Thalliki Vandanam: మీ అకౌంట్‌‌లో ‘తల్లికి వందనం’ డబ్బులు జమకాలేదా..? అయితే ఇలా చేయండి..

ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న తల్లికి వందనం పథకం కింద అర్హులైన లబ్ధిదారుల అంకౌట్లలో నగదు జమవుతుంది..

Thalliki Vandanam: మీ అకౌంట్‌‌లో ‘తల్లికి వందనం’ డబ్బులు జమకాలేదా..? అయితే ఇలా చేయండి..

Talliki Vandanam Scheme

Updated On : June 15, 2025 / 8:53 AM IST

Thalliki Vandanam: ఏపీ ప్రభుత్వం ‘తల్లికి వందనం’ పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకం కింద ఒక్కో విద్యార్థికి రూ.15వేలు చొప్పున విడుదల చేయగా.. ఇందులో రూ.13వేలు లబ్ధిదారుల బ్యాంక్ అంకౌట్లలో జమ అవుతుంది. మిగిలిన రూ.2వేలు ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం కలెక్టర్ల ఖాతాలకు జమ చేస్తున్నారు.

Also Read: బంగారం రూ.3 లక్షలు.. ఆ రెండు దేశాలు చేస్తున్న హడావిడి చూస్తుంటే.. గోల్డ్ రేట్లు ఆకాశంలోకే..!

ఏపీ ప్రభుత్వం తల్లికి వందనంకు సంబంధించిన డబ్బులను రిలీజ్ చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో విద్యార్థుల తల్లుల, సంరక్షకుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతున్నాయి. లబ్ధిదారుల ఖాతాల్లో తల్లికి వందనం డబ్బులు జమ అవుతున్నాయని తెలుగుదేశం పార్టీ ‘ఎక్స్’ ఖాతాలో పోస్టు చేసింది. ఇద్దరు పిల్లలు ఉన్న లబ్ధిదారుకి రూ.26వేలు పడ్డాయి.. రూ.4వేలు స్కూల్ ఖాతాలో పడ్డాయి అంటూ ట్వీట్ లో పేర్కొంది.

 

తల్లికి వందనం నిధులు బ్యాంక్ అకౌంట్లలో జమ అవుతున్న నేపథ్యంలో మీ అకౌంట్ లో డబ్బులు జమ అయ్యాయా..? లేదా..? స్టేటస్ చెక్ చేసుకోవడానికి కూడా ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఆన్‌లైన్ ద్వారా, వాట్సాప్ గవర్నెన్స్‌ మనమిత్ర ద్వారా కూడా తల్లికి వందనం స్టేటస్‌ను చెక్ చేసుకోవచ్చు.

ఆన్‌లైన్‌లో తల్లికి వందనం స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలంటే…
♦ తల్లికి వందనం స్టేటస్ చెక్ చేసుకోవడానికి… అధికారిక వెబ్‌సైట్ https://gsws-nbm.ap.gov.in/NBM/#!/ApplicationStatusCheckPకి వెళ్లాలి.
♦ స్కీం అనే ఆప్షన్ లో తల్లికి వందనం పథకంను ఎంపిక చేసుకోవాలి.
♦ సంవత్సరం వద్ద 2025-26 సెలక్ట్ చేసుకోవాలి. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి, క్యాప్చ్ ను పూరించాలి.
♦ గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి. లింక్ చేసిన మొబైల్ నెంబర్ కు ఓటీపీ వస్తుంది.
♦ ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ పై క్లిక్ చేయాలి.
♦ ఆ తరువాత తల్లికి వందనం పథకానికి సంబంధించిన అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవచ్చు.

 

వాట్సాప్ ద్వారా ఎలా చెక్ చేసుకోవాలంటే…?
♦ ఏపీ ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన వాట్సాప్ మనమిత్ర నెంబర్ 9552300009 నుంచి ‘Hi’ అని మెసెజ్ చేయాలి.
♦ మీకు కావాల్సిన సేవను ఎంచుకోండి అని వస్తుంది. దానిపై క్లిక్ చేసి.. డ్రాప్ డౌన్ నుంచి తల్లికి వందనం స్థితిని ఎంచుకోవాలి.
♦ ఆ తరువాత అక్కడ సూచించిన విధంగా తల్లి ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. తద్వారా మీ తల్లికి వందనం స్టేటస్ తెలుసుకోవచ్చు.

గ్రామ, వార్డు సచివాలయాల్లోనూ తెలుసుకోవచ్చు..
వెబ్ సైట్, వాట్సాప్ ద్వారా తల్లికి వందనంకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియకపోతే.. గ్రామ, వార్డు సచివాలయాల్లోకి వెళ్లి తెలుసుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో తల్లికి వందనం పథకంకు సంబంధించిన లబ్ధిదారుల జాబితాను అందుబాటులో ఉంచారు. ఒకవేళ ఈ జాబితాపై అభ్యంతరాలు ఉన్నా.. అర్హత ఉండి డబ్బులు జమ కాకపోయినా.. ఏవైనా ఫిర్యాదులు ఉంటే స్వీకరిస్తారు.

వారందరికీ జులై 5న డబ్బులు జమ..
తల్లికి వందనం పథకానికి సంబంధించి ఫిర్యాదులను జూన్ 12 నుంచి 20వరకు స్వీకరిస్తారు. గ్రీవెన్స్ పరిశీలన, అదనపు జాబితాను జూన్ 21 నుంచి 28 మధ్య రెడీ చేస్తారు. ఒకటో తరగతి, ఇంటర్మీడియట్ ఫస్టియర్ అర్హులైన విద్యార్థుల జాబితాను జూన్ 30న ప్రదర్శిస్తారు. వీరందరికీ జులై 5వ తేదీన వారివారి అకౌంట్లలో డబ్బులు జమ చేస్తారు. తల్లికి వందనం పథకంకు అర్హత ఉండి.. డబ్బులు జమ కాకుంటే వెంటనే ఫిర్యాదు చేయాలని అధికారులు సూచిస్తున్నారు.