మరో మిస్సింగ్ కేసు నమోదు: హాజీపూర్ లో కొనసాగుతున్న ఉద్రిక్తత

యాదాద్రి: యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం హాజీపూర్లో ఉద్రిక్తత కొనసాగుతోంది. గ్రామంలో పోలీసులు భారీగా మోహరించారు. 6వ తరగతి విద్యార్థిని కల్పనను కూడా తానే చంపానని శ్రీనివాస్రెడ్డి పోలీసుల విచారణలో అంగీకరించాడు. శ్రీనివాస్రెడ్డికి సంబంధించిన మరో బావిలోంచి కల్పన మృతదేహాన్ని పోలీసులు వెలికి తీస్తున్నారు. ఇప్పటికే శ్రావణి, మనీషాను హత్య చేసినట్లు ఒప్పుకున్న శ్రీనివాస్రెడ్డి.. కల్పనను కూడా చంపాడని తెలియడంతో గ్రామస్తుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది.
నాలుగేళ్ల క్రితం మిస్సైన కల్పన ఎక్కడో ఒక చోట క్షేమం గా ఉందని కుటుంబ సభ్యలు భావించారు. కానీ కల్పన కూడా హత్యకు గురైందని తెలియటంతో కుటుంబ సభ్యుల రోదన వర్ణనాతీతంగా ఉంది. కాగా… మంగళవారం మధ్యాహ్నానికి బోమ్మల రామారం పోలీసు స్టేషన్ లో మరో మిస్సింగ్ కేసు నమోదైంది. రాచకోండ పోలీసు స్టేషన్ పరిధిలో గత నాలుగేళ్లలో మిస్సైన వారి వివరాలను తెలపాలని పోలీసులు కోరటంతో కొద్దిసేపటి క్రితం ఈకేసు నమోదైంది. ఇప్పటి వరకు శ్రావణి,మనీషా,కల్పనల హత్యల గురించి శ్రీనివాస రెడ్డి ఒప్పుకున్నాడు. ఈ మధ్యాహ్నం రిజిష్టరైన నాలుగో కేసు గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఆ కేసుకు శ్రీనివాస రెడ్డికి ఏమైనా సంబంధం ఉన్నదా అనేది పోలీసుల విచారణలో తేలనుంది.