Nagababu Contest: ఆ సీటుపై మెగా బ్రదర్ ఫోకస్..! వచ్చే ఎన్నికల్లో నాగబాబు పోటీ అక్కడి నుంచేనా?
ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నా..ఎంపీగా లేదా ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయాలన్న ఆయన కోరిక తీరలేదు. దీంతో వచ్చే ఎన్నికల కోసం ఇప్పటినుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారట నాగబాబు.

Nagababu Contest: తమ్ముడికి చేదోడు వాదోడుగా ఉన్నారు. పార్టీ పెట్టినప్పటి నుంచి ఆయన వెంట నడిచారు. ప్రత్యక్ష ఎన్నికల్లో నిలవాలని అనుకున్నా లాస్ట్ మినిట్లో త్యాగం చేయాల్సి వచ్చింది. అప్పుడు లోక్సభ సీటు మిస్ అయితే..ఆ తర్వాత రాజ్యసభకు వెళ్లే అవకాశం కూడా దక్కలేదు. చివరికి మండలిలో అడుగుపెట్టారు మెగా బ్రదర్. ప్రజాక్షేత్రంలో గెలిచి చట్టసభల్లో అడుగు పెట్టాలనుకుంటున్న ఆయన..ఇప్పటి నుంచే ఏదో ఓ సెగ్మెంట్లో పనిచేసుకుంటూ పోవాలని అనుకుంటున్నారట. ఈ నేపథ్యంలో ఆయన ఉత్తరాంధ్ర పర్యటన ఆసక్తి రేపుతోంది. వచ్చే ఎన్నికల్లో నాగబాబు పోటీ అక్కడి నుంచేనా?
పొత్తుల్లో భాగంగా లాస్ట్ మినిట్లో చేజారిన టికెట్..
రాజకీయాల్లోకి రావడం వేరు. ఏదో ఒక నియోజకవర్గాన్ని ఎంచుకుని అక్కడి నుంచి టికెట్ సంపాదించి ఎన్నికల బరిలో నిలవడం వేరు. చాలామంది నేతలు తమకంటూ ఓ నియోజకవర్గం లేక..తమ సొంత సెగ్మెంట్లో ఈక్వేషన్స్ కుదరక ఎన్నికల్లో పోటీ చేయలేరు. అలా అని పాలిటిక్స్కు దూరంగా ఉండలేని పరిస్థితి. మెగా బ్రదర్, జనసేన ఎమ్మెల్సీ నాగబాబు సిచ్యువేషన్ కూడా ఇదేనట. గత ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీగా కంటెస్ట్ చేయాలనుకున్నారు నాగబాబు. అందుకోసం అంతా రెడీ అయ్యాక..పొత్తుల్లో భాగంగా లాస్ట్ మినిట్లో టికెట్ చేజారిపోయింది.
ఆ తర్వాత నాగబాబు రాజ్యసభకు వెళ్తారన్న టాక్ కూడా వినిపించింది. కానీ నోటిఫికేషన్ విడుదలయ్యే సమయానికి లెక్కలు మారాయి. అంచనాలు తప్పాయి. ఆ తర్వాత ఆయనను మండలికి పంపారు. క్యాబినెట్లోకి తీసుకుంటామని సీఎం చంద్రబాబే స్వయంగా ప్రకటించినా ఇప్పటివరకు ఆ హామీ నెరవేరలేదు.
ఇవన్నీ ఎలా ఉన్నా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలనేది నాగబాబు ఆలోచనగా చెబుతున్నారు. పవన్ కల్యాణ్ కూడా తన సోదరుడు ప్రజాక్షేత్రంలో గెలిచి వస్తేనే..ఫ్యామిలీ పాలిటిక్స్ అని విమర్శలు ఫేస్ చేయాల్సిన పరిస్థితి ఉండదని భావిస్తున్నారట. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఏదో ఒక అసెంబ్లీ సీటు నుంచి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసి గెలిచి..అసెంబ్లీలోకి అడుగుపెట్టడమే కాదు..క్యాబినెట్ మినిస్టర్ కావాలని కూడా నాగబాబు ఆశ పడుతున్నారట.
