లోకేశ్ రెడ్ బుక్ రాజ్యాంగం, చంద్రబాబు చంద్రన్న ఫైల్స్ నడుపుతున్నారు- మార్గాని భరత్
రెండు నెలల్లోనే పరిశ్రమలు వచ్చినట్టు జనాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలను ఎల్లవేళలా అబద్దాలతో నమ్మించ లేరు.
Margani Bharat : చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన ఈ మూడు నెలల్లో రాష్ట్రంలో అల్లర్లు, అరాచకాలు తప్ప మరేమీ జరగడం లేదన్నారు మాజీ ఎంపీ మార్గాని భరత్. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగమే నడుస్తోందని ఆయన ఆరోపించారు. మదనపల్లిలో చంద్రన్న ఫైల్స్ మొదలుపెట్టారని మండిపడ్డారు. సూపర్ సిక్స్ హామీలను పక్కన పెట్టడానికే ఈ వ్యవహారం స్టార్ట్ చేశారని ధ్వజమెత్తారు. హెలికాప్టర్ లో డీజీపీ, సీఐడీ చీఫ్ని పంపించి ఆ కేసును ఏం చేశారు? అంత హడావుడి చేసి ఏం తేల్చారు? అని మార్గాని భరత్ ప్రశ్నించారు.
”పోలవరంలో కూడా డయాఫ్రం వాల్ చంద్రబాబు వల్ల దెబ్బతిన్నదని నిపుణులు తేల్చి చెప్పారు. కాపర్ డ్యాంల నిర్మాణం పూర్తి కాకుండా డయాఫ్రం వాల్ కట్టడం వల్ల నష్టం జరిగింది. దాని గురించి చర్చ జరుగుతుండగా ధవళేశ్వరం ఫైల్స్ అని హడావుడి చేస్తున్నారు. ప్రభుత్వంలో ఎవరు ఉన్నారు? అమాయకులను సస్పెండ్ చేసి చేతులు దులుపుకుంటే సరిపోదు. వాస్తవాలను బయటకు తీయాలి. కరకట్ట ఫైల్స్ అని ఇంకో కథ నడిపారు. సూపర్ సిక్స్ పథకాల ఇష్యూ డైవర్షన్ కోసం కొత్త కథలు అల్లుతున్నారు. లోకేశ్ రెడ్ బుక్ రాజ్యాంగం, చంద్రబాబు చంద్రన్న ఫైల్స్ నడుపుతున్నారు.
ధవళేశ్వరం ఫైల్స్ అన్నీ జిరాక్స్ కాపీలు, వేస్ట్ పేపర్లు అని ఆర్డీవోనే చెప్పారు. మరి ఆ ఫైళ్ల దగ్ధానికి, వైసీపీకి ఏం సంబంధం? ప్రజలను ఎల్లవేళలా అబద్దాలతో నమ్మించ లేరు. శ్రీ సిటీలో ఆల్రెడీ ప్రారంభమైన పరిశ్రమలను చంద్రబాబు ప్రారంభిస్తున్నారు. రెండు నెలల్లోనే పరిశ్రమలు వచ్చినట్టు జనాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. జగన్ హయాంలో శంకుస్థాపన చేసి, ప్రారంభం కూడా అయిన వాటిని చంద్రబాబు మళ్ళీ ప్రారంభించటం సిగ్గుచేటు. మీలా మా ప్రభుత్వం ప్రచారాలు చేసుకోలేదు. ప్రజల నోట్లో మట్టి కొట్టే ప్రయత్నం చేయకుండా సంక్షేమ పథకాలను అమలు చేయాలి” అని చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మార్గాని భరత్.
Also Read : అందుకే ఎక్కడ చూసినా రికార్డులు తగలబెడుతున్నారు: మంత్రి అచ్చెన్నాయుడు