Uttarakhand : ఉత్తరాఖండ్లో ఘోర ప్రమాదం.. లోయలో పడిన టెంపో ట్రావెలర్.. 14 మంది దుర్మరణం
Uttarakhand Accident : 26 మంది ప్రయాణికులతో వెళ్తున్న టెంపో ట్రావెలర్ లోతైన లోయలో పడిపోవడంతో 14 మంది దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదంలో 16 మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు.

14 dead after vehicle with 26 passengers ( Image Source : Google )
Uttarakhand : ఉత్తరాఖండ్లోని రుద్రప్రయాగ్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. శనివారం (జూన్ 15న) 26 మంది ప్రయాణికులతో వెళ్తున్న టెంపో ట్రావెలర్ లోతైన లోయలో పడిపోవడంతో 14 మంది దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదంలో 16 మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు. ఈరోజు ఉదయం 11 గంటల సమయంలో వాహనం అదుపు తప్పి బద్రీనాథ్ జాతీయ రహదారిపై అలకనంద నది ఒడ్డుకు దాదాపు 250 మీటర్ల దూరంలో పడిపోయింది. రెస్క్యూ ఆపరేషన్ మొదలు కాగా, తీవ్రంగా గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు.
గాయపడిన 16 మందిలో ఏడుగురిని ఎయిమ్స్ రిషికేశ్కు తరలించగా, తొమ్మిది మందిని రుద్రప్రయాగ్ జిల్లా ఆసుపత్రిలో చేర్చారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని రుద్రప్రయాగ్ ఎస్పీ విశాఖ అశోక్ భదానే తెలిపారు. ప్రమాదంపై ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి విచారం వ్యక్తం చేశారు. వెంటనే ఈ ఘటనపై విచారణకు జిల్లా మేజిస్ట్రేట్ను ఆదేశించినట్లు తెలిపారు. మృతుల కుటుంబానికి తన సంతాపాన్ని తెలియజేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని బాబా కేదార్ని ప్రార్థిస్తున్నానని ఆయన తన అధికారిక హ్యాండిల్లో పోస్టు చేశారు.
जनपद रुद्रप्रयाग में टेम्पो ट्रैवलर के दुर्घटनाग्रस्त होने का अत्यंत पीड़ादायक समाचार प्राप्त हुआ। स्थानीय प्रशासन व SDRF की टीमें राहत एवं बचाव कार्यों में जुटी हुई है। घायलों को नज़दीकी चिकित्सा केंद्र पर उपचार हेतु भेज दिया गया है। ज़िलाधिकारी को घटना की जाँच के आदेश दे दिए…
— Pushkar Singh Dhami (@pushkardhami) June 15, 2024
స్థానిక అడ్మినిస్ట్రేషన్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలలో పాల్గొన్నారు. ప్రయాణికులు ఢిల్లీ/ఘజియాబాద్ నుంచి చోప్తా తుంగనాథ్కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50వేల చొప్పున పరిహారాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. మరణించిన ప్రతి మృతుడి బంధువులకు పీఎమ్ఎన్ఆర్ఎఫ్ నుంచి రూ. 2 లక్షల ఎక్స్గ్రేషియా, గాయపడిన వారికి రూ. 50వేల పరిహారం అందించనున్నట్టు తెలిపారు.