Vallabhaneni Vamsi : ముగిసిన కస్టడీ.. పోలీసుల ప్రశ్నలకు వంశీ చెప్పిన సమాధానం ఇదే..
సెల్ ఫోన్ ఇంట్లోకి ఎందుకు తీసుకెళ్లారు? ఫోన్ ఎక్కడ పెట్టారు? ఎవరెవరికి ఫోన్ చేశారు?

Vallabhaneni Vamsi : వల్లభనేని వంశీ పోలీస్ కస్టడీ ముగిసింది. మూడో రోజు దాదాపు మూడున్నర గంటల పాటు కృష్ణలంక పోలీసులు వంశీని ప్రశ్నించారు. సత్యవర్ధన్ కిడ్నాప్, బెదిరింపులకు సంబంధించి పాత్రధారులపై పోలీసులు కీలకంగా ప్రశ్నించారు. అరెస్ట్ సమయంలో వంశీ తన సెల్ ఫోన్ ను ఎక్కడ దాచారని కూడా అడిగినట్లు తెలుస్తోంది. తనకు ఏమీ తెలియదని, గుర్తు లేదని వంశీ పదే పదే చెప్పినట్లు పోలీసులు చెబుతున్నారు.
కస్టడీ ముగియడంతో వైద్య పరీక్షల కోసం వంశీని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పోలీసులు. అనంతరం కోర్టులో హాజరుపరిచి విజయవాడ సబ్ జైలుకి తరలించారు. ఈ మూడు రోజుల కస్టడీలో పోలీసులు వంశీని ప్రశ్నించారు. ఎన్ని ప్రశ్నలు అడిగినా పదే పదే గుర్తు లేదు, తనకు తెలియదని చెప్పినట్లు తెలుస్తోంది.
Also Read : నేతల వరుస రాజీనామాలతో ఓవైపు టెన్షన్.. మరోవైపు ఆధిపత్య పోరు.. రగడకు చెక్ పెట్టకపోతే ఇక..
మూడో రోజు విచారణలో.. సత్యవర్ధన్ స్టేట్ మెంట్ ఆధారంగా వంశీ, లక్ష్మీపతి, శివరామకృష్ణలను వేర్వేరుగా పోలీసులు విచారించినట్లు సమాచారం. మూడో రోజు విచారణలో ప్రధానంగా సత్యవర్ధన్ కిడ్నాప్ కి సంబంధించి పోలీసులు విచారించినట్లు తెలుస్తోంది. సత్యవర్ధన్ ను మీరే కిడ్నాప్ చేయించారంటూ లక్ష్మీపతి, శివరామకృష్ణ వెల్లడించినట్లు.. దీనికి మీరు ఏ సమాధానం చెబుతారు? అని చివరి రోజు విచారణలో పోలీసులు కాస్త గట్టిగానే వంశీని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. నాకు తెలియదు, కిడ్నాప్ కు నాకు ఎలాంటి సంబంధం లేదు అంటూ వంశీ చెప్పినట్లు తెలుస్తోంది.
సెల్ ఫోన్ ఇంట్లోకి ఎందుకు తీసుకెళ్లారు? ఫోన్ ఎక్కడ పెట్టారు? ఎవరెవరికి ఫోన్ చేశారు? అని వంశీని పోలీసులు ప్రశ్నించినట్లు సమాచారం. ఈ కేసుకి తనకు ఎలాంటి సంబంధం లేదని వంశీ తేల్చి చెప్పారట. వివిధ పనుల మీద వివిధ ప్రదేశాలకు వెళ్తాను.. దాన్ని మీరు పరిగణలోకి ఎలా తీసుకుంటారు? అని పోలీసులను వంశీ ఎదురు ప్రశ్న అడిగారట.
Also Read : పవన్లో అదే ఫైర్.. వైసీపీకి తన మార్క్ ట్రీట్మెంట్.. ఏం చేస్తున్నారో తెలుసా?
మొత్తంగా ఈ మూడు రోజుల కస్టడీలో పోలీసులు రాబట్టాలనుకున్న సమాచారం రాలేదని తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో మరోసారి వంశీని కస్టడీలోకి తీసుకోవాలనే ఆలోచనలో పోలీసులు ఉన్నారట. మరో 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు పిటిషన్ వేసేందుకు సిద్ధమవుతున్నారట.