Zahirabad Lok Sabha Constituency : హీట్ రేపుతోన్న జహీరాబాద్ పార్లమెంట్ రాజకీయం.. స్ట్రాటజీలు సిద్ధం చేసిన రాజకీయ పార్టీలు
బాన్సువాడలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. వరుసగా ఆరుసార్లు విజయం సాధించిన పోచారం.. అంతే ఆత్మవిశ్వాసం... అంతే ప్రజాదరణతో.. ముందు వరుసలో ఉన్నారు. జిల్లాలో విలక్షణ నేతగా ఉన్న పోచారం.. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో 53 శాతం ఓట్లు సాధించారు.
Zahirabad Lok Sabha Constituency : జహీరాబాద్ పార్లమెంట్ స్థానం.. రెండు రాష్ట్రాలతో సరిహద్దు పంచుకుంటున్న ప్రాంతం. ఇక్కడ ప్రతీది ప్రత్యేకమే ! ఓటర్ మనసు గెలవడం ఎంత కష్టమో.. ఓటర్లు ఇచ్చే తీర్పు అంతకుమించి విలక్షణంగా ఉంటుంది. ఇక్కడ సత్తా చాటి.. ఢిల్లీకి ఈ సౌండ్ వినిపించాలని బీఆర్ఎస్ వ్యూహాలు రచిస్తుంటే.. పార్లమెంట్తో పాటు ఏడు అసెంబ్లీలపై పట్టు సాధించాలని కాంగ్రెస్.. రెండు పార్టీలకు ఝలక్ ఇవ్వాలని బీజేపీ.. స్ట్రాటజీలు సిద్ధం చేశాయ్. మరి జహీరాబాద్ పొలిటికల్ ముఖచిత్రమ్ ఎలా ఉంది.. బీఆర్ఎస్ తరఫున బరిలో నిలిచేది ఎవరు.. ఏ నాయకుడికి టికెట్ అనుమానంగా ఉంది.. కాంగ్రెస్ను వెంటాడుతున్న బలహీనతలు ఏంటి.. బీజేపీ ఈసారి సంచలనాలు క్రియేట్ చేస్తుందా…
బీఆర్ఎస్ నుంచి బీబీ పాటిల్కు అధిష్టానం మరో అవకాశం ఇస్తుందా… జహీరాబాద్ కాంగ్రెస్ అభ్యర్ధిగా అజారుద్దీన్ పోటీకి దిగేనా ?
కర్నాటక, మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న లోకసభ నియోజకవర్గం జహీరాబాద్. ఈ లోక్సభ స్థానంపై మూడు పార్టీలు కన్నేశాయ్. గెలుపే ధ్యేయంగా ఇప్పటికే కసరత్తు ప్రారంభించాయ్. బీఆర్ఎస్ నుంచి వరుసగా రెండుసార్లు గెలిచిన బీబీ పాటిల్.. మరోసారి పోటీకి సిద్ధం అవుతున్నారు. హ్యాట్రిక్ సాధించాలన్న పట్టుదలతో ఉన్నారు. ఐతే లోక్సభ పరిధిలోని ఎమ్మెల్యేలతో సఖ్యత లేదన్న విమర్శలు వస్తున్న వినిపిస్తున్న వేళ.. బీబీ పాటిల్కు అధిష్టానం మరో అవకాశం ఇస్తుందా లేదా అనే చర్చ కూడా జోరుగా సాగుతోంది. బీఆర్ఎస్ నుంచి టికెట్ దక్కపోతే.. తన దారి తాను చూసుకునేందుకు పాటిల్ రెడీ అవుతున్నారనే ప్రచారం జరుగుతోంది. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన మదన్ మోహన్ రావు… మళ్లీ హస్తం పార్టీ తరఫున బరిలో దిగేందుకు రెడీ అవుతున్నారు. ఐతే పీసీసీ చీఫ్ రేవంత్తో మదన్ మోహన్ రావుకు కొంత గ్యాప్ ఉన్నట్లు ప్రచారం జరుగుతుండగా.. మాజీ క్రికెటర్ అజారుద్దీన్ పేరు తెరమీదకు వస్తోంది. సనత్నగర్ అసెంబ్లీ, జహీరాబాద్ పార్లమెంట్ బరిలో దిగేందుకు అజార్ కూడా ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. బీజేపీ నుంచి నిజామాబాద్కు చెందిన లక్ష్మారెడ్డితో పాటు హైకోర్టు అడ్వకేట్ రచనారెడ్డి పేర్లు రేసులో వినిపిస్తున్నాయ్.
