దువ్వాడ కుటుంబంలో చిచ్చుకు అసలు కారణం అదేనా, ఆమె వ్యూహం ఫలించిందా?

ఇండిపెండెంట్‌గా పోటీకి దిగాలని వాణి సిద్ధపడగా, కుటుంబ కలహాలు బయటపడితే... ఎన్నికల్లో ప్రభావం చూపుతుందనే ఆలోచన చేసిన ఎమ్మెల్సీ దువ్వాడ తన భార్యకు ఆస్తులను రాసిచ్చి బుజ్జగించినట్లు చెబుతున్నారు.

దువ్వాడ కుటుంబంలో చిచ్చుకు అసలు కారణం అదేనా, ఆమె వ్యూహం ఫలించిందా?

Gossip Garage : అసలు ఏం జరిగింది… ఏం జరుగుతోంది… ఏం జరగనుంది… ఎమ్మెల్సీ దువ్వాడ ఫ్యామిలీ ఎపిసోడ్‌లో రెండు రాష్ట్రాల్లోని తెలుగు వారి ఉత్కంఠ. వారం రోజులుగా రచ్చరచ్చగా మారిన ఈ ఎపిసోడ్‌కు అసలు కారణమేంటి? నాలుగు గోడల మధ్య పరిష్కరించాల్సిన ఇష్యూ… ఇల్లు పీకి పందిరేసేంతగా ఎందుకు మారింది. ఇంటిగుట్టు లంకకు చేటన్నట్లు…. ఈ కుటుంబ పంచాయితీ రాజకీయంగా నష్టం చేయదా? రాజకీయం కోసమే ఫ్యామిలీ వార్‌ మొదలైందా? ఈ వివాదానికి రాజకీయానికి మధ్య లింకేంటి? దువ్వాడ వారి రాజకీయ కుటుంబ ప్రేమ కథా చిత్రంలో అసలు లోగుట్టు ఏంటి?

ఫ్యామిలీ వార్‌కు ప్రధాన కారణం ఇదే..
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ ఫ్యామిలీ ఎపిసోడ్‌లో ఎన్నో ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. భార్య దువ్వాడ వాణితో కొన్నాళ్లుగా దూరంగా ఉంటున్న ఎమ్మెల్సీ శ్రీనివాస్‌… వైసీపీ మహిళా నేత దివ్వల మాధురికి దగ్గరవ్వడమే అసలు వివాదమని అంతా భావిస్తున్నా…. ఈ ఎపిసోడ్‌లో రాజకీయ కోణమూ ఉందనే టాక్‌ వినిపిస్తోంది. అలా అని దువ్వాడ ఆరోపిస్తున్నట్లు ఆయన రాజకీయ ప్రత్యర్థులు పన్నాగాలేవీ దీనికి కారణం కాదని…. దువ్వాడ…. ఆయన సతీమణి వాణి, స్నేహితురాలు మాధురి రాజకీయ భవిష్యత్‌ కోసం ఎవరికి వారు పావులు కదపడమే ఫ్యామిలీ వార్‌కు ప్రధాన కారణమంటున్నారు.

శ్రీకాకుళం జిల్లాలో ప్రముఖ రాజకీయ కుటుంబాల్లో దువ్వాడ కుటుంబం ఒకటి..
శ్రీకాకుళం జిల్లాలో ప్రముఖ రాజకీయ కుటుంబాల్లో దువ్వాడ కుటుంబం ఒకటి. వాస్తవానికి దువ్వాడ శ్రీనివాస్‌ తండ్రివైపు నుంచి ఎవరికీ రాజకీయ నేపథ్యం లేదంటున్నారు. ఆయన తండ్రి సాధారణ రైల్వే ఉద్యోగి. ఇదే సమయంలో ఆయన అత్తింటి వారు తొలి నుంచి రాజకీయాల్లో కొనసాగుతున్నారు. ఇక వాణిని వివాహం చేసుకున్నాకే దువ్వాడ రాజకీయాల్లోకి వచ్చారు. జిల్లాలో కీలక నేత అయిన దివంగత కింజరాపు ఎర్రన్నాయుడి కుటుంబానికి తొలి నుంచి ప్రత్యర్థిగా దువ్వాడ మామ సంపతిరావు రాఘవరావు రాజకీయాలు చేస్తూ వచ్చారు.