జనసేనలో మెగా కాంపౌండ్ నుంచి నాగబాబు ఒక్కరే యాక్టీవ్గా ఉన్నారు. జనసేన ఆవిర్భావం నుంచి సోదరుడు పవన్కు అండదండగా నిలుస్తూ వస్తున్నారు. 2019 ఎన్నికల్లో పోటీ చేశారు. తొలిసారిగా నరసాపురం పార్లమెంట్ స్థానం నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేసి..వైసీపీ అభ్యర్థి రఘురామకృష్ణరాజు చేతిలో ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో ఓటమి తర్వాత కొద్దికాలం పొలిటికల్గా సైలెంట్ అయ్యారు. 2024 ఎన్నికలకు ముందు యాక్టివ్గా పనిచేసి..కూటమి బంపర్ విక్టరీలో..జనసేన విజయంలో తనవంతు పాత్ర పోషించారు నాగబాబు. అయితే ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నా..ఎంపీగా లేదా ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయాలన్న ఆయన కోరిక తీరలేదు. దీంతో వచ్చే ఎన్నికల కోసం ఇప్పటినుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారట నాగబాబు.
ఆసక్తికరంగా నాగబాబు ఉత్తరాంధ్ర టూర్..
ఈ నేపథ్యంలో మెగా బ్రదర్ నాగబాబు ఉత్తరాంధ్ర పర్యటన ఆసక్తికరంగా మారింది. ఆల్ ఆఫ్ సడెన్గా నాగబాబు శ్రీకాకుళం జిల్లాకు రావడం..స్థానికంగా ఉన్న జనసేన నేతలతో కలసి రెండే రెండు నియోజకవర్గాల్లో పర్యటించడం చర్చకు దారితీస్తుంది. శ్రీకాకుళం, ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజకవర్గాల్లో నాగబాబు టూర్ కొనసాగింది. ఈ రెండు చోట్ల కూటమి ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే నాగబాబు పర్యటనలో కూటమి ఎమ్మెల్యేలు కనిపించలేదు. ఫ్యూచర్ ప్లాన్స్లో భాగంగానే నాగబాబు శ్రీకాకుళంలో పర్యటించారన్న టాక్ బయలుదేరింది.
ఇక్కడ పెద్ద సంఖ్యలో కాపులు ఉండటం కారణం..!
ఎచ్చెర్ల సీటు మీద నాగబాబు ఫుల్ ఫోకస్ పెట్టారని అంటున్నారు. ఇక్కడ పెద్ద సంఖ్యలో కాపులు ఉండటం కారణమంటున్నారు. ఎచ్చెర్ల టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి కళా వెంకట్రావు ఇలాకా. మొన్నటి ఎన్నికల్లో ఇక్కడ నుంచి పోటీ చేయాలని కళా అనుకుంటే టీడీపీ అధిష్టానం ఆయనను చీపురుపల్లికి పంపించింది. అయితే 2029లో తన కుమారుడు రామ్ మల్లిక్ నాయుడుకు ఎచ్చెర్ల సీటు కోరే ఆలోచనలో కళా వెంకట్రావు ఉన్నట్లు తెలుస్తోంది.
విజయనగరం ఎంపీగా ఉన్న కలిశెట్టి అప్పలనాయుడు కూడా ఎచ్చెర్లకు చెందిన వారే. ఆయన కూడా 2029లో ఇక్కడ నుంచి పోటీకి ప్లాన్స్ చేసుకుంటున్నారు. ఇప్పుడు నాగబాబు పర్యటనతో ఎచ్చెర్ల పాలిటిక్స్పై ఇంట్రెస్టింగ్ డిస్కషన్ నడుస్తోంది. అయితే ఉత్తరాంధ్ర జిల్లాల్లో పట్టు కోసం నాగబాబుని వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేయించే ఆలోచనలో జనసేన అధినేత పవన్ ఉన్నారని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో నాగబాబు ఎక్కడి నుంచి పోటీ చేస్తారో.. అప్పటి పరిస్థితులను బట్టి ఈక్వేషన్స్ ఎలా ఉంటాయో చూడాలి.