రాజకీయాల్లో ఇదో కొత్త కోణం.. వరద విరాళాల వెనుక పక్కా వ్యూహం?

పుణ్యం, పురుషార్థం రెండూ దక్కుతుండటంతో చాలా మంది వ్యాపార, పారిశ్రామిక దిగ్గజాలు, మాజీ ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు ఇచ్చేందుకు పోటీ పడుతున్నారు.

రాజకీయాల్లో ఇదో కొత్త కోణం.. వరద విరాళాల వెనుక పక్కా వ్యూహం?

Gossip Garage : రాజకీయాల్లో ఇదో కొత్త కోణం… వితరణ మాటున వింతైన రాజకీయం.. ఒక చెక్కు ఇవ్వడం.. తమ లక్ష్యాన్ని చేరుకోడానికి చక్కనైన మార్గం వేసుకోవడమే తాజా రాజకీయం. ఏపీలో ముఖ్యమంత్రి సహాయనిధికి వెల్లువలా వస్తున్న విరాళాల వెనుక పక్కా పథకం దాగుందనే టాక్ వినిపిస్తోంది. ప్రభుత్వాధినేతను ప్రసన్నం చేసుకోడానికి మాజీ నేతలు, పారిశ్రామిక వేత్తలు విరాళాలను సరికొత్త రూట్‌గా ఎంచుకుంటున్నారట?

పుణ్యం, పురుషార్థం రెండూ దక్కుతుండటంతో విరాళాలు ఇచ్చేందుకు పోటీ..
సీఎం చంద్రబాబును కలవాలి… తమ కోసం చెప్పుకోవాలంటే ఎవరికైనా కుదురుతుందా? సాధారణ పరిస్థితుల్లో సీఎంను కలవాలంటే చాలా తతంగమే ఉంటుంది. అదే వరద బాధితులకు విరాళిస్తామంటే ముఖ్యమంత్రి అపాయింట్ మెంట్ ఇట్టే లభిస్తుంది. పుణ్యం, పురుషార్థం రెండూ దక్కుతుండటంతో చాలా మంది వ్యాపార, పారిశ్రామిక దిగ్గజాలు, మాజీ ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు ఇచ్చేందుకు పోటీ పడుతున్నారు. విజయవాడ వరద బాధితులను ఆదుకోవాలని సీఎం చంద్రబాబు పిలుపునకు చాలా మంది స్పందిస్తున్నారు. ఇందులో కొద్ది మంది ముఖ్యమంత్రిని కలవడంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.

చంద్రబాబును చెక్కుల ద్వారా కలవడం ఇలా వ్యూహం..!
ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలిచ్చేందుకంటూ మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు, వైసీపీ ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ వంటివారు సీఎం చంద్రబాబును ప్రత్యేకంగా కలిశారు. అదేవి ధంగా కొందరు పారిశ్రామిక దిగ్గజాలు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి విరాళాల చెక్కులిచ్చారు. గత ప్రభుత్వంతో సన్నిహితంగా మెలిగిన వారు కూడా ఇప్పుడు చంద్రబాబు అనుగ్రహం కోసం ప్రయత్నిస్తున్నారు.

ఇలాంటి వారు విరాళాలివ్వడాన్ని అనుకూలంగా మార్చుకుంటున్నట్లు చెబుతున్నారు. సాధారణంగా ముఖ్యమంత్రిని కలవాలంటే చాలా ప్రొసీజర్ పాటించాల్సి వుంది. కానీ, వరద బాధితులకు విరాళాలిస్తామంటే వెంటనే సీఎం అపాయింట్ మెంట్ లభిస్తుండటంతో చెక్కులు పట్టుకుని ప్రత్యేకంగా వాలిపోతున్నారట వ్యాపార, పారిశ్రామికవేత్తలు. ఇక ఇదే సమయంలో కొందరు మాజీ నేతలు సైతం టీడీపీలో చేరేందుకు ఉత్సాహం చూపిస్తూ… చంద్రబాబును కలుస్తున్నట్లు చెబుతున్నారు. వైసీపీకి చెందిన మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ కూడా సీఎం చంద్రబాబును చెక్కుల ద్వారా కలవడం ఇలా వ్యూహమేనంటున్నారు.

