Nadendla Manohar : బీహార్ లో దాణా కుంభకోణం.. ఏపీలో గేదెల స్కాం : నాదెండ్ల మనోహర్
రాష్ట్రంలో 3,85,000 పాడి పశువులు కనిపించడం లేదని అధికారులు తేల్చారని, దీని వెనుక పెద్ద స్కాం ఉందన్నారు. వైఎస్సార్ చేయూత ద్వారా పాడి పశువులు కొనడానికి క్యాబినెట్ తీర్మానించిందని చెప్పారు.
Nadendla Manohar Sensational Allegations : సీఎం జగన్ పై జనసేన నేత నాదెండ్ల మనోహర్ సంచలన ఆరోపణలు చేశారు. గేదెల కొనుగోలులో 2887 కోట్ల రూపాయల మేర కుంభకోణం జరిగిందని ఆరోపించారు. సంక్షేమం పేరుతో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుందని విమర్శించారు. బీహార్ లో పశుదాణా కుంభకోణం జరిగినట్లు ఏపీలో కూడా గేదెల కొనుగోలులో స్కాం జరిగిందని ఆరోపించారు. ఈ స్కాంపై ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
వైఎస్ సమయంలో 50,000 గేదెలు కొనుగోలు చేయడానికే ఇబ్బంది పడ్డారని తెలిపారు. గురువారం గుంటూరు జిల్లా తెనాలి జనసేన పార్టీ కార్యాలయంలో నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో 3,85,000 పాడి పశువులు కనిపించడం లేదని అధికారులు తేల్చారని, దీని వెనుక పెద్ద స్కాం ఉందన్నారు. వైఎస్సార్ చేయూత ద్వారా పాడి పశువులు కొనడానికి క్యాబినెట్ తీర్మానించిందని చెప్పారు.
5400 మంది రైతుల కోసం 32 కోట్ల రూపాయలను పశువులు కొనడానికి కేటాయించినట్లు ఆ శాఖ మంత్రి అసెంబ్లీలోనే చెప్పారని గుర్తు చేశారు. 2,08,790 పశువులు కొనుగోలు చేసినట్లు పశు సంవర్థక శాఖ మంత్రి చెప్పారని పేర్కొన్నారు. 3,94,000 పశువులు కొనుగోలు చేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి అసెంబ్లీలోనే మరుసటి రోజు చెప్పారని తెలిపారు.
ఇది పాల వెల్లువో పాపాల వెల్లువో తెలియదన్నారు. అధికారులు లెక్కలు తెలిస్తే కేవలం 8000 పశువులు మాత్రమే క్షేత్ర స్థాయిలో ఉన్నాయని తెలిపారు. అంటే ఒక గేదేను చాలా పేర్లతో కొనుగోలు చేసినట్లు చూపించారని వెల్లడించారు. మహిళా సాధికారత కోసం ప్రభుత్వం అనేక చర్యలు తీసుకున్నట్లు పాలకులు చెబుతున్నారని తెలిపారు.