రసవత్తరంగా తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు.. బీజేపీ, కాంగ్రెస్‌కు షాకిచ్చిన కేసీఆర్

రసవత్తరంగా తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు.. బీజేపీ, కాంగ్రెస్‌కు షాకిచ్చిన కేసీఆర్

Telangana Graduates’ MLC Elections : తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఇప్పటికే కాంగ్రెస్‌, బీజేపీ అభ్యర్థులను ఖరారు చేయగా.. టీఆర్‌ఎస్‌ తాజాగా అభ్యర్థిని ఖరారు చేసింది. అనూహ్యంగా పీవీ నరసింహారావు కూతుర్ని తెరపైకి తెచ్చి కాంగ్రెస్, బీజేపీలకు షాక్ ఇచ్చింది. హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ నియోజకవర్గ స్థానానికి అనూహ్యంగా మహిళా అభ్యర్థిని ఖరారు చేశారు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్. అసలు ఈ స్థానంలో టీఆర్‌ఎస్‌ పోటీ చేయదన్న ఊహాగానాలను పటాపంచలు చేస్తూ కేసీఆర్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. అటు కాంగ్రెస్.. ఇటు బీజేపీకి ఊహించని రీతిలో మాస్టర్ స్ట్రోక్ ఇచ్చారు.

అనూహ్యంగా మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుమార్తెను బరిలోకి దించారు కేసీఆర్. హైదరాబాద్ – రంగారెడ్డి – మహబూబ్ నగర్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పీవీ కుమార్తె సురభి వాణీదేవిని సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. ఈ స్థానంలో బీజేపీ అభ్యర్థిగా ఎమ్మెల్సీ రామచంద్రరావు ఎన్నికల బరిలో ఉండగా కాంగ్రెస్ నుంచి చిన్నారెడ్డి పోటీ చేస్తున్నారు. ఇండిపెండెంట్ అభ్యర్థిగా ప్రొఫెసర్ నాగేశ్వర్‌ నామినేషన్ దాఖలు చేశారు.

రాష్ట్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల హడావిడి మొదలైంది. వరంగల్ – ఖమ్మం – నల్గొండ, హైదరాబాద్ – రంగారెడ్డి – మహబూబ్‌నగర్ పట్టభద్రుల నియోజకవర్గాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు.. ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీ తమ అభ్యర్థుల పేర్లను ప్రకటించాయి. వరంగల్ – ఖమ్మం – నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున రాములు నాయక్, బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి బరిలో నిలిచారు. వరంగల్ – ఖమ్మం – నల్గొండ నుంచి గులాబీ పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డికి రెండోసారి అవకాశం కల్పించింది.

ఖమ్మం స్థానానికి అభ్యర్థిని ఖరారు చేసిన టీఆర్‌ఎస్‌.. రెండోస్థానానికి అభ్యర్థిని ప్రకటించకపోవడంతో ఊహాగానాలు షికార్లు చేశాయి. గతంలోనూ ఇక్కడ గెలవకపోవడంతో పోటీ నుంచి దూరంగా ఉండాలని టీఆర్‌ఎస్ భావిస్తున్నట్లు విశ్లేషణలు చేశారు. ఇక్కడ పోటీలో నిలిచిన మరో అభ్యర్థి ప్రొఫెసర్ నాగేశ్వర్‌కి పరోక్షంగా మద్దతివ్వడం ద్వారా బీజేపీని దెబ్బ కొట్టేందుకు వ్యూహం రచించినట్లు చర్చ నడిచింది.

అయితే వాటన్నింటికీ సీఎం కేసీఆర్‌ ఫుల్‌స్టాప్‌ పెట్టారు. అనూహ్యంగా పీవీ కుమార్తెను బరిలోకి దింపారు. ఇప్పటికే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉనికి కోల్పోతుండగా.. దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల విజయంతో జోష్‌లో ఉన్న బీజేపీ ఆశలపై నీళ్లు చల్లాలని గులాబీ నేత భావిస్తున్నట్లు తెలుస్తోంది.