను చెల్లించాలి.

* ప్రభుత్వ భూమి, జల వనరులు, ఇతర నిషేధిత భూముల్లో ప్లాట్‌ లేదని ప్రకటించడంతోపాటు స్థల విస్తీర్ణం, నిర్మించనున్న అంతస్తుల సంఖ్యను ధ్రువీకరించాలి.
* 75 నుంచి 600 చ.గల విస్తీర్ణంలోని ప్లాట్‌లో వ్యక్తిగత/నివాస భవన నిర్మాణం (10 మీటర్ల ఎత్తు) కోసం స్వీయ ధ్రువీకరణ ఆధారంగా ఆన్‌లైన్‌ ద్వారా తక్షణ ఆమోదం లభిస్తుంది.
* 75 నుంచి 600 చ.గల స్థలంలో 10 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తయిన భవనాలకు స్వీయ ధ్రువీకరణ ప్రాతిపదికన ఆమోదం పొందితే 21 రోజుల తరువాత పనులు ప్రారంభించాలి.
* ఉల్లంఘనలు జరిగినట్టు గురిస్తే భవనం కూల్చివేత/మూసివేత/జరిమానా విధింపు.