అంత ఆగ్రహమేల రామనారాయణా?

సింహపురిలో రాజకీయాలు వేడెక్కాయి. వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి నెల్లూరు నగరాన్ని ఉద్దేశించి చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. నెల్లూరు నగరం మాఫియాలకు అడ్డాగా మారిందని, శాండ్, క్రికెట్ బెట్టింగ్, భూకబ్జా గ్యాంగ్స్టర్స్, లిక్కర్ మాఫియా లాంటివన్నీ ఇక్కడ యథేచ్ఛగా కార్యకలాపాలు సాగిస్తున్నాయని ఆనం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి చేశారా అన్నదే అందరిలోనూ చర్చ మొదలైంది. మంత్రి అనిల్ కుమార్ యాదవ్తో పాటు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డిని ఉద్దేశించే ఆనం ఇలా మాట్లాడినట్టుగా జనాలు అనుకుంటున్నారు.
టార్గెట్ ఆనం :
గత కొంతకాలంగా మంత్రి అనిల్, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డిలతో వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డికి విభేదాలు నడుస్తున్నాయన్నది అందరికీ తెలిసిందే. అనిల్, కోటంరెడ్డి ఒక వర్గంగానూ, ఆనం రామనారాయణ రెడ్డి , కాకాని గోవర్ధన్ రెడ్డి మరో వర్గంగానూ ఉంటూ ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలను సాగిస్తున్నారు. అయితే, అనిల్కు మంత్రి పదవి రావడం ముందు నుంచి కూడా ఆనం, కాకాని జీర్ణించుకో లేకపోతున్నారట. వీళ్ళిద్దరూ కూడా మంత్రి పదవులు ఆశించిన వారే. ఇటీవల మంత్రి అనిల్, కోటంరెడ్డి కలిసి రామనారాయణ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారని అంటున్నారు.
ఆయన కనుసన్నల్లోనే :
చాలా కాలంగా వీఆర్ విద్యా సంస్థలపైన ఆనం కుటుంబమే పెత్తనం చెలాయిస్తూ వస్తోంది. ఆ విద్యాసంస్థల్లో కోట్ల రూపాయల అవినీతి జరిగినట్లు ఆరోపణలున్నాయి. ఈ విద్యా సంస్థలపై కోర్టులలో కేసులు నడుస్తున్నాయి. ఆస్తులను ఆనం కుటుంబం నుంచి దూరం చేయడంలో అనిల్, కోటంరెడ్డి కీలకపాత్ర పోషించారు. నెల్లూరులోని ప్రాచీన వేణుగోపాలస్వామి గుడికి సంబంధించిన ఆస్తులను కూడా ట్రస్ట్ బోర్డు అమ్మేందుకు సిద్ధమైంది. ఈ ట్రస్ట్ బోర్డు సభ్యులలో ఒకరు ఆనం కుటుంబ సభ్యుడు. గతంలో ఆనం వివేకానందరెడ్డి బతికున్నంత కాలం ఆలయానికి సంబంధించిన ఆస్తులు, గుడిలో కార్యక్రమాలు ఇలా అన్నీ ఆయన కనుసన్నల్లోనే జరిగేవి.
కోటిన్నర రూపాయల ఆలయ నిర్వహణ సిబ్బంది జీతభత్యాల కోసం చేసిన అప్పు కోసం ఆలయానికి సంబంధించి నగరంలో ఉన్న వందల కోట్ల విలువ చేసే 80 ఎకరాల భూములను అమ్మేందుకు ట్రస్ట్ బోర్డు సిద్ధమై౦ది. అనిల్, కోటంరెడ్డి ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో సంబంధిత మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మంత్రి అనిల్, ఎమ్మెల్యే కోటంరెడ్డి, ఎండోమెంట్ కమిషనర్.. ఆలయ అధికారులతో చర్చలు జరిపి అమ్మేందుకు వీలు లేదని స్పష్టం చేశారు. ఆలయ ఆస్తులను అమ్మటానికి కచ్చితంగా దేవాదాయ శాఖ అనుమతి కావాలని తేల్చి చెప్పారు .
అసంతృప్తితో రగిలిపోతున్న ఆనం :
టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎన్నికల ముందు వెంకటగిరి డక్కిలి మండలంలో 240 కోట్ల రూపాయలతో శంకుస్థాపన జరుపుకున్న ఆల్తూరుపాడు రిజర్వాయర్ విషయం కూడా ఆనం రామనారాయణరెడ్డికి కోపం తెప్పించిందంట. త్వరలో ఆ రిజర్వాయర్ నిర్మాణ పనులకు సంబంధించి ప్రభుత్వం రివర్స్ టెండర్లు చేపట్టబోతున్నది.
అయితే గతంలో టెండర్ దక్కించుకున్న తన మనిషికి కాకుండా ఇప్పుడు రివర్స్ టెండరింగ్కు నిర్ణయించడంతో ఆనం మండిపడుతున్నారట. అనిల్ ఇరిగేషన్ మంత్రి కావడంతో ఈ నిర్ణయంపై ఆనం అసంతృప్తితో ఉన్నారట. తన నియోజకవర్గంలో తనకు సంబంధం లేకుండా రివర్స్ టెండరింగ్ చేపట్టాలనుకోవడంపై ఆనం ఆగ్రహంగా ఉన్నారట.
సొంత సోదరుడైన ఆనం విజయ్కుమార్ రెడ్డికి డీసీసీబీ చైర్మన్ పదవి రావడాన్ని కూడా రామనారాయణ జీర్ణించుకోలేక పోతున్నారట. ఆ పదవిని తనకు అత్యంత సన్నిహితుడైన మెట్టుకూరు ధనంజయరెడ్డికి ఇప్పించాలని ఆనం విశ్వప్రయత్నాలు చేశారు.
మంత్రి అనిల్, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఇతర ఎమ్మెల్యేల మద్దతుతో డీసీసీబీ చైర్మన్ పదవి ఆనం విజయ్ కుమార్రెడ్డికి దక్కింది. రెండు రోజుల క్రితం జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి బదిలీ విషయం కూడా తనకు తెలియకపోవడం మరింత కోపాన్ని తెప్పించిదట. కనీసం ఒక మాట కూడా చెప్పకుండా అనిల్, కోటంరెడ్డిలు జిల్లా కొత్త ఎస్పీగా భాస్కర్ భూషణ్ను తీసుకు రావడంపైనా ఆనం మండిపోయారట.
ఇలా వరుస షాకులతో కంగుతిన్న ఆనం.. తన 38 ఏళ్ల రాజకీయ అనుభవం పక్కనపెట్టి సొంత పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రిపై పరోక్షంగా విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారని జనాలు అనుకుంటున్నారు. ఒకరు నియోజకవర్గంలో మరొకరు జోక్యం చేసుకోకుండా అంతా కలసికట్టుగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశిస్తున్నా… ఆనం, అనిల్, కోటంరెడ్డి లేనట్టుగా కనిపిస్తోందని అంటున్నారు. ప్రస్తుత పరిస్థితులపై జగన్ ఎలా స్పందిస్తారో చూడాలని డిస్కస్ చేసుకుంటున్నారు.