11వేల కోట్ల స్కాంకు తెరలేపారు.. ఏడాదిలోనే 1.37లక్షల కోట్ల అప్పు.. కూటమి ప్రభుత్వంపై వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు

అమరావతి పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు దోపిడీ చేస్తున్నారని మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు.

11వేల కోట్ల స్కాంకు తెరలేపారు.. ఏడాదిలోనే 1.37లక్షల కోట్ల అప్పు.. కూటమి ప్రభుత్వంపై వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు

YS Jagan Mohan Reddy

Updated On : May 22, 2025 / 12:57 PM IST

YS Jagan Mohan Reddy : వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఏడాది పాలనలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా తయారైందని అన్నారు. కాగ్ నివేదిక ప్రకారం.. అభివృద్ధి జరగలేదు.. సంక్షేమం ఊసే లేదు.. రాష్ట్రాన్ని పూర్తిగా అప్పుల్లోకి నెట్టేసి ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తున్నారని జగన్ అన్నారు.

 

గురువారం జగన్ మీడియా సమావేశంలో మాట్లాడారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో 3.32 లక్షల కోట్లు అప్పులు చేస్తే.. చంద్రబాబు ఏడాది పాలనకే 1.37లక్షల కోట్లు అప్పులు చేశారని విమర్శించారు. ఐదేళ్లలో చెయ్యాల్సిన అప్పుల్లో 40శాతం ఏడాదిలోనే చేసేసి చంద్రబాబు అప్పుల సామ్రాట్ అయ్యారని అన్నారు. తెచ్చిన అప్పులన్నీ రాష్ట్ర ఖజానాకు రావడం లేదు.. చంద్రబాబు అండ్ కో జేబుల్లోకి వెళ్తుంది. ఏపీఎండీసీను శాశ్వతంగా అప్పుల్లోకి నెట్టేసి అంధకారం చేస్తున్నారు. ప్రభుత్వ మైన్స్ ను ప్రైవేట్ పరం చేస్తున్నారు. ఇది చాలా దారుణం అని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

సోలార్ ఎనర్జీ కొనుగోలు పేరుతో 11 వేల కోట్ల స్కామ్ కి తెర లేపారు. సెకీ తో మేము చేసుకున్న ఒప్పందం వల్ల 89 వేల కోట్లు ఆదా అయ్యేది. విశాఖలో ఉర్షా అనే ఊరు పేరు లేని సంస్థకు 3 వేల కోట్ల భూములు కట్టబెట్టారు. 2వేల కోట్లు విలువ చేసే భూమి అప్పనంగా లులూ మాల్ కి ఇచ్చేస్తున్నారు. లిక్కర్, ఇసుక, మట్టి, మైనింగ్ మాఫియా రాష్ట్ర ఖజానా మొత్తం దోస్తున్నారంటూ జగన్ విమర్శించారు.

అమరావతి పేరుతో చేస్తున్న దోపిడీ స్కాములనింటికీ పరాకాష్ట. ఈ స్కామ్ కోసం జ్యుడీషియల్‌ ప్రివ్యూను, రివర్స్ టెండరింగ్ ని రద్దు చేసేశారు. దోపిడీ కోసం మొబిలైజేషన్ అడ్వాన్స్‌ని మళ్లీ తీసుకొచ్చారు. నిర్మాణాలకు అడుగుకి 9వేలకి టెండర్లు ఇచ్చారు. వీళ్లేమైనా బంగారంతో కడుతున్నారా..? అంటూ జగన్ ప్రశ్నించారు. ఎస్ఎఫ్టీకి రూ.4వేలు పెడితే ఇటాలియన్ మార్బుల్స్‌తో లగ్జరీ భవనాలు కట్టొచ్చు. అసెంబ్లీ, సచివాలయం ఆరు లక్షల ఎస్ఎఫ్టీ విస్తీర్ణంలో ఆల్రెడీ ఉన్నాయి. మళ్లీ కొత్తగా కడుతున్నారట.. మొత్తం ఉద్యోగులు 12వేల మంది లేరు 50లక్షల ఎస్ఎఫ్టీ నిర్మాణాలు ఎందుకు..? అంటూ జగన్ ప్రశ్నించారు.

హైదరాబాద్ లో కేసీఆర్ కట్టిన సచివాలయం 8 లక్షల ఎస్ఎఫ్టీ విస్తీర్ణం లో 616 కోట్లకు కట్టారు. కొత్తవి కట్టాలనే ఆలోచన ఉన్నప్పుడు తాత్కాలికాలు కట్టడం ఎందుకు? కొత్తవి కట్టడం వల్ల 600 కోట్లు గంగపాలు చేసినట్లే కదా..? అప్పులు తీసుకొచ్చి కొత్త భవనాలు ఎందుకు..? అమరావతి రోడ్లకు కిలో మీటర్ కు 11 కోట్లు ఉంటే 15కోట్లకు పెంచారు. అమరావతి కోసం చేస్తున్న అప్పులు ఆకాశాన్ని అంటుతున్నాయని జగన్ అన్నారు. ఇప్పటి వరకు 50వేల కోట్లకుపైగా అప్పలు చేశారు. అవి చాలవని 77వేల కోట్లకుపైగా అప్పులు కావాలని అంటున్నారని జగన్ విమర్శించారు.

రాష్ట్రం కోసం చంద్రబాబు చెయ్యాలంటే విజయవాడ, గుంటూరు మధ్యలో 500 కోట్లు ఖర్చు పెట్టి భవనాలు కట్టు. భవిష్యత్తులో విజయవాడ, గుంటూరు నగరాలు కలుస్తాయి. పెద్ద నగరం ఏర్పడుతుంది. అమరావతి పేరుతో మీరు చేస్తున్న హడావిడికి ఇప్పటికే గుంటూరు, విజయవాడలో రియల్ ఎస్టేట్ పడిపోయిందని జగన్ విమర్శించారు.