చంద్రబాబు అనుగ్రహం కోసం శిద్దా ప్రయత్నాలు..
మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు ప్రస్తుతం వైసీపీలో ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచి ఆయన టీడీపీలోకి వస్తారనే ప్రచారం ఉంది. ఎన్నికల ఫలితాల తర్వాత టీడీపీలో పునరాగమనానికి ఆయన చాలా ప్రయత్నాలు చేస్తున్నారంటున్నారు. అయితే ఆయన రాకను ప్రకాశం జిల్లా టీడీపీ నేతలు అడ్డుకుంటున్నట్లు చెబుతున్నారు. తన వ్యాపార అవసరాల కోసం వైసీపీలోకి వెళ్లిన శిద్ధా… గత ప్రభుత్వంలో తమ వ్యాపారాలు దెబ్బతీసేలా పావులు కదిపారని అధినేత చంద్రబాబుకు ఫిర్యాదు చేశారట ప్రకాశం నేతలు. దీంతో కలుస్తానని శిద్ధా అపాయింట్ మెంట్ అడిగినా చంద్రబాబు అంగీకరించలేదని చెబుతున్నారు. అయితే ఎలాగైనా చంద్రబాబు అనుగ్రహం సంపాదించాలని భావించిన శిద్ధా.. పట్టు వదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తూనే ఉన్నట్లు చెబుతున్నారు.

టీడీపీలో చేరేందుకు పద్మశ్రీ ప్లాన్..
ఇందులో భాగంగానే వరద బాధితులకు విరాళాలివ్వడానికని పేరు పెట్టి సీఎం చంద్రబాబును కలిసినట్లు చెబుతున్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు.. మాజీ మంత్రి శిద్ధాను కుశల ప్రశ్నలు వేయడంతో తనపై అధినేతకు కోపం లేదని ఊపిరి పీల్చుకున్నట్లు చెబుతున్నారు. జిల్లా నేతలు వద్దన్నా.. గట్టిగా ప్రయత్నించి పసుపు కండువా కప్పుకోవాలని ప్లాన్ చేస్తున్నట్లు చెబుతున్నారు. ఇదే విధంగా ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ కూడా టీడీపీలో చేరాలనే ప్లాన్ తో కొద్ది రోజుల క్రితం తన పదవికి వైసీపీకి రాజీనామా చేశారు. అయితే సీఎం చంద్రబాబును కలిసే అవకాశం ఇంతవరకు రాకపోవడంతో వెయిటింగ్ లోనే ఉన్నారట కర్రి పద్మశ్రీ. ఆమె కూడా ఇప్పుడు వరద బాధితులకు విరాళం ప్రకటించి… సీఎంను కలిశారంటున్నారు.

Also Read : బాలినేని నిజంగానే వైసీపీతో కటీఫ్‌కి సిద్ధమయ్యారా? అసలేం జరిగింది..

ఇలా గత ప్రభుత్వంలో చక్రం తిప్పిన నేతలు… పారిశ్రామిక, వ్యాపార దిగ్గజాలు సీఎం చంద్రబాబు అనుగ్రహం కోసం చెక్కుల ద్వారా చక్కని ప్లాన్ వేసుకుంటున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. చెక్కులు ఇవ్వడం ద్వారా తమ ఉదారత చాటుకోవడమే కాకుండా చంద్రబాబు దృష్టిలో పడి తమపై వ్యతిరేకత పెరగకుండా చూసుకోవాలని చాలా మంది ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు. కొంతకాలంగా టీడీపీ నేతల ఆగ్రహాన్ని చవిచూస్తున్న మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు వంటి బిజినెస్ మ్యాన్ కమ్ పొలిటీషియన్స్ మాత్రం పక్కా వ్యూహంతో చంద్రబాబును కలిసినట్టు చెబుతున్నారు. మొత్తానికి వరద బాధితులకు విరాళాలివ్వడమనే టాస్క్ టీడీపీలోకి వెళ్లాలని.. ఆ పార్టీతో సత్సంబంధాలు కోరుకుంటున్న వారికి చక్కని అవకాశంగా మారిందని అంటున్నారు.