Gold Price: వామ్మో.. ఎన్నడూ లేనంత ఎగబాకిన బంగారం ధర
కొన్ని నెలల్లో 10 గ్రాముల బంగారం ధర రూ.1 లక్ష చేరే అవకాశాలు లేకపోలేదు.

బంగారం ధరలు పైపైకి వెళ్తున్నాయి. 24 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర నిన్న సాయంత్రం నాటికి బులియన్ విపణిలో రూ.94,000కు చేరింది. గ్లోబల్ మార్కెట్లో ఔన్సు పసిడి ధర 3147 డాలర్లకు పెరిగింది. హైదరాబాద్లో 10 గ్రాముల ధర రూ.94,200కు చేరుకుంది.
గత రాత్రి 11 గంటలకు గ్లోబల్ మార్కెట్లో ఔన్సు ధర 3110 డాలర్లకు తగ్గింది. భారత్లో బంగారం ధర ధర రూ.93,500కు చేరింది. జనవరి 1 నుంచి నిన్నటివరకు 10 గ్రాముల బంగారం ధర 18.6 శాతం పెరిగింది. ఇక కిలో వెండి ధర రూ.1,01,750గా ఉంది.
బంగారం ధర నిన్న ఒక్క రోజులో రూ.2,500 పెరిగింది. కొన్ని నెలల్లో 10 గ్రాముల బంగారం ధర రూ.1 లక్ష చేరే అవకాశాలు లేకపోలేదు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్లు విధిస్తారన్న భయంతో పెట్టుబడిదారులు సురక్షితమైన పెట్టుబడుల వైపుగా మళ్లుతున్నారు. బంగారంపై ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఆభరణాల వ్యాపారులు కూడా భారీగా కొనుగోళ్లు చేస్తుండడంతో బంగారం ధర జీవితకాల గరిష్ఠానికి చేరింది.
Also Read: గూగుల్ పిక్సెల్ 10 ప్రో ఫోల్డ్ డిజైన్ ఎంత అద్భుతంగా ఉందో చూడండి.. కొంటారా?
ఈ ఏడాది ఇప్పటివరకు బంగారం ధర 18 సార్లు కొత్త గరిష్ఠాలను చేరుకుంది. గత ఏడాది మొత్తం కలిపి 40 సార్లకు పైగా ఆల్టైమ్ గరిష్టాలను నమోదుచేసుకుంది. ప్రపంచంలో ఆర్థిక మాంద్యం ముప్పు పొంచి ఉంటుందని, యూఎస్ ఫెడరల్ రిజర్వ్ రేటు కోతలు ఉంటాయని ఊహాగానాల మధ్య బంగారంపై పెట్టుబడులు పెరిగిపోతున్నాయి.
వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్ ప్రకారం.. 2019 నాటికి ఇండియన్ల వద్ద దాదాపు 24,000–25,000 టన్నుల మధ్య బంగారం ఉంది. మరోవైపు, ఐదేళ్లలో రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా 258 టన్నుల పసిడిని అదనంగా కొనుగోలు చేసింది. ఏడాదిలో ఇండియన్ల వద్ద పసిడి రూపంలో ఉన్న సంపద రూ.60 లక్షల కోట్లు వృద్ధి చెందింది. గత ఏడాది ఇండియా 3,627 టన్నుల పసిడిని దిగుమతి చేసుకుంది.