Pawan Kalyan: పవన్ కల్యాణ్ కుమారుడిని కాపాడిన కార్మికులను సత్కరించిన ప్రభుత్వం
ప్రమాదంలో చిక్కుకున్న పవన్ కల్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ తోపాటు మరికొందరు చిన్నారులను కాపాడిన నలుగురిని ప్రభుత్వం సన్మానించింది.

Pawan Kalyan
Pawan Kalyan: సింగపూర్ లో ఏప్రిల్ 8న జరిగిన అగ్నిప్రమాదంలో జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ గాయపడిన విషయం తెలిసిందే. ఆస్పత్రిలో చికిత్స అనంతరం శంకర్ పూర్తిగా కోలుకోవటంతో డిశ్చార్జ్ అయ్యాడు. ప్రస్తుతం ఆ చిన్నారి ఆరోగ్యం మెరుగ్గానే ఉంది. అయితే, ఈ అగ్ని ప్రమాదం సమయంలో పవన్ కల్యాణ్ కుమారుడు శంకర్ తోపాటు మరికొందరు విద్యార్థులు చిక్కుకున్నారు. వారందరినీ భారతీయ వలస కార్మికులు కాపాడారు.
సింగపూర్ సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ సమీపంలోని రివర్ వ్యాలీ రోడ్డులో గల మూడంతస్తుల భవనంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 20మంది గాయపడగా.. వారిలో 15 మంది చిన్నారులే ఉన్నారు. అందులో పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ కూడా ఉన్నాడు. అక్కడి సమీపంలోనే భారత్ నుంచి సింగపూర్ వెళ్లిన నలుగురు వలస కార్మికులు ఇందర్జిత్ సింగ్, సుబ్రమణియన్ శరన్రాజ్, నాగరాజన్ అన్బరసన్, శివసామి విజయరాజ్లు పనిచేస్తున్నారు. భవనం నుంచి పిల్లల అరుపులు వినిపించడంతో అటువైపు చూడగా మూడో అంతస్తు నుంచి పొగలు రావడం గమనించారు.
నలుగురు భారతీయ వలస కార్మికులు వెంటనే భవనం వద్దకు చేరుకొని.. అందులో చిక్కుకున్న పిల్లలను వారి ప్రాణాలు పణంగాపెట్టి బయటకు తీసుకొచ్చారు. సింగపూర్ సివిల్ డిఫఎన్స్ ఫోర్స్ ఘటన స్థలికి చేరుకోవడానికి పది నిమిషాల ముందే వలస కార్మికులు పది మంది పిల్లలను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. దీంతో సింగపూర్ ప్రభుత్వం పిల్లల ప్రాణాలు కాపాడిన నలుగురు భారతీయ వలస కార్మికులను సత్కరించింది.
ముఖంపై మసి మచ్చలతో, దగ్గుతూ, శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ సహాయంకోసం విలపిస్తున్న పిల్లలను తాను ఎప్పటికీ మర్చిపోలేనని పిల్లల ప్రాణాలను కాపాడిన కార్మికులలో ఒకరైన 34ఏళ్ల సుబ్రమణియన్ శరన్రాజ్ చెప్పారు.