నిమ్మగడ్డ దూకుడు.. ఎన్నికల నిర్వహణకు అనుకూల వాతావరణం ఉందని నివేదిక, గవర్నర్ నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి

sec nimmagadda meets governor: ఏపీలో స్థానిక ఎన్నికల నిర్వహణపై ఎస్ఈసీ దూకుడు పెంచింది. గవర్నర్ బిశ్వభూషణ్ను ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కలిశారు. బుధవారం(నవంబర్ 18,2020) ఉదయం గవర్నర్ తో నిమ్మగడ్డ భేటీ అయ్యారు. సుమారు 40 నిమిషాల పాటు గవర్నర్ తో భేటీ అయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికలు, ప్రభుత్వ వైఖరిపై గవర్నర్ తో చర్చించారు నిమ్మగడ్డ.
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు పూర్తి అనుకూల వాతావరణం ఉందని గవర్నర్ కు తెలిపారు ఎస్ఈసీ నిమ్మగడ్డ. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వ విధానాలు, ప్రభుత్వం కలిగిస్తున్న ఆటంకాలపై గవర్నర్ కు ఫిర్యాదు చేశారు నిమ్మగడ్డ. ఈ సందర్భంగా వివరణతో కూడిన నివేదికను గవర్నర్ కు అందజేశారు నిమ్మగడ్డ. అలాగే ఎన్నికలు నిర్వహించలేము అంటూ సీఎస్ రాసిన లేఖను కూడా గవర్నర్ కు ఇచ్చారు. గవర్నర్ తో ఎస్ఈసీ భేటీ ఏపీ రాజకీయవర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఎస్ఈసీతో భేటీ తర్వాత.. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.
మరోవైపు మధ్యాహ్నం జిల్లా కలెక్టర్లు, పంచాయతీ అధికారులతో నిమ్మగడ్డ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించబోతున్నారు. వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొనాలని ఆయాశాఖల అధికారులకు నిమ్మగడ్డ లేఖ రాశారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై అధికారులతో ఎస్ఈసీ చర్చించనున్నారు. సమావేశానికి సీఎస్ అనుమతి తీసుకున్నట్టు లేఖలో ప్రస్తావించారు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్కుమార్.
జగన్ ప్రభుత్వం వర్సెస్ ఎన్నికల కమిషన్:
ఏపీ ప్రభుత్వం వర్సెస్ ఎన్నికల కమిషన్…స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంలో ఏపీలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి ఇది. కరోనా కారణంగా 2020 మార్చిలో వాయిదా వేసిన స్థానిక ఎన్నికలను 2021 ఫిబ్రవరిలో ఎలాగైనా నిర్వహించాలని ఎలక్షన్ కమిషన్ భావిస్తోంది. అదే సమయంలో ఎన్నికల నిర్వహణను తాత్కాలికంగా నిలిపివేసేందుకు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. కరోనా తీవ్రత తగ్గిందని.. ఎన్నికలు నిర్వహిస్తామని ఎన్నికల కమిషన్ అంటోంటే.. చలికాలంలో వైరస్ విజృంభించే ప్రమాదముందన్న కేంద్రం హెచ్చరికలను ప్రస్తావిస్తూ….ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని జగన్ ప్రభుత్వం అంటోంది.
మిగిలిన రాష్ట్రాలతో ఏపీని పోల్చి చూడొద్దు:
బీహార్ అసెంబ్లీ ఎన్నికలు, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నోటిఫికేషన్, ఇతర రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికలను ఎలక్షన్ కమిషన్ ఉదాహరణగా చూపుతోంటే.. మిగిలిన ఏ రాష్ట్రాలతోనూ ఏపీని పోల్చి చూడొద్దని ప్రభుత్వం అంటోంది. ఫిబ్రవరిలో ఎన్నికల నిర్వహణ ఆలోచన సరైన నిర్ణయం కాదని…ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని…ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డకు లేఖ రాయడం…ఈ లేఖ….ఎన్నికల కమిషన్ స్వయం ప్రతిపత్తిని ప్రశ్నించడమేనని నిమ్మగడ్డ బదులివ్వడం… ఈ వ్యవహారంలో తాజా పరిణామం…
కరోనా తీవ్రత తగ్గిందన్న ఈసీ:
వచ్చే(2021) ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహిస్తామని ఎలక్షన్ కమిషన్ ప్రకటించడంతో ఏపీలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించాక షెడ్యూల్ ఖరారు చేస్తామని ఎన్నికల కమిషన్ తెలిపింది. రాష్ట్రంలో కరోనా తీవ్రత తగ్గిందని, ఒకప్పుడు రోజుకు పదివేలకు పైగా కేసులు నమోదైతే.. ప్రస్తుతం వాటి సంఖ్య రెండు వేలకు తగ్గిందని ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ అన్నారు. రాజకీయ పార్టీల అభిప్రాయం తీసుకున్నామని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో మాట్లాడామని… అన్ని పరిస్థితులు గమనించాక….రాష్ట్రంలో కరోనా నియంత్రణలో ఉందని గమనించి..ఎన్నికల నిర్వహణకు సిద్ధమయ్యామని తెలిపారు.