టెక్కలి నుంచి వేరొకరి చాన్స్‌ ఇవ్వాలని వైసీపీ ప్రతిపాదన..
ఎర్రన్నాయుడు ఎమ్మెల్యేగా పోటీ చేసిన తొలి ఎన్నిక తప్పితే ఆ తర్వాత జరిగిన మూడు ఎన్నికల్లోనూ దువ్వాడ మామ సంపతిరావు రాఘవరావే ఆయనకు ప్రత్యర్థి. ఇక దువ్వాడ వాణి సైతం 2004లో జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఇలా దువ్వాడ కుటుంబం నుంచి ఆయన మామ, భార్య, తప్పితే దువ్వాడ శ్రీనివాసే కింజరాపు కుటుంబానికి రాజకీయ ప్రత్యర్థులుగా పోరాడారు. ఐతే గత ఎన్నికల ముందు టెక్కలి రేసులో దువ్వాడ కుటుంబం నుంచి కాకుండా మరొకరిని పోటీకి దింపాలని వైసీపీ అధిష్టానం భావించిందట… ఇక్కడే అసలు రాజకీయం మొదలై… కుటుంబంలో చిచ్చుకు కారణమైందని చెబుతున్నారు.

మాధురిని తెరపైకి తేవాలని ప్రతిపాదించిన దువ్వాడ శ్రీనివాస్‌?
2019లో శ్రీకాకుళం ఎంపీగా పోటీ చేసి ఓడిన దువ్వాడ శ్రీనివాస్‌కు ఎమ్మెల్సీగా అవకాశమిచ్చారు ఆ పార్టీ అధినేత జగన్‌. ఇక 2019లో టెక్కలి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన పేరాడ తిలక్‌ను గత ఎన్నికలకు ఎంపీగా పోటీకి నిలిపారు. దీంతో టెక్కలి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎవరిని నిలపాలని వైసీపీలో చర్చ జరిగిందని చెబుతున్నారు. ఆ సమయంలో దువ్వాడ ఇన్‌చార్జిగా ఉండటం వల్ల… ఆయన భార్య వాణి పోటీ చేయాలని భావించారట. ఐతే దువ్వాడ మాత్రం అప్పటికే తనకు సన్నిహితంగా ఉంటున్న మాధురిని తెరపైకి తేవాలని ప్రతిపాదించారని అంటున్నారు. దీంతో అప్పటివరకు మాధురి పట్ల కాస్త మెతక వైఖరితో వ్యవహరించిన దువ్వాడ వాణికి అనుమానం మొదలైనట్లు చెబుతున్నారు. తన తండ్రి రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్న వాణి… భర్త సహకారంతో తన పిల్లలకు ఆ వారసత్వాన్ని అప్పగించాలని భావిస్తే… హఠాత్తుగా వేరే మహిళ తమ కుటుంబంలో చొరబడి ఏకంగా రాజకీయంగా కీలకమవ్వడాన్ని వాణి తట్టుకోలేకపోయారంటున్నారు.

అప్పటి నుంచే మాధురిపై దువ్వాడ వాణికి అనుమానం!
దీంతో పార్టీ ప్రతిపాదనకు తన భర్త ఆలోచన తోడైతే… తమ కుటుంబ రాజకీయమే ప్రమాదంలో పడుతుందనే ఆందోళనతో వాణి అప్పటి సీఎం జగన్‌ను కలిసి తానే ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని, అవకాశం ఇవ్వాలని ప్రతిపాదించినట్లు చెబుతున్నారు. ఇదే సమయంలో దువ్వాడ బదులుగా వేరొకరికి ఎమ్మెల్యే టికెట్‌ ఇవ్వాలని ఆలోచనలో ఉన్న జగన్‌… అప్పటికప్పుడు వాణిని ఇన్‌చార్జిగా నియమిస్తున్నట్లు ప్రకటించారంటున్నారు.

