Old Woman Dies : పెన్షన్ కోసం వెళ్లి వృద్ధురాలు మృతి.. గంగూరులో ఉద్రిక్తత
పెన్షన్ కోసం వెళ్లి వృద్ధురాలు మృతి చెందడం పెనమలూరు నియోజకవర్గంలో ఉద్రిక్తతకు దారితీసింది.
Old Woman Dies : కృష్ణా జిల్లా పెనమలూరు మండలం గంగూరులో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పెన్షన్ కోసం వెళ్లి వృద్ధురాలు మృతి చెందింది. వెంపటి వజ్రమ్మ (80) అనే వృద్ధురాలు పెన్షన్ తీసుకోవడానికి వెళ్లింది. ఎండతీవ్రత ఎక్కువడగా ఉండటంతో వడదెబ్బకు గురై కుప్పకూలింది. ఆ వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు.
పెన్షన్ కోసం వెళ్లి వృద్ధురాలు మృతి చెందడం పెనమలూరు నియోజకవర్గంలో ఉద్రిక్తతకు దారితీసింది. ఫించన్ కోసం వేచి ఉండి ఎండ దెబ్బ తాళలేక వృద్ధురాలు మృతి చెందింది అనే విషయం అటు అధికార, ఇటు ప్రతిపక్ష నేతలకు తెలిసింది. మృతురాలి కుటుంబాన్ని పరామర్శించడానికి వారు బయలుదేరారు. ఒకే సమయానికి ఇరు పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థులు బోడె ప్రసాద్, జోగి రమేశ్ అక్కడికి చేరుకున్నారు. ఫించన్ ఆలస్యం అవడానికి చంద్రబాబే కారణం, చంద్రబాబు ఒకరిని పొట్టన పెట్టుకున్నారు, చంద్రబాబు డౌన్ డౌన్ అని వైసీపీ నాయకులు, కార్యకర్తలు అనడంతో ఇరువర్గాల మధ్య ఉద్రిక్తత చోటు చేసుకుంది. శవ రాజకీయాలు మానుకోవాలని టీడీపీ శ్రేణులు ఎదురుదాడికి దిగాయి.
Also Read : మండుటెండలో పడిగాపులు.. పెన్షన్ కోసం వృద్ధుల తీవ్ర ఇబ్బందులు, మాకెందుకీ కష్టాలు అని ఆవేదన