Pawan Kalyan: వైసీపీ నేతలకు పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.. అభిమానులపై అసహనం
వైసీపీ నేతలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అంటే ఏంటో చేసి చూపిస్తామంటూ హెచ్చరించారు.

Pawan Kalyan visited Galiveedu MPDO Jawahar Babu
Pawan Kalyan visited MPDO Jawahar : వైసీపీ నేతలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అంటే ఏంటో చేసి చూపిస్తామంటూ హెచ్చరించారు. అన్నమయ్య జిల్లా గాలివీడు ఎంపీడీవో జవహర్ బాబుపై వైసీపీ నాయకులు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఎంపీడీవోపై దాడిచేసిన 11 మంది వైసీపీ నేత సుదర్శన్ రెడ్డి అనుచరులుగా గుర్తించారు.
ఎంపీడీవోకు గాయాలు కావడంతో ఆయన్ను కడపలోని రిమ్స్ కు చికిత్స నిమిత్తం తరలించారు. ఈ ఘటనపై పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, శనివారం ఆయన కడప రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జవహర్ బాబును పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
Also Read: తిరుమలలో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై కీలక వ్యాఖ్యలు చేసిన టీటీడీ ఈవో శ్యామలరావు
అధికారులపై దాడి చేస్తే వదిలిపెట్టేది లేదని పవన్ హెచ్చరించారు. వైసీపీ నేతల కళ్లు నెత్తికెక్కాయి.. కిందికి దించుతా. అధికారులపై దాడులు చేస్తే గత ప్రభుత్వంలా వదిలేది లేదని పవన్ పేర్కొన్నారు. ఇది కూటమి ప్రభుత్వం.. వైసీపీ రాజ్యం అనుకుంటున్నారా? ఖబడ్దార్. ఇష్టారాజ్యంగా చేయలేరు. మీ అహంకారం ఎలా అణచివేయాలో మాకు తెలుసు.. అధికారులపై దాడి చేస్తే తోలు తీస్తాం అంటూ పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. దాడిపై అన్నమయ్య జిల్లా కలెక్టర్ స్పందించిన తీరు హర్షణీయమని అన్నారు. విధులకు ఆటంకం కలిగిస్తే ఎవరినైనా ఉపేక్షించేది లేదని పవన్ అన్నారు.
పరారీలో ఉన్న వాళ్లను వెంటనే పట్టుకోవాలని, సుదర్శన్ రెడ్డి లాయర్ అయినా తప్పుచేస్తే ఏ చట్టం నిన్ను రక్షించలేదని పవన్ హెచ్చరించారు. ఆధిపత్య అహంకారంతో వైసీపీ నేతలు దాడులు చేస్తున్నారు. అధికారుల వెంట ప్రభుత్వం ఉంటుంది. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం తరపున ఎంపీడీవో జవహర్ బాబుకు భరోసాగా ఉంటామని పవన్ తెలిపారు. అంతకుముందు ఎంపీడీవో జవహర్ బాబును పరామర్శించిన పవన్.. ఘటన జరిగిన తీరు గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు.
అభిమానులపై పవన్ అసహనం..
పవన్ కల్యాణ్ కడప రిమ్స్ ఆస్పత్రికి చేరుకున్న సమయంలో భారీ సంఖ్యలో అభిమానులు అక్కడికి చేరుకున్నారు. ఈ సందర్భంగా కొందరు అత్యుత్సాహం ప్రదర్శించారు. పవన్ మీడియాతో మాట్లాడుతున్న సమయంలో ఓజీ.. ఓజీ.. ఓజీ అంటూ స్లోగన్లు చేశారు. దీనిపై పవన్ ఆగ్రహానికి గురయ్యారు. ఏంటయ్యా మీరు.. ఎప్పుడు ఏం స్లోగన్ ఇవ్వాలో మీకు తెలియదు. పక్కకు రండి.. అంటూ పవన్ తన అసహనాన్ని వ్యక్తం చేశారు. దీంతో అభిమానులు ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు.