విజయనగరం బాబు టూర్ వాయిదా పడింది.. ఇందుకేనా?

తెలుగుదేశం పార్టీలో మూడు రాజధానుల విషయంలో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో విజయనగరం జిల్లాలో అడుగుపెట్టడం ఎందుకనే ఆలోచనలో ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఉన్నారట. అలానే ప్రస్తుతం అమరావతి ప్రాంతంలో రైతులు 15 రోజులుగా రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ విషయాలు కొంత కాలం పక్కనపెట్టి, అమరావతి రైతుల తరఫున పోరాటం చేయాలని చంద్రబాబు అనుకుంటున్నారట.
అందుకే విజయనగరంలో రెండు రోజుల పాటు సాగాల్సిన తన పర్యటనను వాయిదా వేసుకున్నారని చెబుతున్నారు. రాజధాని విషయంలో టీడీపీ నేతల్లోనే భిన్న స్వరాలు వినిపిస్తున్న తరుణంలో ఉత్తరాంధ్ర వచ్చేందుకు చంద్రబాబు సంకోచిస్తున్నారని కొందరు అంటున్నారు. అందుకే విజయనగరం జిల్లా పర్యటన రద్దు చేసుకున్నారని ప్రత్యర్థి పార్టీలు చెబుతున్నాయి.
గతంలోనే జిల్లాల పర్యటనల్లో భాగంగా విజయనగరానికి రావాల్సిన చంద్రబాబు… మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు అనారోగ్యం కారణంగా వాయిదా వేసేశారు. అశోక్ గజపతిరాజు శస్త్ర చికిత్స నిమిత్తం హైదరాబాద్ వెళ్లిపోవడంతో… ఆయన లేకుండా పర్యటించడం సరికాదనుకుని రాలేదు. తాజాగా జనవరి 3, 4 తేదీల్లో జిల్లాలో చంద్రబాబు పర్యటనకు షెడ్యూల్ ఫిక్స్ చేసుకున్నారు. కానీ, చివరి నిమిషంలో అది కూడా రద్దయిందని అంటున్నారు.
విశాఖ రాజధాని విషయంలో టీడీపీ నేతల్లో భిన్న స్వరాలు వినిపిస్తున్న కారణంగానే బాబు పర్యటన రద్దయిందన్న వానదలు వినిపిస్తున్నాయి. టీడీపీలో మహామహులుగా చెప్పుకునే కేంద్ర మాజీ మంత్రి అశోక్గజపతిరాజు తాను ఓడిపోవడంతో పాటు తన కుమార్తెను కూడా గెలిపించుకో లేకపోయారు. కిశోర్ చంద్రదేవ్, ఆర్పి భంజ్దేవ్ లాంటివారు మట్టికరిచారు. శత్రుచర్ల విజయరామరాజు వ్యూహాలు చతికిలపడ్డాయి. బొబ్బిలి రాజులు ఘోర పరాజయాన్ని చవిచూశారు. దీంతో ఎన్నికల తర్వాత జిల్లావైపు చంద్రబాబు కన్నెత్తి చూడలేకపోయారు. ఒక్కసారి కూడా అడుగు పెట్టలేకపోయారు. ఆ పార్టీ నేతలు కూడా జనంలోకి రాలేక సొంత వ్యవహారాలకే పరిమితమైపోయారు.
గందరగోళంలో తెలుగు తమ్ముళ్లు :
ఎన్నికల ఫలితాల తర్వాత కోలుకున్న టీడీపీ నేతలు తమ జిల్లాలో పార్టీ అధినేత చంద్రబాబు పర్యటనకు సుముఖత వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే గతంలో వాయిదా పడ్డ టూర్ను జనవరిలో ఖరారు చేశారు. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. కనీసం పార్టీ పరిస్థితి ఏంటో చూసుకోవాలి. అందుకే నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహించాలని భావించారు. కానీ, ప్రస్తుతం పరిస్థితులు తారుమారయ్యాయి. రాజధాని వికేంద్రీకరణ అంశం తెరపైకి వచ్చింది. విశాఖలో ఎగ్జిక్యూటివ్ రాజధాని ఏర్పాటు చేయాలని వైసీపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రకటనతో టీడీపీ నేతలు గందరగోళంలో పడ్డారు. దీనిపై మౌనంగా ఉండిపోయారు.
అందుకే పర్యాటన రద్దు చేశారా? :
కొందరు అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని డిమాండ్ చేస్తుంటే… మరి కొంతమంది ఉత్తరాంధ్ర కేంద్రంగా విశాఖను రాజధానిగా ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. విశాఖ జిల్లాకు చెందిన కొందరు టీడీపీ నేతలు తీర్మానం కూడా చేశారు. దీనికి విజయనగరం జిల్లాకు చెందిన కొందరు టీడీపీ నేతలు మద్దతు పలుకుతున్నారట. దీంతో జిల్లాలో టీడీపీ పరిస్థితి గందరగోళంగా మారిందంటున్నారు.
ఎవరు ఎటువైపు మాట్లాడుతున్నారో? ఎటువైపు మద్దతు ఇస్తున్నారో తెలియడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో జిల్లా పర్యటనకు వెళ్తే ఇబ్బందులు పడాల్సి వస్తుందని చంద్రబాబు భావించారట. అందుకే పర్యటన రద్దు చేసుకున్నారని అంటున్నారు. విశాఖ రాజధాని అంశాన్ని కాదంటే ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని జిల్లా నేతలు చెబుతున్నారట.
మరోపక్క, అమరావతి ప్రాంతంలో రైతుల ఆందోళనలు తీవ్రస్థాయిలో కొనసాగుతున్నాయి. ప్రస్తుతం వారికి అండగా నిలవాల్సిన బాధ్యత తమపై ఉందని చంద్రబాబు అనుకుంటున్నారట. జనసేనాని పవన్ కల్యాణ్ ఈ విషయంలో దూసుకెళ్తున్నారు. అమరావతిని రాజధానిగా ప్రకటించి, భూములు సేకరించినది టీడీపీయే కాబట్టి ఇలాంటి సమయంలో రైతులకు మద్దతుగా ఉండాల్సిందేనని భావిస్తున్నారని చెబుతున్నారు.
ఇప్పుడు విజయనగరంలో అధినేత పర్యటిస్తే ఏ విషయాన్నీ స్పష్టంగా చెప్పలేమని, అందుకే టూర్ వాయిదా వేసుకుంటే బెటర్ అని అధిష్టానానికి స్థానిక నేతలు చెప్పారట. అందుకే చంద్రబాబు టూర్ మరోసారి వాయిదా పడిందంటున్నారు.