టెక్కలి కేంద్రంగా దువ్వాడ, మాధురి రాజకీయాలను భరించలేకపోయిన వాణి..
అధినేత ఆశీస్సులతో ఇన్‌చార్జి బాధ్యతలు స్వీకరించిన వాణి… ఎమ్మెల్యేగా పోటీకి సిద్ధమవగా, ఎన్నికల సమయంలో దువ్వాడ వ్యూహాత్మకంగా పావులు కదిపి టికెట్‌ సాధించుకున్నారంటున్నారు. దీంతో ఇండిపెండెంట్‌గా పోటీకి దిగాలని వాణి సిద్ధపడగా, కుటుంబ కలహాలు బయటపడితే… ఎన్నికల్లో ప్రభావం చూపుతుందనే ఆలోచన చేసిన ఎమ్మెల్సీ దువ్వాడ తన భార్యకు ఆస్తులను రాసిచ్చి బుజ్జగించినట్లు చెబుతున్నారు. భర్త పేరిట ఉన్న ఆస్తులు, కంపెనీలు తన చేతికి రావడంతో ఎన్నికల సమయంలో శాంతించిన వాణి…. ఎన్నికల ప్రచారంలో మాధురి యాక్టివ్‌ అవ్వడమే కాకుండా… తానే సర్వం అన్నట్లు ఎలక్షనీరింగ్‌ చేయడంతో వాణి రగిలిపోయినట్లు చెబుతున్నారు. ఇక ఎన్నికల తర్వాత కూడా టెక్కలి కేంద్రంగా దువ్వాడ, ఆయన స్నేహితురాలు రాజకీయాలు చేయాలని భావించడాన్ని భరించలేకపోయిన వాణి… కుమార్తెలతో కలిసి వివాదానికి దిగినట్లు చెబుతున్నారు.

దువ్వాడ వాణి రచ్చ వెనుక రాజకీయ వ్యూహం..!
ఎన్నికల ముందు ఆస్తులు రాసిచ్చినా…. రాజకీయంగా పిల్లలకు నష్టం జరగకూడదనే ఉద్దేశంతోనే దువ్వాడ ప్రస్తుతం నివాసం ఉన్న ఇంట్లోకి వెళ్లాలని వాణితోపాటు కుమార్తెలు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. తాము ఆ ఇంట్లో ఉంటే మాధురి అక్కడికి రాదని… ఆ విధంగా తమ కుటుంబ రాజకీయ మనుగడకు ముప్పు లేకుండా కాపాడుకోవాలని వాణి నిర్ణయించినట్లు సమాచారం. ఇదే సమయంలో తాను భర్తను నేరుగా ఢీకొట్టి… ఇన్నాళ్లు తెరచాటుగా కొనసాగిన వ్యవహారాన్ని బయటకు లాగడం ద్వారా దువ్వాడ, ఆయన స్నేహితురాలిని రాజకీయంగా తొక్కేయడమూ వాణి ఆలోచనేనంటున్నారు. అంతిమంగా దువ్వాడ తమ దారికి వస్తే సరేసరి లేదంటే ఆయనను దోషిగా నిలిపి…. రాజకీయంగా దెబ్బతీయడమే వాణి వ్యూహమంటున్నారు. ఇందుకోసం కుటుంబంలో అందరి సహకారం తీసుకున్నట్లు చెబుతున్నారు. మొత్తానికి జడ్పీటీసీ వాణి రాజకీయ వ్యూహంతోనే మొత్తం ఎపిసోడ్‌ను నడిపిందని అంటున్నారు.

Also Read : చంద్రబాబు సంచలన నిర్ణయం..! బొత్సను ఢీకొట్టే సామర్థ్యం ఆయనకు ఉందా, ఎమ్మెల్సీగా గెలవగలరా?