Jagananna Thodu : చెక్ చేసుకోండి.. వారి ఖాతాల్లో రూ.10వేలు వేసిన సీఎం జగన్
కరోనా కష్టకాలంలోనూ ఆర్థిక ఇబ్బందుల్లోనూ సీఎం జగన్ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. ఆర్థిక సాయం అందిస్తున్నారు. తాజాగా..

Jagananna Thodu
Jagananna Thodu : కరోనా కష్టకాలంలోనూ ఆర్థిక ఇబ్బందుల్లోనూ సీఎం జగన్ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. ఆర్థిక సాయం అందిస్తున్నారు. తాజాగా జగనన్న తోడు పథకం ద్వారా చిరు వ్యాపారులకు అండగా నిలిచారు సీఎం జగన్. జగనన్న తోడు పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా 3.70 లక్షల మంది చిరు వ్యాపారుల ఖాతాల్లో రూ.10 వేల చొప్పున రూ.370 కోట్లను ప్రభుత్వం మంగళవారం(జూన్ 8,2021) విడుదల చేసింది. క్యాంపు కార్యాలయంలో కంప్యూటర్ బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేశారు సీఎం జగన్.
చిరు వ్యాపారులకు మేలు చేసే మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని జగన్ అన్నారు. పాదయాత్రలో చిరు వ్యాపారుల కష్టాలు చూశానని, వారి కోసం జగనన్న తోడు ద్వారా వడ్డీలేని రుణాలు అందిస్తున్నామని తెలిపారు. గతేడాది జగనన్న తోడు ద్వారా 5.35 లక్షల మంది రుణ సౌకర్యం పొందారని సీఎం గుర్తుచేశారు.
గతేడాది నవంబర్ 25న ఈ పథకానికి శ్రీకారం చుట్టిన సీఎం జగన్ ఆ రోజు రాష్ట్రవ్యాప్తంగా 5.35 లక్షల మంది లబ్ధిదారులకు సున్నా వడ్డీకే రూ.10 వేల చొప్పున రుణాలను అందించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అందించిన 3.70 లక్షల మందిని కూడా కలిపితే మొత్తం 9.05 లక్షల మంది లబ్ధిదారులకు రూ.905 కోట్లను ఇచ్చారు.
రెండో విడతలో 3.7 లక్షల మంది చిరువ్యాపారులకు రూ.370 కోట్ల రుణ సౌకర్యం అందించామని జగన్ తెలిపారు. మొత్తం 9 లక్షల 5 వేల మంది చిరు వ్యాపారులకు వడ్డీలేని రుణం ఇచ్చినట్లు వెల్లడించారు. గ్రామాలు, పట్టణాల్లో చిరు వ్యాపారాలు చేసుకునే వారికి లబ్ధి చేకూరుతుందన్నారు. అర్హత ఉన్నవారందరికీ సాయం చేస్తున్నామని, సకాలంలో వడ్డీ చెల్లించేవారికి తిరిగి వారి ఖాతాల్లోకే జమ చేస్తామని సీఎం జగన్ తెలిపారు. నిరుపేద చిరు వ్యాపారులు, హస్త కళాకారులు, సంప్రదాయ చేతివృత్తుల వారిలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఏటా జగనన్న తోడు పథకం కింద వడ్డీ లేకుండా (సున్నా వడ్డీ) రూ.10 వేలు చొప్పున రుణాన్ని ప్రభుత్వం అందిస్తున్న సంగతి తెలిసిందే.
కరోనా సమయంలో చిరు వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారు. చిన్న వ్యాపారులు.. వ్యాపారాలు లేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వీరిని ఆదుకోవడానికి జగనన్న తోడు పథకాన్ని తీసుకొచ్చారు సీఎం జగన్. ఈ పథకం కింద చిరు వ్యాపారులను ఆదుకున్నారు. వారికి రూ.10వేలు వడ్డీలేని రుణాలు మంజూరు చేశారు. గతేడాది కరోనా మహమ్మారి కారణంగా ఈ పథకాన్ని అమలు చేశారు. రెండో ఏడాది కూడా అమలు చేశారు.