Jagananna Thodu : జగనన్న తోడు.. ఫిబ్రవరి 28కి వాయిదా
ఏపీలో జగనన్న తోడు పథకం అమలు వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 22న జగనన్న తోడు మూడో దశను సీఎం జగన్ ప్రారంభించాల్సి ఉంది. అయితే..

Jagananna Thodu Scheme
Jagananna Thodu : ఏపీలో జగనన్న తోడు పథకం అమలు వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 22న జగనన్న తోడు మూడో దశను సీఎం జగన్ ప్రారంభించాల్సి ఉంది. అయితే పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ శాఖల మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఆకస్మిక మరణంతో 22వ తేదీన నిర్వహించ తలపెట్టిన ‘జగనన్న తోడు’ మూడవ విడత సాయం అందజేత కార్యక్రమాన్ని ఫిబ్రవరి 28కి వాయిదా వేసింది ప్రభుత్వం. ఈ మేరకు సమాచార, పౌర సంబంధాల శాఖ ఎక్స్ అఫీషియో సెక్రటరీ, కమిషనర్ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి ప్రకటించారు.
మేకపాటి గౌతమ్ రెడ్డి మృతికి సంతాప సూచనగా రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజుల సంతాప దినాలను ప్రకటించింది. గౌతమ్ రెడ్డి స్వగ్రామం నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం బ్రాహ్మణపల్లిలో అంత్యక్రియలను రాష్ట్ర ప్రభుత్వ అధికార లాంఛనాలతో నిర్వహించనునుంది.
వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలను వరుసగా మూడో ఏడాది కూడా అమలు చేస్తోంది. ఇప్పటికే కొన్ని పథకాలకు శ్రీకారం చుట్టగా.. మరికొన్ని ఈ నెలలోనే అమలు చేయనున్నారు. ఈ నెలలోనే ‘జగనన్న తోడు’ పథకం అమలు చేయనుంది ప్రభుత్వం. ఈ పథకం కింద చిరు వ్యాపారులకు మూడో విడత కింద లబ్ధి చేకూర్చనుంది. ఈ పథకానికి సంబంధించి ఇప్పటికే 9,05,023 మంది లబ్ధిదారులను గుర్తించారు.
Jagananna Chedodu Scheme : రూ.10వేలు రాలేదా? మార్చి 11లోపు ఇలా చేయండి…
బ్యాంకుల ద్వారా గత రెండు విడతలుగా ఇప్పటివరకు 6,91,530 మంది లబ్దిదారులు రుణాలు పొందారు. మూడో దశలో మరో 1,57,760 మంది రుణాలు పొందుతారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో అర్హుల జాబితా నుంచి, సోషల్ ఆడిట్ నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారు. జగనన్న తోడు పథకం కింద ఒక్కో చిరు వ్యాపారికి ఏటా రూ.10 వేల వరకు వడ్డీలేని రుణాన్ని ప్రభుత్వం అందిస్తోంది.
రూ.10వేలకు ఏడాదికి అయ్యే వడ్డీని ప్రభుత్వం నేరుగా లబ్దిదారులకు అందిస్తుంది. నిరుపేదలైన చిరు వ్యాపారులు, తోపుడు బండ్ల వ్యాపారులు, హస్త కళాకారులు, సాంప్రదాయ చేతి వృత్తుల వారికి ఒక్కొక్కరికి ఏటా రూ. 10వేలు వడ్డీలేని రుణాన్ని ప్రభుత్వం అందజేస్తుంది. బ్యాంకుల్లో తీసుకున్న రుణాన్ని లబ్దిదారులు తిరిగి చెల్లించిన తర్వాత మరలా వారు బ్యాంకుల నుండి వడ్డీ లేని రుణం తీసుకోవచ్చు.