Konaseema Internet : మరో 48 గంటలు ఇంటర్నెట్ బంద్.. 91మంది అరెస్ట్
కోనసీమలోని 8 మండలాల్లో మరో 48 గంటల పాటు ఇంటర్నెట్ సేవలు నిలిపివేయాలని అధికారులు నిర్ణయించారు.
Konaseema Internet : కోనసీమలోని 8 మండలాల్లో మరో 48 గంటల పాటు ఇంటర్నెట్ సేవలు నిలిపివేయాలని అధికారులు నిర్ణయించారు. అమలాపురం, అంబాజీపేట, అయినవిల్లి, ఉప్పలగుప్తం, అల్లవరం, కొత్తపేట, రావులపాలెం, ముమ్మిడివరం మండలాల్లో ఇంటర్నెట్ సేవలు కట్ చేశారు. మే 24న అమలాపురంలో అల్లర్లు జరిగాయి. అప్పటి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. ఇక ఇప్పటివరకు అల్లర్ల కేసులో 91 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు.
కోనసీమ జిల్లా పేరుని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పేరు మారుస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అగ్గి రాజేసింది. పేరు మార్పుని నిరసిస్తూ జిల్లా కేంద్రం అమలాపురంలో కోనసీమ సాధన సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ఆందోళన కార్యక్రమం ఉద్రిక్తతలకు దారితీసింది. పోలీసులు లాఠీచార్జి చేయడంతో ఆందోళనకారులు రెచ్చిపోయారు. విధ్వంసానికి పాల్పడ్డారు. హింస చోటు చేసుకుంది. ఆందోళనకారులు మంత్రి, ఎమ్మెల్యే ఇళ్లకు నిప్పు పెట్టారు. బస్సులను తగులబెట్టారు. దీంతో అమలాపురం అల్లకల్లోలమైంది.
Konaseema Tension : అంబేద్కర్ పేరుతో పచ్చని కోనసీమలో ప్రభుత్వం చిచ్చు పెట్టింది : జీవీఎల్
అమలాపురంలో అల్లర్ల కేసులో అరెస్ట్ల పర్వం ఇంకా కొనసాగుతోంది. ఇప్పటికే 71 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు తాజాగా గురువారం మరో 20 మందిని అరెస్ట్ చేశారు. దీంతో ఈ అల్లర్లలో ఇప్పటిదాకా 91 మందిని అరెస్ట్ చేసినట్టైంది.
ఇదిలా ఉంటే… అల్లర్ల నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా నిలిచిపోయిన ఇంటర్నెట్ సేవలు కొన్ని మండలాల్లో మాత్రమే పునరుద్ధరణకు నోచుకున్నాయి. అమలాపురం సహా మరో 8 మండలాల్లో మరో 48 గంటల పాటు ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తున్నట్లు అధికారులు గురువారం ప్రకటించారు. మరోవైపు జిల్లావ్యాప్తంగా పోలీసుల ఆంక్షలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.
Konaseema Internet Shutdown : వర్క్ ఫ్రమ్ గోదారి గట్టు.. కోనసీమలో ఐటీ ఉద్యోగుల కష్టాలు
ఇంటర్నెట్ సేవలు నిలిచిపోవడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న సాఫ్ట్ వేర్ ఇంజినీర్ల పరిస్థితి బాధాకరం. ఇంటర్నెట్ సేవలు నిలిచిపోవడంతో వారి బాధలు వర్ణానాతీతం. గోదావరి గట్టు దగ్గర ఇంటర్నెట్ వస్తోందని తెలుసుకున్న టెకీలు.. ల్యాప్ టాప్ లు, చార్జర్లతో అక్కడి వాలిపోయారు. అక్కడే ఉండి తమ ఆఫీసు పని చేసుకుంటున్నారు. ఇంటర్నెట్ సేవలు నిలిపివేసిన కారణంగా తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, త్వరగా ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరించాలని సాఫ్ట్ వేర్ ఉద్యోగులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.