READ ALSO : Kammam Politics : ఖమ్మం చుట్టూ తిరుగుతున్న తెలంగాణా రాజకీయం… గులాబీ పార్టీలో గ్రూపుల గుబులు
జహీరాబాద్ లోక్సభ పరిధిలో.. జహీరాబాద్ అసెంబ్లీతో పాటు జుక్కల్, బాన్సువాడ, ఎల్లారెడ్డి, కామారెడ్డి, నారాయణఖేడ్, ఆందోల్ సెగ్మెంట్లు ఉన్నాయ్. ఇందులో జుక్కల్, ఆందోల్,
జహీరాబాద్ ఎస్సీ రిజర్వ్డ్ కాగా.. మిగిలినవి జనరల్. ఏడు అసెంబ్లీల్లోనూ టీఆర్ఎస్ జోరే కొనసాగుతోంది.
జహీరాబాద్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా మాణిక్ రావుకు మరోసారి టిక్కెట్ దక్కేనా..
జహీరాబాద్లో సిట్టింగ్ ఎమ్మెల్యేగా మాణిక్ రావు ఉన్నారు. ఐతే ఈసారి ఆయనకు టికెట్ దక్కపోవచ్చనే ప్రచారం జరుగుతోంది. పారిశ్రామిక కేంద్రంగా రూపాంతరం చెందుతున్న జహీరాబాద్లో ఈసారి ఓ యువనేతకు అవకాశం ఇచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయ్. తెలంగాణా వైద్య సేవలు, మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ను.. ఇక్కడి నుంచి బరిలో దించే అవకాశాలు ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది. రైతు నాయకుడిగా ఢిల్లీ స్థాయిలో పరిచయాలు ఉన్న ఢిల్లీ వసంత్ను పార్టీ చేర్చుకొని అవకాశం ఇవ్వొచ్చు అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయ్. దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ను విస్తరించాలన్న ఆలోచనలకు.. వసంత్కు అవకాశం కల్పించడంపై చర్చ సాగుతోంది. ఏదేమైనా సిట్టింగ్ ఎమ్మెల్యే మాణిక్ రావుకు మాత్రం అవకాశం దక్కడం కష్టంగానే కనిపిస్తోంది.
కాంగ్రెస్ నుంచి గీతారెడ్డి బరిలోకి దిగే చాన్స్..
జహీరాబాద్లో కాంగ్రెస్ తరఫున మాజీ మంత్రి గీతారెడ్డి మరోసారి బరిలో నిలిచే ప్రయత్నం చేస్తున్నారు. టీడీపీని వీడి కాంగ్రెస్ గూటికి చేరుకున్న ఏర్పుల నరోత్తమ్ కూడా పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. యువ నాయకులను ప్రోత్సహించాలని అధిష్టానం భావిస్తే.. నరోత్తమ్ వైపే మొగ్గుచూపే అవకాశం ఉందనే టాక్ నడుస్తోంది. జహీరాబాద్ కమలం పార్టీలో గందరగోళ పరిస్థితులు కనిపిస్తున్నాయ్. గత ఎన్నికల్లో పోటీ చేసిన జంగం గోపి…. నేరుగా జిల్లా అధ్యక్షుడిపైనే దాడికి దిగి బహిష్కరణకు గురయ్యారు. ఈ మధ్యే బీఆర్ఎస్ వీడి బీజేపీలో చేరిన సుధీర్ కుమార్ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ తమ్ముడు రామ్ చందర్ కూడా.. జహీరాబాద్ నుంచి బీజేపీ తరఫున బరిలో దిగేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు.
