అగ్నిప్రమాదంపై విచారణకు ఆదేశించాం : మేయర్ బొంతు రామ్మోహన్
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరిగిన భారీ అగ్ని ప్రమాద ఘటనపై జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ స్పందించారు.

నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరిగిన భారీ అగ్ని ప్రమాద ఘటనపై జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ స్పందించారు.
హైదరాబాద్ : నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. స్టాల్స్కు మంటలు వ్యాపించాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో సందర్శకులు భయంతో పరుగులు తీశారు. దీంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలార్పుతున్నారు. అగ్నిప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది.
నుమాయిష్ జరుగుతుండటంతో ఎగ్జిబిషన్ గ్రౌండ్ సందర్శకులతో కిక్కిరిసిపోయింది. పెద్ద సంఖ్యలో సందర్శకులు ఎగ్జిబిషన్కు తరలివచ్చారు. 2019, జనవరి 30వ తేదీ బుధవారం రాత్రి అనూహ్య రీతిలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. తొక్కిసలాటలో చాలామందికి గాయాలయ్యాయి. ఇంకా అనేకమంది స్టాల్స్లో చిక్కుకుపోయారు. వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్లో పెద్ద సంఖ్యలో స్టాల్స్ కొలువుదీరాయి. ఆంధ్రా బ్యాంకు ఏర్పాటు చేసిన స్టాల్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం జరిగిందని ప్రాథమిక సమాచారం అందుతోంది.
ప్రమాద ఘటనపై జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ స్పందించారు. 250 స్టాల్స్ కాలిపోయాయని ప్రకటించారు. మంటలు అదుపులోకి వచ్చాయని తెలిపారు. అగ్నిప్రమాదంపై విచారణకు ఆదేశించామని పేర్కొన్నారు. భారతదేశంలో అతిపెద్ద అగ్నిప్రమాదంగా అభివర్ణించవచ్చన్నారు. 50 ఎకరాల్లోని షాప్ లో జరిగిన అగ్నిప్రమాదాన్ని కంట్రోల్ చేయడం జరిగిందన్నారు. ఆస్తినష్టం జరిగిందని..అదృష్టవశాత్తు ప్రాణ నష్టం జరగలేదని తెలిపారు.