కూలీ పనులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా యాక్సిడెంట్..ఆరుగురు మృతి

కూలీ పనులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా యాక్సిడెంట్..ఆరుగురు మృతి

Six workers killed in road accident : నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పీఏ పల్లి మండలం అంగడిపేటలో కూలీలతో వెళ్తున్న ఆటోను కంటైనర్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు కూలీలు మృతి చెందగా.. మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. మృతులంతా దేవరకొండ మండలం చింతబావి వాసులుగా గుర్తించారు.

రోజువారీ పనుల్లో భాగంగా 20 మంది కూలీలు పీఏపల్లి మండలం రంగారెడ్డి గూడెంలో వరి నాట్లు వేయడానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఆటో డ్రైవర్ లారీని ఓవర్ టేక్ చేసే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ క్రమంలో ఆటో ఎదురుగా వస్తున్న బొలెరో వాహనాలు పరస్పరం ఢీకొన్నాయి. దీంతో ఆటో ఒక్కసారిగా లారీ కిందకు దూసుకెళ్లింది.

ప్రమాదానికి ఆటో డ్రైవర్ నిర్లక్ష్యంతో పాటు లారీ అతివేగమే కారణమని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఆటోలో లెక్కకు మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం, అజాగ్రత్తగా నడిపి ముందు నుంచి వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టెక్ చేసే క్రమంలో ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. ప్రమాదంలో ఆటో డ్రైవర్‌తో పాటు ఆరుగురు మహిళలు మృతి చెందారు.