CM Chandrababu: న్యాయం చేయకపోతే ఇలాగే అవుతుంది.. జెన్ జీపై సీఎం చంద్రబాబు ఆసక్తికర కామెంట్స్
ఎవరైనా ప్రశ్నిస్తారని, ప్రస్తుతం Gen Z కూడా అదే చేస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu)వ్యాఖ్యానించారు.
CM Chandrababu Naidu sensational comments on Gen z protests
- Gen Z నిరసనలపై సీఎం
- మానవీయ కోణంలో సమస్యల పరిష్కారం
- రూ.1.50 లక్షల కోట్ల సంక్షేమం
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ పాలనలో నూతన శకాన్ని ఆవిష్కరిస్తూ, ప్రజా సమస్యల పట్ల అధికారుల వైఖరి మారాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu)స్పష్టం చేశారు. మారుతున్న సమాజ పరిస్థితులకు అనుగుణంగా ప్రభుత్వం అందిస్తున్న ప్రతి పైసా ప్రజలకు ఉపయోగపడేలా, వారి జీవితాల్లో వెలుగులు నింపేలా ఉండాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ల కాన్ఫరెన్స్లో ప్రజలకు, అధికారులకు మధ్య ఉన్న సంబంధాలను, సంక్షేమ ఫలాల ఉత్పాదకతను పునఃసమీక్షిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.
Gen Z పోరాటం అధికారులకు హెచ్చరిక:
కలెక్టర్ల కాన్ఫరెన్స్లో ‘Gen Z’ ఆందోళనలపై సీఎం చంద్రబాబు స్పందిస్తూ.. అది ఏదీ ప్రత్యేకమైన విషయం కాదని తేల్చిచెప్పారు. న్యాయం జరగనప్పుడు ఎవరైనా ప్రశ్నిస్తారని, ఏసీ గదుల్లో కూర్చొని ప్రజల సమస్యలను పట్టించుకోకపోతే కడుపుమండినవారు తిరగబడతారని, ప్రస్తుతం Gen Z కూడా అదే చేస్తోందని వ్యాఖ్యానించారు. అధికారులు మానవీయ కోణంతో, సానుభూతితో ప్రజల సమస్యలను అర్థం చేసుకుని పరిష్కరించాలని, కేవలం అధికారిక ప్రక్రియగా చూడకూడదని హెచ్చరించారు.
రూ.1.50 లక్షల కోట్ల వ్యయం – శాశ్వత పరిష్కారాలే లక్యం:
సంక్షేమం కోసం ప్రభుత్వం ఇప్పటివరకు రూ.1.50 లక్షల కోట్లు ఖర్చు చేసిందని, ఇందులో ఒక్క పెన్షన్లకే రూ.73 వేల కోట్ల నుంచి రూ.75 వేల కోట్లు వెచ్చించామని సీఎం తెలిపారు. కేవలం నగదు పంపిణీ వల్ల ఆర్థిక అసమానతలు తొలిగిపోవని, ప్రభుత్వం వెచ్చించే ప్రతి రూపాయి ఉత్పాదకంగా ఉండేలా చూడాలని సూచించారు. ప్రజలను ఆర్థికంగా బలోపేతం చేస్తూ వారి పేదరికానికి శాశ్వత పరిష్కారాలు చూపేలా అధికారులు ప్రణాళికలు రూపొందించాలని దిశానిర్దేశం చేశారు.
