ఏపీలో పంచాయితీ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

ఏపీలో పంచాయితీ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

Updated On : January 21, 2021 / 11:25 AM IST

AP High Court green signal for local body elections:గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై హైకోర్టులో దాఖలైన రిట్‌ పిటిషన్‌పై హైకోర్టు తీర్పు వెల్లడించింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ దాఖలుచేసిన పిటిషన్‌పై రెండు రోజులు విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం తీర్పును ఇచ్చింది. రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుపుకోవచ్చు అని హైకోర్టు ధర్మాసనం తీర్పు వెలువరించింది.

ఏపీలో స్థానిక సంస్ధల ఎన్నికలకు ఇప్పటికే నోటిఫికేషన్ ఇచ్చేసింది ఎన్నికల సంఘం. పంచాయతీ ఎన్నికలను నిర్వహించేందుకు ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోగా.. నాలుగు దశల్లో ఏపీ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును కొట్టేసిన హైకోర్టు.. ఎవరికీ ఇబ్బందులు లేకుండా ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేలా చూడాలని ఆదేశించింది.

ఎన్నికల ప్రక్రియను నిలిపివేస్తూ గతంలో సింగిల్‌ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ హైకోర్టును ఆశ్రయించగా పిటిషన్‌పై హైకోర్టు సీజే జస్టిస్‌ ఏకే గోస్వామి, జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం విచారణ ముగించి తీర్పును ఇచ్చింది.