ఆందోల్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా చంటి క్రాంతి కిరణ్కు మళ్లీ టికెట్ కన్ఫార్మ్ అయ్యే చాన్స్..
ఆందోల్లో చంటి క్రాంతి కిరణ్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. జనాల్లో కాస్త కాస్త వ్యతిరేకత కనిపిస్తున్నా.. తిరిగి తనకే టికెట్ ఖరారయ్యే అవకాశం కనిపిస్తోంది. మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహను ఢీకొట్టే స్థాయి ఉన్న నేతలు మరొకరు బీఆర్ఎస్లో లేకపోవడం.. క్రాంతి కిరణ్కు కలిసొచ్చే అంశంగా మారింది. కాంగ్రెస్ నుంచి దామోదర రాజనర్సింహా మరోసారి బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ నుంచి మరోసారి పాతకాపులే బరిలో దిగే అవకాశాలు ఉన్నాయ్. బీజేపీ నుంచి మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు మాజీ మంత్రి బాబుమోహన్ సిద్ధం అవుతున్నారు. మరోవైపు జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ బాలయ్య ఈ మధ్యే బీజేపీలో చేరారు. ఆందోల్ నుంచి నుంచి ఆయన కూడా ప్రయత్నాలు కూడా సాగిస్తున్నారు. బీజేపీ అధిష్టానం కూడా బాబుమోహన్ వైపే దాదాపు మొగ్గు చూపుతోంది. ఐతే ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో చిక్కుకోవడం బాబూమోహన్కు ఇబ్బందికరంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయ్.
READ ALSO : Adilabad Lok Sabha Constituency : రాజకీయాలకు అడ్డాగా కుమ్రం భీమ్ పోరుగడ్డ… అదిలాబాద్ పై కన్నేసిన కమలం
నారాయణఖేడ్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా భూపాల్ రెడ్డి.. కాంగ్రెస్ నుంచి మరో చాన్స్ కోరుతోన్న సంజీవరెడ్డి
నారాయణఖేడ్లో భూపాల్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయనే మళ్లీ పోటీలో దిగడం ఖాయంగా కనిపిస్తోంది. భూపాల్ రెడ్డి సోదరుడు విజయ్పాల్ రెడ్డి.. బీజేపీ తరఫున పోటీకి సిద్ధం అవుతున్నారు. ఐతే కమలం పార్టీ అధికార ప్రతినిధి సంగప్ప కూడా.. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆశీస్సులతో పోటీ చేసేందుకు పావులు కదుపుతున్నారు. నియోజకవర్గంలో సొంత సామాజికవర్గం అయిన లింగాయత్ ఓటర్లు ఎక్కువగా ఉండడంతో.. తనకు టికెట్ ఇస్తే గెలిచి వస్తానంటూ అధిష్టానం పెద్దల ముందు విన్నపాలు వినిపించినట్లు తెలుస్తోంది. దీంతో ఇక్కడ బీజేపీ నుంచి ఎవరు బరిలో దిగుతారన్నది ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ నుంచి దివంగత ఎమ్మెల్యే పటోళ్ల కృష్టారెడ్డి కుమారుడు సంజీవరెడ్డి.. తనకు మరో అవకాశం ఇవ్వాలని అధిష్టానాన్ని కోరుతున్నారు. అటు మాజీ ఎంపీ సురేష్ షెట్కర్… ఎట్టి పరిస్థితుల్లో అసెంబ్లీ బరిలో నిలవాలని గట్టి పట్టుదలతో ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు సాగిస్తున్నారు. నారాయణఖేడ్లో కాంగ్రెస్, బీజేపీ మధ్య టికెట్ ఫైట్ తీవ్రంగా ఉండగా.. ఎన్నికల్లో ట్రయాంగిల్ ఫైట్ ఖాయంగా కనిపిస్తోంది.
కామారెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా గంప గోవర్ధన్.. సామాజికవర్గాల్లో ఎమ్మెల్యేపై నెలకొన్న వ్యతిరేకత
కామారెడ్డిలో సీనియర్ నేత గంప గోవర్ధన్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రభుత్వ విప్గా ఉన్న గోవర్ధన్.. ఇప్పటికీ నాలుగుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఐతే ఈసారి పాలిటిక్స్ డైనమిక్గా కనిపిస్తున్నాయ్. దీంతో అధికార పార్టీకి ఎదురుదెబ్బ తగలనుందా అనే ప్రచారం ఊపందుకుంది. కొన్ని సామాజికవర్గాల్లో నెలకొన్న వ్యతిరేకత.. సిట్టింగ్ ఎమ్మెల్యేకు ఇబ్బందికరంగా మారుతోంది. గులాబీ పార్టీ చేసిన సర్వేల్లోనూ అదే తేలింది. దీంతో ఆయనకు మళ్లీ టికెట్ దక్కుతుందా లేదా అన్నది కొత్త చర్చకు కారణం అవుతోంది. ఐతే తనకు కాకపోతే.. తన కుమారుడికైనా టికెట్ ఇప్పాలన్న ఆసక్తితో గంప గోవర్ధన్ పనిచేస్తన్నట్లు తెలుస్తోంది. దీనికోసం తన కొడుకు శశాంక్ను నియోజకవర్గ రాజకీయాల్లో యాక్టివ్ చేస్తున్నారు. అటు కామారెడ్డి బీఆర్ఎస్ను వర్గ విభేదాలు వెంటాడుతున్నాయ్. వ్యక్తిగతంగా ఎదురవుతున్న వ్యతిరేకతకు తోడు.. పార్టీలో అంతర్గత కలహాలు గోవర్ధన్కు మరింత ఇబ్బందిగా మారాయ్. తెలంగాణలో మాస్టర్ ప్లాన్ చిచ్చు కూడా ఇక్కడే రాజుకోవడం… అది తీవ్ర వివాదంగా మారడం కూడా ఎమ్మెల్యే గోవర్థన్కు ఇబ్బందికరంగా మారుతోంది.
బీజేపీ నుంచి టికెట్ రేసులో కాటిపెల్లి వెంకటరమణారెడ్డి.. కాంగ్రెస్ నుంచి పోటీకి సిద్థం అవుతోన్న షబ్బీర్ అలీ
గంప గోవర్ధన్కు టికెట్ అనుమానమే అని చర్చ జరుగుతున్న వేళ.. బీఆర్ఎస్లో ప్రయత్నాలు ఊపందుకున్నాయ్. బీజేపీ నుంచి బీఆర్ఎస్లో చేరిన.. గులాబీ పార్టీ రాష్ట్ర నాయకుడు నిట్టు వేణుగోపాల్.. టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. నిట్టు వేణుగోపాల్ కూతురు జాహ్నవికి మున్సిపల్ చైర్పర్సన్ పదవిని అధిష్ఠానం కట్టబెట్టింది. ఐతే వచ్చే ఎన్నికల్లో తనకు లేదంటే తన కూతురికి టికెట్ దక్కేలా ఆయన పావులు కదుపుతున్నారని తెలుస్తోంది. ఉర్దూ అకాడమీ చైర్మన్ ముజీబబొద్దిన్ది మరో గ్రూప్. కవిత గ్రూప్లో ఉన్న ముజీబొద్దీన్ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. మైనారిటీ కోటాలో ఆయన కూడా టికెట్ ఆశిస్తున్నారు. నిజామాబాద్, బోధన్ తరహాలోనే.. ఇక్కడ కూడా మైనారిటీ ఓట్లు కీలకం కానున్నాయ్. అధికార పార్టీలో టికెట్ ఎవరికి దక్కుతుందన్న దాన్ని బట్టి ఇక్కడ గెలుపోటములు ఆధారపడి ఉంటాయ్. మాజీ మంత్రి షబ్బీర్ అలీ కాంగ్రెస్ నుంచి మరోసారి అదృష్టం పరీక్షించుకోనున్నారు. మైనార్టీ నాయకుడిగా.. మాజీ మంత్రిగా.. రెండుసార్లు ఓటమి పాలైన సానుభూతి కలిసొస్తుందని ఆయన భావిస్తున్నారు. బీజేపీ గట్టి పోటీ ఇచ్చే నియోజకవర్గాల్లో కామారెడ్డి ఒకటి. కమలం పార్టీ తరఫున ఇక్కడి నుంచి కాటిపెల్లి వెంకటరమణారెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు పోరాటం చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ పేరుతో అధికార పార్టీ నాయకులు అమాయకుల భూములను కబ్జాలు చేస్తున్నారని పెద్ద చర్చకే తెరలేపి.. ప్రజాదర్బార్తో బీఆర్ఎస్ను డిఫెన్స్లో పడేశారు. ఐతే ఇక్కడ మైనారిటీ ఓట్లు కీలకం కావడంతో.. బీజేపీ విజయం ఎంతవరకు సాధ్యం అనే చర్చ నడుస్తోంది.
