టీటీడీలో ప్రకంపనలు.. మాజీ ఛైర్మన్లు వైవీ సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డిలకు నోటీసులు

గోవిందరాజ స్వామి సత్రాలు కూల్చివేతకు ఆర్ అండ్ బీ అనుమతి తీసుకోలేదని విజిలెన్స్ అధికారుల విచారణలో తేలింది.

టీటీడీలో ప్రకంపనలు.. మాజీ ఛైర్మన్లు వైవీ సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డిలకు నోటీసులు

Updated On : August 27, 2024 / 8:07 PM IST

TTD Vigilance Notices : తిరుమల తిరుపతి దేవస్థానంలో విజిలెన్స్ నోటీసులు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. టీటీడీ మాజీ ఛైర్మన్లు వైవీ సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డిలకు స్టేట్ విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ విభాగం నోటీసులు ఇచ్చింది. వీరితో పాటు మాజీ ఈవోలు జవహర్ రెడ్డి, ధర్మారెడ్డి.. చీఫ్ అకౌంట్ ఆఫీసర్ బాలాజీలకు నోటీసులు పంపారు.

శ్రీవారి ట్రస్ట్ నిధులను ఆలయాల నిర్మాణాలకు కాకుండా ఇతర అవసరాలకు వినియోగించారనే ఆరోపణలపై నోటీసులు ఇచ్చారు అధికారులు. గోవిందరాజ స్వామి సత్రాలు కూల్చివేతకు ఆర్ అండ్ బీ అనుమతి తీసుకోలేదని విజిలెన్స్ అధికారుల విచారణలో తేలింది. అలాగే మాజీ ఈవో ధర్మారెడ్డి బర్డ్ డైరెక్టర్ గా ఉండటం అంశంపైనా విచారణ చేపట్టారు విజిలెన్స్ అధికారులు.

గత 2 నెలలుగా టీటీడీలో విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ వివిధ ప్రాంతాల్లో తనిఖీలు చేస్తోంది. అన్ని విభాగాల్లో గత ఐదేళ్లలో ఎలాంటి లావాదేవీలు జరిగాయి అన్న దానిపై విచారణ జరుపుతోంది. ప్రధానంగా ఇంజినీరింగ్ విభాగంలో అవకతవకలు జరిగినట్లుగా గుర్తించినట్లుగా సమాచారం.

Also Read : వైసీపీని వెంటాడుతున్న డర్టీ పిక్చర్ ఎపిసోడ్‌.. నేతల తీరుతో తలపట్టుకుంటున్న హైకమాండ్..!

ఇంజినీరింగ్ విభాగంలో గతంలో ఏడాదికి 300 కోట్లు మాత్రమే నిధులు కేటాయించే వారు. అయితే, వైవీ సుబ్డారెడ్డి, కరుణాకర్ రెడ్డి బోర్డుల సమయంలో అంతకుమించి నిధుల కేటాయింపులు జరిపినట్లు గుర్తించారు. గోవిందరాజ స్వామి సత్రాలకు దాదాపు రూ.450 కోట్లు కేటాయించారు. స్విమ్స్ ఆసుపత్రిలో భవనాల నిర్మాణానికి భారీ ఎత్తున నిధులు (రూ.77 కోట్లు) కేటాయించారన్న దానిపై అధికారులు విచారణ జరుపుతున్నారు. టీటీడీలో శ్రీవాణి ట్రస్ట్ నిధులు, ఇంజినీరింగ్ విభాగంలో భారీ అవినీతి జరిగిందని టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో టీటీడీలోని అన్ని విభాగాల్లో విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు తనిఖీలు, విచారణలు జరిపింది. ఈ రెండు నెలలుగా గుర్తించిన అంశాలపై భూమన, ధర్మారెడ్డిలకు నోటీసులు జారీ చేశారు విజిలెన్స్ అధికారులు.

టీటీడీలో ముఖ్య గణాంకాల అధికారి (చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్) బాలాజీకి కూడా నోటీసులు ఇచ్చారు. నోటీసులకు సమాధానం చెప్పాలని అందులో పేర్కొన్నారు. త్వరలోనే వైవీ సుబ్బారెడ్డి, భూమన, కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డి వివరణ ఇచ్చుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.