తొలి విడత పరిషత్ ఎన్నికలకు సర్వం సిద్ధం

తెలంగాణలో తొలి విడత పరిషత్ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. జిల్లా పరిషత్, మండల పరిషత్ తొలి విడత ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మే 6, 2019న ఎన్నికలు జరుగనున్నాయి. తొలి విడత ఎన్నికల్లో భాగంగా 197 జెడ్పీటీసీ స్థానాలు, 2,166 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి.
ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మాత్రం పోలింగ్ను సాయంత్రం 4గంటల వరకే అధికారులు పరిమితం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల, ములుగు, కొమరం భీం అసిఫాబాద్ జిల్లాల్లో సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది.
తొలివిడత పరిషత్ ఎన్నికలకు .. ఈసీ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. ఎంపీటీసీ అభ్యర్థులకు తెలుపు రంగు బ్యాలెట్ పేపర్, జెడ్పీటీసీ అభ్యర్థులకు గులాబీ రంగు బ్యాలెట్ పేపర్లు వాడుతున్నట్లు ఈసీ వెల్లడించింది. ఈసారి ఓటర్ల ఎడమ చేతి మధ్య వేలుకు సిరా చుక్క పెట్టనున్నట్లు తెలిపింది. తొలివిడత ప్రచారం కోసం వచ్చిన స్థానికేతరులు ఆయా ప్రాంతాలను వదలి వెళ్లాలని ఆదేశించింది.
తొలి విడతలో మొత్తం 2వేల 166 ఎంపీటీసీ స్థానాలకు నోటిఫికేషన్ జారీ చేయగా.. 69 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో 2వేల 97 స్థానాల్లో పోలింగ్ నిర్వహించేలా రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. ఈ విడతలో 197 జడ్పీటీసీ స్థానాలకు నోటిఫికేషన్ ఇవ్వగా, నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లో ఒక్కో జడ్పీటీసీ స్థానం ఏకగ్రీవమయ్యాయి. దీంతో 195 జడ్పీటీసీ స్థానాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. మే 27న ఫలితాలు వెలువడనున్నాయి.
పరిషత్ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు మద్యం, డబ్బు, ఇతర వస్తువులు పంపిణీ చేసేవారిపై నిఘా పెడుతున్నారు. పోలీసులు ఇప్పటి వరకు నిర్వహించిన తనిఖీల్లో 70 లక్షలకు పైగా నగదు, 30 లక్షల విలువచేసే వివిధ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన 95 మందిపై కేసులు నమోదుచేసినట్టు ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు.