జగన్ వదిలిన బాణం ఆయనకే గుచ్చుకోబోతుంది: నక్కా ఆనంద్ బాబు
సీఎం జగన్ సొంత చెల్లెలే తమ మేలు కోరుతుందంటే ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోసువచ్చని టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు అన్నారు.
![జగన్ వదిలిన బాణం ఆయనకే గుచ్చుకోబోతుంది: నక్కా ఆనంద్ బాబు జగన్ వదిలిన బాణం ఆయనకే గుచ్చుకోబోతుంది: నక్కా ఆనంద్ బాబు](https://10tv.in/wp-content/uploads/2023/12/nakka-anand-babu-shrmila.jpg)
nakka anand babu on ys sharmila christmas gifts to Chandrababu Family
Nakka Anand Babu: వైఎస్ జగన్ వదిలిన బాణం చివరికి ఆయనకే గుచ్చుకో బోతుందని టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు అన్నారు. అమరావతిలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జగన్ రక్తం పంచుకు పుట్టిన చెల్లెలే తమ మేలు కోరుతుందంటే రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవాలన్నారు. వైఎస్ షర్మిలకు దగ్గర కావాల్సిన అవసరం తమ పార్టీకి లేదని.. దగ్గర చేసుకునే ప్రయత్నాలు కూడా తాము చేయబోమని స్పష్టం చేశారు.
వాళ్లంతా జగన్ బాధితులే
నమ్ముకున్న వాళ్లని వంచించడం వైఎస్ జగన్ నైజమని ఆనంద్ బాబు విమర్శించారు. కేవీపీ రామచంద్రరావు, మోపిదేవి వెంకట రమణ, సూర్యుడు ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది జగన్ బాధితులేనని ఆయన అన్నారు. జగన్ ని నమ్ముకొని మాపై కేసులు వేసిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పరిస్థితి ఏమైందో మనమంతా చూస్తున్నామని చెప్పారు. ప్రశాంత్ కిశోర్ కూడా జగన్ పై నమ్మకం లేక తమ పార్టీకి సలహాలు ఇచ్చే పరిస్థితి వచ్చిందని తెలిపారు. జగన్ అవినీతికి ఈసారి ఐపీఎస్ అధికారులు బలవబోతున్నారని జోస్యం చెప్పారు.
కాగా, క్రిస్మస్ సందర్భంగా వైఎస్ కుటుంబ తరపున చంద్రబాబు ఫ్యామిలీకి షర్మిల కానుకలు పంపడం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. షర్మిలకు ధన్యవాదాలు తెలుపుతూ టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఎక్స్ (ట్విటర్)లో పోస్ట్ పెట్టడం ఆసక్తికరంగా మారింది. మరికొన్ని నెలల్లో ఎన్నికలు జరగనున్న ఆంధ్రప్రదేశ్ లో తాజా పరిణామాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.