బాన్సువాడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి.. బీజేపీని వెంటాడుతోన్న వర్గ విభేదాలు
బాన్సువాడలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. వరుసగా ఆరుసార్లు విజయం సాధించిన పోచారం.. అంతే ఆత్మవిశ్వాసం… అంతే ప్రజాదరణతో.. ముందు వరుసలో ఉన్నారు. జిల్లాలో విలక్షణ నేతగా ఉన్న పోచారం.. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో 53 శాతం ఓట్లు సాధించారు. స్పీకర్గా ఉన్నా… అవకాశం దొరికితే నియోజకవర్గంలో ఉంటారనే పేరుంది. జనాలకు నిత్యం అందుబాటులో ఉండే నేతగా పేరు ఉంది. రాష్ట్రంలోనే అత్యధిక డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించి పంపిణీ చేసిన ఘనత.. పోచారంకు దక్కుతుంది. ఐతే అనుచరుల ఆగడాలతో పాటు.. ఇద్దరు కుమారులు షాడో ఎమ్మెల్యేలుగా వ్యవహరిస్తున్న ఆరోపణలు.. పోచారంకు కొంత మైనస్గా ఉన్నాయ్. ఐతే ఈసారి పోచారం పోటీపై సందిగ్దత నెలకొంది. పోచారం కుమారులు ఇద్దరూ.. నియోజవర్గంపై కన్నేశారు. దీంతో ఎవరు బరిలోకి దిగుతారన్నది ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన కాసుల బాలరాజుతో పాటు.. చందూరు జడ్పీటీసీ అంబర్ సింగ్ టికెట్ రేసులో ఉన్నారు. బీజేపీ నుంచి మల్యాద్రిరెడ్డి పేరు ప్రస్తుతం ప్రచారంలో ఉండగా.. ఓ ఎన్ఆర్ఐ పేరును కూడా కమలం పార్టీ పరిశీలిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఐతే ఆ అజ్ఞాత ఎన్ఆర్ఐ ఎవరన్నది తేలాల్సి ఉంది. బీజేపీలోనూ ఇక్కడ రెండు వర్గాలుండటం… ఆ రెండువర్గాల మధ్య తారాస్థాయిలో విభేదాలుండటం కూడా ప్రత్యర్థి పార్టీలకు బలంగా మారనుంది.
