నో రిలాక్స్‌.. ఓన్లీ వర్క్..మంత్రులకు ఊస్టింగ్‌ గుబులు..!

అమాత్యుల దూకుడుతో క్యాడర్‌లో కొత్త ఉత్సాహం..క‌నిపిస్తున్నా..పనితీరు బాలేని వారిని చంద్రబాబు క‌రుణిస్తారో లేదోనన్నది క్వశ్చన్‌ మార్క్‌గా మిగిలిపోతోంది.

నో రిలాక్స్‌.. ఓన్లీ వర్క్..మంత్రులకు ఊస్టింగ్‌ గుబులు..!

Updated On : July 31, 2025 / 8:24 PM IST

ఈ ఐదేళ్లు మీ పదవి ఉండాలన్నా..మీ రాజకీయ భవిష్యత్‌ బాగుండాన్నా కష్టపడి పనిచేయాల్సిందే. పనితీరే భవిష్యత్‌కు పునాది. ఇది ఏపీ చంద్రబాబు మంత్రులకు పదేపదే చేసిన ఉపదేశం. సార్‌ ఎన్నిసార్లు చెప్పినా అమాత్యులు మాత్రం పెద్దగా సీరియస్‌గా తీసుకోలేదు. ఆ తర్వాత ఫైనల్‌ వార్నింగ్‌ ఇచ్చేశారు. కొందరిని తప్పించి కొంతవారిని తీసుకోక తప్పదని చెప్పకనే చెప్పారు. సీఎం చంద్రబాబు..అలా వార్నింగ్ ఇచ్చారో లేదో..నెక్స్ట్ మినిట్‌ నుంచి క్యాబినెట్ ప్రక్షాళన అంటూ ప్రచారం ఊపందుకుంది.

ఐదారుగురి మంత్రుల ప్రోగ్రెస్ రిపోర్ట్‌ వీక్‌గా ఉందని..వాళ్లను తప్పిస్తారంటూ పేర్లు కూడా ప్రచారం జరిగాయి. ఆగస్ట్‌లో క్యాబినెట్ షఫ్లింగ్ అంటూ ఓ డేట్‌ కూడా ఫిక్స్ చేశారు. ఇవన్నీ గాలి వార్తలే..ఇప్పట్లో మంత్రివర్గంలో మార్పులు, చేర్పులేం ఉండవంటూ టీడీపీ పెద్దలు క్లారిటీ ఇచ్చారు. అయినా మంత్రులు రిలాక్స్‌ కావడం లేదట. ఎందుకొచ్చిన తలనొప్పంటూ..తమ ప్రోగ్రెస్‌ రిపోర్ట్‌ను మరింత బాగుండేలా ప్లాన్ చేసుకుంటున్నారట. ఇప్పుడు కాకపోతే ఇంకో ఏడాదిన్నర తర్వాత అయినా మంత్రివర్గ విస్తరణ జరగొచ్చు. అప్పుడు పనితీరు బాలేదంటూ పక్కకు పెట్టొచ్చు. ఇప్పటికైనా మించి పోయిందేమి లేదని..ఇక పబ్లిక్‌లో ఉండి..అధిష్టానం దగ్గర మార్క్స్‌ కొట్టేయాలని స్కెచ్ వేస్తున్నారట.

Also Read: భారత్‌పై ట్రంప్‌ విధించిన టారిఫ్‌పై రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష నేతలు ఏమన్నారో తెలుసా?

పోస్ట్ ఊస్టింగ్ టెన్షన్‌ ఏమో గానీ..నిన్న మొన్నటి వ‌ర‌కు మ‌న‌కు ఎందుకులే అనుకుని ఇంటికే ప‌రిమిత‌మైన అమాత్యులంతా..ఇప్పుడు వద్దన్నా నియోజకవర్గాల్లో తిరుగుతున్నారట. ఏదో ఒక కార్యక్రమంతో పబ్లిక్‌లో ఉండేలా ప్రోగ్రామ్స్ డిజైన్ చేసుకుంటున్నారట. ఐదారుగురు మంత్రులు అయితే ఇళ్లను వ‌దిలేసి..విజయవాడ టు జిల్లాల టూర్‌, నియోజకవర్గ పర్యటనలతో తెగ బిజీ అయిపోయారట. దీంతో ఇప్పుడు ఎక్కడ చూసినా..నియోజ‌క‌వ‌ర్గాల్లో మంత్రుల సంద‌డి పెరిగిపోయిందంటున్నారు. సుప‌రిపాల‌న‌లో తొలి అడుగు కార్యక్రమంలో జోరుగా పాల్గొంటున్నారు. నిన్న మొన్నటి వ‌రకు లేని సంద‌డి..ఇప్పుడు నియోజ‌క‌వ‌ర్గాల్లో క‌నిపిస్తోందట.

