రెడ్డీస్ నష్టం రూ.570కోట్లు

రెడ్డీస్ నష్టం రూ.570కోట్లు

Updated On : January 28, 2020 / 1:54 AM IST

ఔషద్ తయారీ సంస్థ డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ ఆర్థిక ఫలితాల విషయంలో ఆనలిస్టుల అంచనాలు తారుమారయ్యాయి. 2019-20 ఆర్థిక సంవత్సరం డిసెంబరు త్రైమాసికంలో భారీ నష్టం చవిచూసింది. ఈ కాలంలో కంపెనీ రూ.569.7కోట్ల నష్టం ప్రకటించింది. 2018-19 క్యూ3లో రూ.485 కోట్ల నికర లాభం ఆర్జించింది. డిసెంబరు త్రైమాసికంలో ఆదాయం రూ.4వేల 384కోట్ల కోట్లకు చేరింది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 14శాతం పెరుగుదల. 

ఎబిటా గతేడాది ఇదే కాలంతో పోలిస్తే 24శాతం అధికమై రూ.వెయ్యి 74కోట్లుగా ఉంది. డిసెంబరు త్రైమాసికంలో అన్ని విభాగాల్లో మెరుగైన పనితీరు కనబరిచామని డాక్టర్ రెడ్డీస్ కో-చైర్మన్ జివి ప్రసాద్ తెలిపారు. బలమైన ఎబిటా మార్జిన్స్ నమోదు చేశామని తెలిపారు. జి-సువారింతో పాటు కొన్ని ఉత్పత్తుల బ్రాండ్ విలువ పడిపోవడం, ఆ మేరకు కేటాయింపులు చేయడం వల్ల నష్టం చవిచూడాల్సి వచ్చిందని కంపెనీ వెల్లడించింది. 

ఈ కేటాయింపులు రూ.వెయ్యి 320 కోట్లుగా ఉన్నాయని డాక్టర్ రెడ్డీస్ సీఎఫ్ఓ సౌమెన్ చక్రవర్తి, సీఈఓ ఎరెజ్ ఇజ్రాయెలి సోమవారమిక్కడ మీడియాకు తెలిపారు. 

కలిసొచ్చిన గ్లోబల్ జనరిక్స్:
కంపెనీకి గ్లోబల్ జనరిక్స్ కలిసొచ్చాయి. ఈ విభాగం నుంచి ఆదాయం రూ.3వేల 593కోట్లుగా ఉంది. క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 15శాతం పెరుగుదల. యూరప్, కొత్తగా ఉద్భవిస్తున్న మార్కెట్లు, భారత్ ఈ ఆదాయ వృద్ధికి దోహదం చేశాయి. ఉత్తర అమెరికా నుంచి 8శాతం వృద్ధితో రూ.వెయ్యి 600కోట్ల ఆదాయం సమకూరింది. యూఎస్ మార్కెట్లో ఈ త్రైమాసికంలో కంపెనీలో 5కొత్త ఉత్పత్తులు విడుదల చేసింది. ఎమర్జింగ్ మార్కెట్ల నుంచి రూ.920కోట్లు, భారత్ నుంచి రూ.763 కోట్ల రెవెన్యూ నమోదైంది. యూరప్ నుంచి 52శాతం వృద్ధితో రూ.310కోట్ల రెవెన్యూ సాధించింది.