YS Jagan: గర్వపడేలా చేశావు.. చిన్న కుమార్తెను అభినందిస్తూ వైఎస్ జగన్ భావోద్వేగ ట్వీట్
ప్రపంచ ప్రతిష్టాత్మక కింగ్స్ కాలేజ్ నుంచి మాస్టర్ ఆఫ్ సైన్స్ (ఫైనాన్స్) పట్టా అందుకున్న సందర్భంగా కుమార్తె వర్షారెడ్డిని జగన్ మోహన్ రెడ్డి అభినందిస్తూ

Ys Jagan Mohan Reddy Family
YS Jagan: వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ట్విటర్ వేదికగా తన సతీమణి భారతి, వారి ఇద్దరు కుమార్తెలతో కలిసిఉన్న ఫొటోను ట్విటర్ లో షేర్ చేశారు. ఈ సందర్భంగా చిన్న కుమార్తె వర్షారెడ్డిని అభినందిస్తూ.. మేము గర్వపడేలా చేశావు అంటూ అభినందించారు. జగన్ తన సతీమణి భారతితో కలిసి లండన్ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. వారి చిన్నకుమార్తె వర్షారెడ్డి లండన్ లోని ప్రతిష్టాత్మక కింగ్స్ కాలేజ్ నుంచి ఎంఎస్సీ ఫైనాన్స్ పట్టా అందుకుంది. ఈ క్రమంలో ఈనెల 16న జరిగిన కుమార్తె డిగ్రీ ప్రధానోత్సవ కార్యక్రమం (స్నాతకోత్సవం)లో సతీమణితో కలిసి జగన్ పాల్గొన్నారు.
ప్రపంచ ప్రతిష్టాత్మక కింగ్స్ కాలేజ్ నుంచి మాస్టర్ ఆఫ్ సైన్స్ (ఫైనాన్స్) పట్టా అందుకున్న సందర్భంగా కుమార్తె వర్షారెడ్డిని జగన్ మోహన్ రెడ్డి అభినందిస్తూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ లో సతీమణి భారతి, ఇద్దరు కుమార్తెలతో ఉన్న ఫొటోను షేర్ చేశారు. ‘‘అత్యంత ప్రతిష్టాత్మకమైన కింగ్స్ కాలేజ్ లండన్ లో చదివి పట్టభద్రురాలవడంతోపాటు, డిస్టింక్షన్ లో ఉత్తీర్ణత సాధించి మాకు ఎంతో గర్వకారణమయ్యావు. ఆ దేవుడి ఆశీస్సులు నీపై ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’’ అంటూ జగన్ మోహన్ రెడ్డి ట్వీట్ లో పేర్కొన్నారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి క్విడ్ ప్రోకో కేసులకు సంబంధించి సీబీఐ దాఖలు చేసిన కేసులో షరతులతో కూడిన బెయిల్ పై ఉన్నారు. ఆయన విదేశాలకు వెళ్లాలంటే సీబీఐ కోర్టు అనుమతి తీసుకోవాల్సి ఉంది. లండన్ లో చదువుతున్న తన రెండో కుమార్తె వర్షారెడ్డి డిగ్రీ పూర్తి చేసింది. ఆమె డిగ్రీ పట్టా ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు లండన్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని జగన్ కోర్టును ఆశ్రయించాడు. దీంతో పరిగణలోకి తీసుకున్న నాంపల్లి కోర్టు జగన్ కు విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలో జగన్ మోహన్ రెడ్డి దంపతులు మంగళవారం లండన్ వెళ్లారు. ఈ నెలాఖరు వరకు జగన్ దంపతులు లండన్ లోనే ఉండనున్నారు.
2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓటమి తరువాత వైఎస్ జగన్ వెళ్లిన తొలి విదేశీ పర్యటన ఇదే. గతేడాది మే నెలలో జగన్ చివరి విదేశీ పర్యటనకు వెళ్లారు. ఏపీలో ఎన్నికల పోలింగ్ ముగిసిన తరువాత జగన్ విదేశీ పర్యటనకు వెళ్లారు. తన కుటుంబంతో కలిసి యూకే, స్విట్జర్లాండ్ లలో జగన్ పర్యటించిన విషయం తెలిసిందే.
Congratulations dear! Not only have you graduated from a prestigious institute such as King’s College London, but you have made us proud passing with distinction! God bless you dear! pic.twitter.com/8QN5qrGOEe
— YS Jagan Mohan Reddy (@ysjagan) January 16, 2025