పీపీఈ కిట్ ధరించి రూ.6కోట్ల విలువైన వజ్రాభరణాలు, బంగారం చోరీ

పీపీఈ కిట్ ధరించి రూ.6కోట్ల విలువైన వజ్రాభరణాలు, బంగారం చోరీ

Updated On : January 21, 2021 / 3:37 PM IST

Burglars Wearing PPE Kits Rob Jewellery Store In south east delhi : కరోనా టైమ్ లో వచ్చిన పీపీఈ కిట్ ఒక ఘరానా దొంగ పాలిట వరంగా మారింది. పీపీఈ కిట్ ధరించి ఒక జ్యూయలరీ షాపులో 6 కోట్ల విలువైన వజ్రా భరణాలు, బంగారు నగలు దోచుకెళ్లాడు. ఈ ఘటన ఇటీవలి కాలంలో ఢిల్లీలో జరిగిన అతి పెద్ద చోరీ గా పోలీసులు వర్ణిస్తున్నారు.

ఆగ్నేయ ఢిల్లీలోని కల్కాజీ లోని అంజలీ జ్యూయలరీ షోరూంలో జనవరి 19వ తేదీ రాత్రి గం. 9-40 కి ప్రవేశించిన దొంగ తెల్లవారుఝూమున గం.3-50 వరకు తన దోపిడీ కొనసాగించాడు. 20వ తేదీ ఉదయం షాపు తీసిన మేనేజర్ షాపులో దొంగతనం జరిగినట్లు గుర్తించాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు.

ఘటనా స్ధలానికి వచ్చిన పోలీసులు సీసీటీవీ ఫుటేజి పరిశీలించారు. దుండగుడు పక్కనున్న బిల్డింగ్ మీద నుంచి జ్యూయలరీషాపు బిల్డింగ్ లోకి వచ్చినట్లు గుర్తించారు. దోపిడీలో ఎంత మంది పాల్గోన్నది పూర్తిగా తెలియలేదు. ఒక వ్యక్తి మాత్రం పీపీఈ కిట్ ధరించి దోపిడీ చేసినట్లు స్పృష్టంగా తెలిసింది. జ్యూయలరీ షాపు బయట ఐదుగురు కాపలా సిబ్బంది ఉండటంతో, నిందితుడి ఎదురు కుండా ఉన్న బిల్డింగ్ ఎక్కి అందులోంచి జ్యూయలరీ షాపులోకి  ప్రవేశించినట్లు తెలుసుకున్న్నారు.

పీపీఈ కిట్ ధరించటం వలన దుండగుడ్ని గుర్తించటం కష్టంగా మారింది. మాస్క్ ధరించటం వలన అతని ముఖ కవళికలు తెలియలేదు, చేతులకు గ్లౌజులు ధరించటంతో వేలి ముద్రలు కూడా లభించలేదు. డాగ్ స్క్వాడ్, ఫోరెన్సిక్ నిపుణుల బృందం ఘటానా స్ధలంలో ఆధారాలు సేకరించారు. దోపిడీ చేసిన మొత్తాన్ని రెండుసంచుల్లో తీసుకువెళ్ళినట్లు గుర్తించిన పోలీసులు, నిందితుడిని పట్టుకోటానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.