ప్రేమిస్తే చావేనా : రెండు ప్రేమ జంటలు సూసైడ్

రంగారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. వేర్వేరు ఘటనల్లో రెండు ప్రేమ జంటలు సూసైడ్ చేసుకోవటంతో ఆ కుటుంబాలు విషాదంలో మునిగిపోయాయి.
వివరాల్లోకి వెళితే .. షాబాద్ మండలం, లింగారెడ్డి గూడకు చెందిన ప్రేమికులు పల్లవి(19) ఆశమల్ల మహేందర్ లు చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరిద్దరూ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇరు కుటుంబాలు వీరి ప్రేమ పెళ్లికి ఒప్పుకోకపోవడంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
కేశంపేట మండలం తొమ్మిదిరేకులలో:
కేశంపేట మండలం తొమ్మిదిరేకులలో.. మరో ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసుల ఇచ్చిన సమాచారం ప్రకారం.. తొమ్మిదిరేకుల గ్రామానికి చెందిన నాగిళ్ల శ్రీరామ్, సుశీల కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. విషయం తెలుసుకున్న అమ్మాయి తల్లిదండ్రులు సుశీలను మందలించారు. దీంతో, మనస్తాపానికి గురైన సుశీల ఆదివారం అర్ధరాత్రి ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ప్రియురాలు సుశీల చనిపోయిన విషయాన్ని తెలుసుకున్న శ్రీరామ్.. ఊరి చివర రోడ్డు పక్కన ఉన్న మర్రిచెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఒకే రోజు గ్రామంలో ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడడంతో విషాదం నెలకొంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం షాద్ నగర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నారు.