Govt Old Age Homes : ఏపీలోని వృద్ధులకు తీపికబురు.. వృద్ధుల సంరక్షణ కోసం కొత్తగా 12 వృద్ధాశ్రమాలు!
Govt Old Age Homes : ఏపీ ప్రభుత్వం కేంద్ర ఆర్థిక సాయంతో ఎవరి తోడు లేని అనాధ వృద్ధులకు అండగా నిలిచేందుకు కొత్తగా 12 వృద్ధాశ్రమాలను ఏర్పాటు చేయనుంది.

AP Old Age Homes
Govt Old Age Homes : ఆంధ్రప్రదేశ్ రాష్టంలోని వృద్ధులకు తీపికబురు చెప్పింది కూటమి ప్రభుత్వం. రాష్ట్రంలోని అనాధ వృద్ధుల సంరక్షణ కోసం 12 వృద్ధాశ్రామాలను ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు బడ్జెట్ సమావేశంలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యవుల కేశవ్ ప్రకటించారు.
ఎవరి తోడు లేని అనాధ వృద్ధులకు అండగా నిలిచేందుకు కొత్తగా 12 వృద్ధాశ్రమాలను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. దీనికి సంబంధించి ఇటీవలే కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఏపీ ప్రభుత్వం ప్రతిపాదనల మేరకు కేంద్రం రాష్ట్రంలోని పలుచోట్ల వృద్ధాశ్రమాల ఏర్పాటు చేసేందుకు అనుమతినిచ్చింది.
ఏపీలో వృద్ధాశ్రమాలు ఎక్కడెక్కడంటే? :
దేశ వ్యాప్తంగా మొత్తం 32 వృద్ధాశ్రమాలను కేంద్రం కేటాయించగా.. అందులో ఆంధ్రప్రదేశ్కు 12 వృద్ధాశ్రమాలను మంజూరు చేసింది. రాష్ట్రంలో తిరుపతి జిల్లాలో 4 వృద్ధాశ్రమాలు, వైఎస్సార్ జిల్లాలో 2 వృద్ధాశ్రమాలు, శ్రీసత్యసాయి, ఎన్టీఆర్ జిల్లా, పల్నాడు, మన్యం, పార్వతీపురం, అనకాపల్లి, కాకినాడలో ఒక్కో వృద్ధాశ్రమాన్ని కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. అయితే, ఒక్కో వృద్ధాశ్రమం ఏర్పాటుకు అయ్యే ఖర్చు కోసం రూ. 25 లక్షలను కేంద్రం మంజూరు చేసింది.
ఒక వృద్ధాశ్రమంలో కనీసం 25 మంది ఉండాలి. అప్పుడు మాత్రమే కేంద్రం ప్రతి ఏటా రూ.21 లక్షలు మంజూరు చేస్తుంది. వృద్ధుల సంరక్షణ కోసం స్వచ్ఛంద సేవా సంస్థలు ఈ వృద్ధాశ్రమాలను నిర్వహించనున్నాయి. ఇప్పటికే ఏపీలో 68 వృద్ధాశ్రమాలు స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో నడుస్తున్నాయి.
ఇవన్నీ కేంద్రం ఆర్థిక సాయంతోనే నడిపిస్తున్నారు. అలాగే, ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో మాత్రం చిత్తూరు, మచిలీపట్నంలోని వృద్ధాశ్రమాలు నడుస్తున్నాయి. మరో వంద వరకు ప్రైవేట్ నిర్వహణలో కూడా వృద్ధాశ్రమాలు ఉన్నాయి.