లోకల్ లీడర్లు, క్యాడర్ షాక్
మంత్రి వ‌ర్గ విస్తర‌ణ‌కు రంగం రెడీ అవుతున్నద‌న్న చ‌ర్చే మంత్రులను ఉరుకులు పరుగులు పెట్టేలా చేస్తుందట. అవును. ఇది కాస్త ఆశ్చర్యంగా అనిపించినా నిజమేనట. ఈ విష‌యం టీడీపీలోనూ చ‌ర్చకు వ‌స్తోందట. అమాత్యుల ఉలికిపాటు ఎందుకో నాయ‌కులు..కార్యకర్తల‌కు తెలిసిపోయిందట. విజయవాడ వెళ్లి కలుద్దామంటే కూడా టైమ్‌ ఇవ్వని మంత్రులు కూడా.. నియోజకవర్గాల్లో కనిపిస్తుండటంతో లోకల్ లీడర్లు, క్యాడర్ షాక్ అవుతున్నారట.

మంత్రివ‌ర్గాన్ని విస్తరించ‌డ‌మో..లేక‌..కొంతమందిని పక్కన పెట్టి..మ‌రికొంద‌రిని తీసుకోవ‌డ‌మో ఖాయ‌మ‌న్న టాక్‌ చక్కర్లు కొట్టడంతో..రెడ్ జోన్‌లో ఉన్నారని ప్రచారం జరుగుతున్న మంత్రుల‌తో పాటు..అంద‌రూ రంగంలోకి దిగారట. చంద్రబాబు నిర్ణయాలు ఎలా ఉంటాయో తెలిసిన పలువురు మంత్రులు అయితే..కాలికి బ‌ల‌పం క‌ట్టుకుని మ‌రీ తిరుగుతున్నారట.

మంత్రులు వంగలపూడి అనిత‌, స‌విత‌, అన‌గాని స‌త్యప్రసాద్‌, కొండ‌ప‌ల్లి రాంప్రసాద్‌రెడ్డి వంటి..10 మంది మంత్రులు..అస‌లు ఇళ్లను కూడా మ‌రిచిపోయారట. నియోజ‌క‌వ‌ర్గాల్లోనే తిష్ట వేసి క్యాడర్, లీడర్లకు అందుబాటులో ఉండటంతో పాటు నిత్యం ప్రజ‌ల‌ను క‌లుస్తూ తెగ బిజీ అయిపోతున్నారట. ఒక రోజులో నాలుగైదు నియోజ‌క‌వ‌ర్గాల ప‌ర్యటనలు పెట్టుకుంటున్నారట. స‌భ‌లు, సమావేశాలు, ప్రెస్‌మీట్లతో హడావుడి చేస్తూ..ప్రజ‌ల‌ను క‌లుస్తూ సీఎం చంద్రబాబు దృష్టికి ఆకట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు.

అందుకోసం సోషల్ మీడియాలో కూడా మంత్రులు పర్సనల్ అకౌంట్లు, వారి అనుచరగణం పోస్ట్‌లు ఎక్కువైపోయాట. వైసీపీ హ‌యాంలో జ‌రిగిందేంటి.? ఇప్పుడు జ‌రుగుతున్నదేంటి.? అనే విషయాల‌ను వివ‌రిస్తున్నారట. పైగా విపక్షానికి కౌంటర్‌ ఇవ్వడంలో కూడా ముందు ఉంటున్నారట. మంత్రుల టూర్లతో ఉమ్మడి గోదావ‌రి జిల్లాలు స‌హా..అనంత‌పురంలో హ‌డావుడి క‌నిపిస్తోంది.

అమాత్యుల దూకుడుతో క్యాడర్‌లో కొత్త ఉత్సాహం..క‌నిపిస్తున్నా..పనితీరు బాలేని వారిని చంద్రబాబు క‌రుణిస్తారో లేదోనన్నది క్వశ్చన్‌ మార్క్‌గా మిగిలిపోతోంది. ఇప్పటికే తెప్పించుకున్న రెండు మూడు స‌ర్వే రిపోర్ట్‌లను బేస్‌ చేసుకుని పలువురు మంత్రుల పనితీరుపై ఒక నిర్ణయానికి వ‌చ్చారట చంద్రబాబు. ఈ విషయం తెలిసే మంత్రులు ఇప్పుడు ప్రజాబాట ప‌ట్టార‌ని అంటున్నారు. ఈ ఉరుకులు, పరుగులతోనైనా అమాత్యులు తమ బెర్త్‌ను సుస్థిరం చేసుకుంటారా లేదా అనేది చూడాలి మరి.