ఎల్లారెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా జాజుల సురేందర్.. అధికార పార్టీకి దీటుగా బీజేపీ, కాంగ్రెస్ నేతల కార్యక్రమాలు
ఎల్లారెడ్డిలో జాజుల సురేందర్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచిన సురేందర్ ఆ తర్వాత గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. 2018లో కారు పార్టీ తరఫున పోటీ చేసిన ఏనుగు రవీందర్ రెడ్డి.. ప్రస్తుతం కాషాయం కండువా కప్పుకున్నారు. ఎల్లారెడ్డి ఓటర్లు ఎప్పుడూ విలక్షణ తీర్పు ఇస్తూ.. ప్రధాన పార్టీలకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్ కూడా స్ట్రాంగ్గా ఉంది. దీంతో ఎల్లారెడ్డిలో త్రిముఖ పోటీ కనిపిస్తోంది. ఎవరికి వారు తగ్గేదే లే అంటూ.. జనం నాడి పట్టేందుకు నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. అధికార పార్టీకి దీటుగా బీజేపీ, కాంగ్రెస్ నేతలు వివిధ సామాజిక సేవా కార్యక్రమాలతో పోటీ పడుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా మళ్లీ సురేందర్ పోటీ చేసేందుకు సిద్ధం అవుతుండగా.. రాబోయే ఎన్నికల్లో ఆయనకు విజయం నల్లేరు మీద నడక అయతే కాదనే ప్రచారం జరుగుతోంది. ఇక బీజేపీ తరఫున ఏనుగు రవీందర్ రెడ్డితో పాటు.. బాణాల లక్ష్మారెడ్డి టికెట్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఐతే ఎల్లారెడ్డిలో ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచి తీరాలని ఏనుగు రవీందర్ రెడ్డి పట్టుదలతో కనిపిస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్ బలంగానే కనిపిస్తున్నా.. వర్గపోరు హస్తం పార్టీని ఇబ్బందిపెడుతోంది. గ్రూప్ పాలిటిక్స్ హస్తం పార్టీని ముంచేలా కనిపిస్తున్నాయ్. జహీరాబాద్ ఎంపీగా పోటీ చేసి ఓడిన మదన్ మోహన్ రావు… ప్రస్తుతం ఎల్లారెడ్డి నియోజకవర్గంపై కన్నేశారు. దీంతో ఇక్కడ ఇంచార్చిగా ఉన్న సుభాష్ రెడ్డికి, మదన్ మోహన్ రావుకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. రచ్చబండ కార్యక్రమాల్లో.. రెండువర్గాల నేతలు బాహాబాహీకి దిగిన సంఘటనలూ ఉన్నాయ్. ఎల్లారెడ్డిలో రేవంత్ సభ సక్సెస్ కావడంతో.. కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త జోష్ కనిపిస్తున్నా.. ప్రత్యర్థి పార్టీతో ఫైట్ చేయాల్సిన ఆ పార్టీ కార్యకర్తలు తమలో తామే కొట్టుకోవడం ఇప్పుడు హస్తానికి మైనస్గా మారింది. ఏమైనా వచ్చే ఎన్నికల్లో ఇక్కడ త్రిముఖ పోరు ఖాయంగా కనిపిస్తోంది.
జుక్కల్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా హన్మంత్ షిండే.. ఈసారి త్రిముఖ పోటీగా తప్పదా?
జుక్కల్లో హన్మంత్ షిండే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. 2018 ఎన్నికల్లో జుక్కల్లో ద్విముఖ పోటీ ఉండగా.. ఈసారి అది త్రిముఖ పోటీగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయ్. బీఆర్ఎస్ నుంచి హన్మంతు షిండే మళ్లీ పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్మెల్యే గంగారాంతో పాటు నిజామాబాద్ డీసీసీ మాజీ అధ్యక్షుడు గడుగు గంగారాం కూడా టికెట్ రేసులో ఉన్నారు. బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత కామారెడ్డి జిల్లా అధ్యక్షురాలు అరుణతార బరిలో దిగే అవకాశాలు ఉన్నాయ్. ఇలా జహీరాబాద్ పార్లమెంట్తో పాటు.. ఏడు అసెంబ్లీ స్థానాల్లోనూ రాజకీయం రసవత్తరంగా మారింది. 2018తో కంపేర్ చేస్తే.. పాలిటిక్స్ పూర్తిగా మారిపోయినట్లు కనిపిస్తున్నాయ్. దీంతో వచ్చే ఎన్నికల్లో రసవత్తర పోరు ఖాయంగా కనిపిస్తోంది.