Dhulipalla Narendra Kumar: ప్రజలపై విద్యుత్ భారంవేసే పాపంలో ఈఆర్సీ కూడా భాగస్వామిగా మారింది
స్మార్ట్ మీటర్లకు అన్నిరాష్ట్రాలూ వ్యతిరేకం అంటే.. ఏపీ మాత్రం స్మార్ట్ మీటర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, స్మార్ట్ మీటర్ల పేరుతో ప్రభుత్వం రైతులకు ఉరి వేస్తున్నారని ధూళిపాళ్ల నరేంద్ర ఆవేదన వ్యక్తం చేశారు.
![Dhulipalla Narendra Kumar: ప్రజలపై విద్యుత్ భారంవేసే పాపంలో ఈఆర్సీ కూడా భాగస్వామిగా మారింది Dhulipalla Narendra Kumar: ప్రజలపై విద్యుత్ భారంవేసే పాపంలో ఈఆర్సీ కూడా భాగస్వామిగా మారింది](https://10tv.in/wp-content/uploads/2023/10/TDP-Leader-Dhulipala-Narendra.jpg)
Dhulipalla Narendra Kumar
TDP Leader Dhulipalla Narendra Kumar: విద్యుత్ ఛార్జీల పెరుగుదలకు జగన్ ప్రభుత్వానికి ఈఆర్సీ సహకరిస్తోదని టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ నరేంద్ర తీవ్ర ఆరోపణలు చేశారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. ప్రజలపై విద్యుత్ భారం వేసే పాపంలో ఈఆర్సీ కూడా భాగస్వామిగా మారిందంటూ మండిపడ్డారు. జనంకోసం పనిచేయాల్సిన ఈఆర్సీ జగన్ దోపిడీకి సహకరిస్తోందని ఆరోపించారు. జగన్ అధికారంలోకి వచ్చాక రకరకాల పేర్లతో ఎనిమిది సార్లు విద్యుత్ ఛార్జీలను పెంచారని, జగన్ హయాంలో రూ.20వేల కోట్ల మేర విద్యుత్ భారం వేశారని ధూళిపాళ నరేంద్ర అన్నారు. ఈఆర్సీ గతంలో నిష్పక్షపాతంగా ఉండేదని, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ప్రభుత్వం ఏం చెబితే ఈఆర్సీ వింటూ ఆమోదం ఇచ్చేస్తోందని విమర్శించారు.
Also Read: మద్దతు ఇవ్వండి.. పవన్ కల్యాణ్ తో కిషన్ రెడ్డి, లక్ష్మణ్ భేటీ.. పవన్ ఏం చెప్పారంటే?
అసలు ఈఆర్సీ పవర్ హాలిడే ప్రకటించడం ఏమిటని టీడీపీ నేత ధూళిపాళ నరేంద్ర ప్రశ్నించారు. ఈ సీజన్లో కూడా విద్యుత్ కోతలున్నాయి. విద్యుత్ కోతల వల్ల పంటలు ఎండిపోతున్నాయి. సబ్ స్టేషన్లను రైతులు ముట్టడిస్తున్నారు. వ్యవసాయానికి తొమ్మిది గంటల విద్యుత్ సరఫరా ఎక్కడా కన్పించడం లేదు. కనీసం ఐదు గంటలైనా విద్యుత్ సరఫరా చేయాలని రైతులుకోరే పరిస్థితికి వచ్చారని అన్నారు. రైతులకు విద్యుత్ సరఫరా పేరుతో సెకీతో ఒప్పందం చేసుకుని ప్రభుత్వం దోపిడీకి తెరలేపిందని ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపించారు. ఏపీలోని విద్యుత్ ప్రాజెక్టుల కేటాయింపులు జగన్ అనుచరులకే దక్కుతున్నాయని అన్నారు.
స్మార్ట్ మీటర్లకు అన్నిరాష్ట్రాలూ వ్యతిరేకం అంటే.. ఏపీ మాత్రం స్మార్ట్ మీటర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, స్మార్ట్ మీటర్ల పేరుతో ప్రభుత్వం రైతులకు ఉరి వేస్తున్నారని ధూళిపాళ్ల ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగంలోని విద్యుత్ ప్రాజెక్టులను నిర్వీర్యం చేస్తున్నారని, ధర్మల్ పవర్ ప్రాజెక్టులను నిరర్ధక ఆస్తులుగా మారుస్తున్నారని, ప్రైవేట్ కంపెనీల నుంచి విద్యుత్ కొనుగోళ్ల ద్వారా కమిషన్ల కోసం ప్రభుత్వ విద్యుత్ సంస్థలను నిర్వీర్యం చేస్తుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ భారం వల్ల పరిశ్రమలు మూతపడుతున్నాయి. పరిశ్రమలకు ఉండే ఎలక్ట్రిసిటీ డ్యూటీని ఆరు పైసల నుంచి ఒక రూపాయికి పెంచారని విమర్శించారు. ఏపీలో ఉంటే జగన్.. ఆయన బినామీ కంపెనీలు మాత్రమే ఉండాలనేదే జగన్ విధానంగా ఉందని, ఆ కంపెనీలకే రకరకాల రాయితీలిస్తున్నారని ధూళిపాళ్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.