ప్రధానికి సీఎం జగన్ కీలకసూచన: రెడ్జోన్లకే లాక్డౌన్ పరిమితం చెయ్యాలి

రెడ్ జోన్ లకు లాక్ డౌన్ పరిమితం చేయ్యాలని..ఇది తన అభిప్రాయమని సీఎం జగన్ వెల్లడించారు. పరిశ్రమలు నడవనప్పుడు వారు జీతాలు చెల్లించగలరని మనం ఎలా ఆశించగలమని ప్రశ్నించారు. లాక్ డౌన్ కారణంగా వలస కార్మికులు, దినసరి కూలీలు, వ్యవసాయం, ఉద్యానవన, ఆక్వా రైతులు పూర్తిగా దెబ్బతిన్నారని చెప్పారు.
జనం గుమిగూడకుండా మాల్స్, సినిమాహాళ్లు, ప్రార్థనా మందిరాలు, ప్రజారవాణా, పాఠశాలలపై ఇప్పుడున్న పరిస్థితే
కొనసాగాలి, ఇవి కాకుండా మిగిలిన చోట్ల భౌతిక దూరం పాటించాలన్నది నా అభిప్రాయమన్నారు సీఎం జగన్.
2020, ఏప్రిల్ 11వ తేదీ శనివారం ఉదయం దేశంలోని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాన మంత్రి మోడీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ తన అభిప్రాయాలను వెల్లడించారు. ప్రధాన మంత్రి నిర్ణయంతో ముందుకు సాగుతామన్నారు.
తమ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా లాక్డౌన్ను అమలు చేస్తున్నామన్నారు. అదే సమయంలో మానవతా కోణంలో స్పందిస్తున్నామని, 1.4 కోట్లకు పైగా ఉన్న కుటుంబాలను, వారి ఆరోగ్యాన్ని క్రమం తప్పకుండా పరిశీలిస్తున్నామని చెప్పారు. కరోనా లక్షణాలు ఉన్నవారిని గుర్తించి వారికి పరీక్షలు చేసి, వైద్యం అందిస్తున్నామన్నారు. ఏపీలో 2, 61, 216 గ్రామ, వార్డు వాలంటీర్లు, 40వేల మంది ఆశా వర్కర్లు, 20, 200 మంది ఏఎన్ఎంలు ప్రతి ఒక్కరి ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని వివరించారు.
కోవిడ్ లక్షణాలు ఉన్నవారిని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి, వారికి దాదాపు 3 వేల మంది వైద్యులు సేవలు అందించడం జరుగుతోందన్నారు. అలాగే కరోనా పాజిటివ్ కేసులు ఉన్న ప్రాంతాల్లో కంటైన్మెంట్ వ్యూహం కొనసాగుతోందని చెప్పారు. లాక్డౌన్ను పటిష్టంగా అమలు చేయడానికి, ఆ ప్రాంతంలోని ప్రతి ఇంటిని పర్యవేక్షించడానికి, ఉద్ధృతంగా పరీక్షలు నిర్వహించడానికి, 141 కంటైన్మెంట్ క్లస్టర్లను హాట్స్పాట్లుగా గుర్తించామన్నారాయన.
ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలను గణనీయంగా పెంచుతున్నట్లు, క్రిటికల్ కేర్ కోసం నాలుగు అత్యాధునిక ఆస్పత్రులను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 13 జిల్లాల్లో ప్రతి జిల్లాకూ ఒక కోవిడ్ ఆస్పత్రి ఏర్పాటు, జిల్లాల్లో వీటికి అదనంగా మరో 78 ఆస్పత్రులను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు సీఎం జగన్.
ఇక రాష్ట్రంలోని పారిశ్రామిక రంగం విషయానికొస్తే.. . ‘1, 03, 986 యూనిట్లకు గానూ 7,250 మాత్రమే నడుస్తున్నాయన్నారు సీఎం జగన్. పంపిణీ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. రోడ్డు, రైల్వే రవాణాలు నిలిచిపోవడం కూడా సంక్షోభం పెరగడానికి కారణమయ్యింది. ఆర్థిక వ్యవస్థ చక్రం పూర్తి వేగంతో ముందుకు కదలకపోయినా, కనీసం ప్రజల అవసరాలకు తగినట్టుగా నైనా నడవాలన్నది నా అభిప్రాయం. 1918లో వచ్చిన ఫ్లూ కూడా భారతదేశ ప్రజలను తీవ్రంగా ప్రభావితం చేసింది. రెండేళ్లకు పైగా అది దేశంపై ప్రభావం చూపింది. మనం దీన్ని పరిగణలోకి తీసుకుంటే… దీర్ఘకాలంలో మనం పోరాటం చేయాల్సి ఉంటుంది.
676 మండలాలు రాష్ట్రంలో ఉన్నాయి. కరోనా వైరస్ సోకిన మండలాల్లో 37 రెడ్జోన్లో ఉన్నాయి. ఆరెంజ్ జోన్లో 44 మండలాలు ఉన్నాయి. 676 మండలాల్లో 81 మండలాలు రెడ్జోన్, ఆరెంజ్ జోన్లో ఉన్నాయి. 595 మండలాలు గ్రీన్జోన్లో ఉన్నాయి. ప్రస్తుతానికి కరోనా ప్రభావం వీటిపై లేదు. కరోనా వైరస్ మరింత వ్యాపించకుండా దేవుడి దయవల్ల అడ్డుకోగలుగుతున్నాం.
మన కంటికి కనిపించని ఈ మహమ్మారి త్వరలోనే నయం అవుతుందని నమ్ముతున్నాం. ఈ యుద్ధాన్ని ఎదుర్కోవడంలో ఒక్కటిగా ఉండాలి. ఒకే రకమైన వ్యూహంతో ముందుకు సాగాలి. మీ నాయకత్వంపై సంపూర్ణ విశ్వాసం ఉంది. ప్రధానిగా మీరు సూచించే వ్యూహంతో ముందుకుసాగుతామన్నారు’ సీఎం జగన్.